వినాయక చవితి స్పెషల్ రెసిపీస్

 

 

రాగిలడ్డు (వినాయక చవితి స్పెషల్)

 

 

కావలసిన పదార్ధాలు :-

రాగి పిండి - 1 కప్పు 

నెయ్యి  - 1/2 కప్పు 

చెక్కర లేక బెల్లం - 1 కప్పు 

అవిసె గింజలు లేక నువ్వుల పప్పు - చెంచా 

చిన్నగా ముక్కలు చేసిన జీడిపప్పు -  2 చెంచాలు 

 

తయారీ విధానం:-

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రాగిపిండి వేసి చిన్న మంటపై వేయించుకోవాలి. అది వేగి నోట్లో చిటికెడు వేసుకుంటే పొడి కరకరలాడాలి అలా కదుపుతూ కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకొని చేయి పట్టే వేడి ఉండేవరకు చల్లర్చుకోవాలి. ఇప్పుడు కొద్ది బరకగా పొడి కొట్టుకున్న చెక్కర గాని, బెల్లం సన్నని తురుము గాని కలుపుకుని వేయించి ఉంచుకొని ఉన్న నువ్వులు, జీడిపప్పు పొడివేసి.. వేడి నేతిలో ఈ పిండిని సున్నుండలా కలుపుతూ ఉండలు చుట్టాలి. ఇవి రుచికి చాలా బావుంటాయి ఆరోగ్యానికి ఎంతో మంచివి.

 

ఉండ్రాళ్ళు (వినాయక చవితి స్పెషల్)

 

 

వినాయకచవితి పండుగ రోజు గణపతికి పెట్టే ప్రసాదాల్లో ముఖ్యంగా ముందు వరుసలో ఉండేది ఉండ్రాళ్లు. మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..


కావలసిన పదార్దాలు:

బియ్యం రవ్వ  - 1 కప్పు

నూనె  - 2 చెంచాలు

జీలకర్ర  -  1/2 స్పూన్

ఉప్పు - 1/2 స్పూన్

సెనగపప్పు - 3 స్పూన్స్

నీళ్ళు - 2 కప్పులు

 
తయారీ విధానం:

బియ్యంరవ్వను.... (మిక్సిలో బియ్యం ఆడించి.. వచ్చిన రవ్వను జల్లించి..పైన వచ్చిన రవ్వను) ఉండ్రాళ్ళకు వాడతారు. ముందుగా దళసరి గిన్నె తీసుకుని 1 కప్పు రవ్వఅయితే... 2 కప్పుల నీళ్ళు గిన్నెలో పోసి...సెనగపప్పు వేసి జీలకర్రతో పాటు 2 స్పూన్స్ నూనె కలపాలి. బాగా మరుగుతున్న నీటిలో రవ్వ కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి. పూర్తిగా రవ్వ పోసికలిపి మూత పెట్టాలి. అలా సిమ్ లో 5 నుంచి పదినిమిషాలలోపు ఉంచితే రవ్వ పలుకు లేకుండా ఉడుకుతుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి మగ్గాక వెడల్పు పళ్ళెం లేక బేసినలోకి ఈ రవ్వను తీసి చల్లారనిచ్చి తడి చేతికి కొద్దిగా నేయి రాసుకుని ఉండలుగా చుట్టాలి...అంతే ఉండ్రాళ్ళు రెడీ....

 

జిల్లేడు కాయలు

 

 

వినాయకునికి ఉండ్రాళ్లు, కుడుములతో పాటు జిల్లేడు కాయలని కూడా ఆరగింపుగా పెడతారు. వినాయకుని నైవైద్యంలో ప్రతీ వంటంక ఆవిరి మీద  ఉడికించినదే. ఈ జిల్లేడు కాయలు కూడా అంతే. చేయడం సులువు... రుచిగా కూడా ఉంటుంది.


కావలసిన పదార్ధాలు:

బియ్యపు పిండి - 2 కప్పులు

బెల్లం  - 1 కప్పు

కొబ్బరి తురుము- 1/2 కప్పు

జీడిపప్పు- 4 చెమ్చాలు

కిస్మిస్- 4 చెమ్చాలు

నువ్వులు- పావుకప్పుడు

పల్లీలు- పావు కప్పుడు

నీళ్లు- రెండు కప్పులు

ఉప్పు- రుచికి తగినంత

యాలుకుల పొడి - చిటికెడు

 
తయారీ విధానం:

ముందుగా నీళ్లని ఒక వెడల్పాటి గిన్నెలో పోసి బాగా మరిగించాలి. అవి కళపెళ మరుగుతుండగా బియ్యపు పిండిని కొంచం, కొంచం పోస్తూ కదుపుతూ ఉండాలి ( బియ్యపు పిండిలో ముందుగానే ఉప్పు కలిపి ఉంచాలి). ఉండలు చుట్టకుండా చూసుకోవాలి. పిండి ఉడికి గిన్నెని వదులుతుండగా స్టవ్ ఆపేసి దించాలి. ఇప్పుడు ఒక బాణలిలో పల్లీలని, నువ్వులని విడివిడిగా ఎర్రబడే వరకూ వేయించి ఆరనివ్వాలి. ఆరాకా మరీ మెత్తగా కాకుండా బరక బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ లోకి కొబ్బరి తురుము, పల్లీలు, నువ్వుల పొడి, బెల్లం తురుము, యాలుకుల పొడి, అలాగే జీడిపప్పు, కిస్ మిస్ ( వీటిని వేయించుకోవద్దు. సన్నగా కట్ చేసుకోవాలి) తీసుకొని వాటిని బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బియ్యపు పిండిని చిన్న ఉండలుగా చేసి నెమ్మదిగా చేతితో వత్తుకోవాలి. ( పూరీలలా అరచేతి సైజులో ఉండాలి). అలా వత్తిన పిండి మధ్యలో కొబ్బరి తురుము మిశ్రమాన్ని పెట్టి, కజ్జికాయలని మడిచినట్టు మధ్యకి మడవాలి (చూడటానికి కజ్జికాయలలా వస్తాయి). చూట్టూ చేతితో వత్తితే పిండి మధ్యలో మిశ్రమం ఉంటుంది. ఆఖరిగా అలా సిద్దమయిన జిల్లేడు కాయలని ఒక కుక్కర్ గిన్నెలో పెట్టి ఆవిరిమీద ఒక పది నిమిషాలు ఉడికించాలి (ఎక్కువ సేపు ఉంచకూడదు విడిపోతాయి).