టమాటా పలావు 

 

 

 

 

కావలసినవి:

బాస్మతి రైస్ -నాలుగు కప్పులు 

టమాటాలు - పావుకేజీ 

పచ్చికొబ్బరి - ఒక కప్పు 

పచ్చిమిర్చి - ఐదు 

పుదీనా - ఒక కట్ట 

మిరియాలు - కొద్దిగా 

గరంమసాలా - ఒక స్పూను

ఉల్లిపాయలు - రెండు 

నెయ్యి - ఒక కప్పు 

జీడిపప్పులు - కొద్దిగా

కిస్‌మిస్ - కొద్దిగా 

ఉప్పు - తగినంత

పసుపు - ఒక స్పూను

 

తయారుచేసే విధానం:

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టాలి.  టమాటాలను, తురిమిన కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసి దానిలో ఒక లీటరు నీళ్ళు పోసుకోవాలి. ఈ వాటర్ ను స్టౌ మీద పెట్టి వేడి చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నెయ్యి పోసి అది వేడి అయిన తర్వాత దాంట్లో మిరియాలు,  గరంమసాల, పసుపు వేసి కొంచెం వేగనివ్వాలి. అలాగే పచ్చిమిర్చి, పుదీనా తరిగి వెయ్యాలి. రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళు వంచేసి వేగుతున్న మసాలలో వేసి ఫ్రై చెయ్యాలి. బియ్యం ఐదు నిమిషాలు పాటు వేగిన తరువాత కాగుతున్న టమాటా రసాన్ని బియ్యంలో పోసి దానిలో ఉప్పు వేసి మూతపెట్టి కాసేపు ఉడికించాలి. బియ్యం సగం ఉడికిన తరువాత ఒకసారి కలిపి గిన్నె కింద అట్లపెనం పెట్టి సన్నని మంట మీద పూర్తిగా ఉడికించాలి. గిన్నెలో నుంచి ఉడికిన పలావును డిష్‌లోకి తీసి దానిపై ఎర్రగా వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లు వెయ్యాలి. అంతే ఎంతగానో నోరు ఊరించే టమాటా పలావు సిద్ధం.