దహీ ఆలూ

 

 

కావలసిన పదార్థాలు:

బంగాళాదుంపలు                              - నాలుగు
పెరుగు                                           - ఒకటిన్నర కప్పు
శనగపిండి                                       - రెండు చెంచాలు
ఉల్లిపాయ                                       - ఒకటి
పచ్చిమిర్చి                                      - రెండు
అల్లం వెల్లుల్లి పెస్ట్                              - ఒక చెంచా
జీలకర్ర                                           - ఒక చెంచా
కారం                                              - ఒక చెంచా
ధనియాల పొడి                                 - రెండు చెంచాలు
పసుపు                                           - అరచెంచా
ఉప్పు                                             - తగినంత
ఇంగువ                                           - చిటికెడు
కరివేపాకు                                        - ఒక రెమ్మ
తరిగిన కొత్తిమీర                                 - పావుకప్పు
నూనె                                              - రెండు చెంచాలు

తయారీ విధానం:
బంగాళాదుంపల్ని శుభ్రంగా కడిగి, ఉడికించాలి. తరువాత తొక్క తీసేసి, పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఓ బౌల్ లో పెరుగు, శనగపిండి, కొద్దిగా నీళ్లు వేసి బాగా గిలకొట్టి పక్కన పెట్టాలి. ఉల్లిపాయ, పచ్చి మిరపకాయల్ని ముక్కలుగా కోసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక జీలకర్ర, ఇంగువ వేయాలి. జీలకర్ర చిటపటలాడాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. రంగు మారేవరకూ వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయేవరకూ వేయించాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. ఓ నిమిషం పాటు వేయించాక నాలుగైదు చెంచాల నీళ్లు వేసి కలపాలి. మసాలా ఉడికాక బంగాళాదుంప ముక్కలు వేయాలి. మసాలా బాగా పట్టేలా కలుపుతూ కాసేపు ఉడికించాలి. ఆ తరువాత పెరుగు వేసి కలిపి మూత పెట్టాలి. పెరుగు బాగా చిక్కగా అయ్యేవరకూ ఉడికించి, కొత్తిమీర చల్లి దించేసుకోవాలి.

- sameera