KIDS TALENT
తానా ఆధ్వర్యంలో "తనికెళ్ళ భరణి" గారితో సరదాగా ఓ సాయంత్రం.

 

 

తానా  ఆధ్వర్యంలో "తనికెళ్ళ భరణి" గారితో సరదాగా ఓ  సాయంత్రం.

 

 


 


ప్రముఖ నటులు, రచయిత, దర్శకులు శ్రీ తనికెళ్ళ భరణి గారితో “సరదాగా ఓ  సాయంత్రం” అనే సాహిత్యo మరియు సినిమా కబుర్లతో కూడిన కార్యక్రమం  డల్లాస్ లోని స్థానిక మలంకార చర్చి లో తానా మరియు టాంటెక్స్ ఆధ్వర్యం  లో ఆద్యంతం చాలా ఆసక్తిగా, ఆహ్లాదంగా జరిగింది.


ఈ కార్యక్రమానికి ముందుగా ప్రముఖ కధానాయకుడు శ్రీ నారా రోహిత్ మరియు తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ సతీష్ వేమన గారిని తానా కోశాధికారి - మురళి వెన్నం, సంయుక్త కోశాధికారి – డాక్టర్. రాజేష్ అడుసుమిల్లి, డైరెక్టర్ - చలపతి కొండ్రకుంట, ప్రాంతీయ ప్రతినిధి -  శ్రీకాంత్ పోలవరపు తదితరులు ఘనంగా సత్కరించారు.

నారా రోహిత్ మాట్లాడుతూ తను నటించిన "జ్యో అచ్యుతానంద" చలన చిత్రం విడుదల సందర్భముగా అభిమానులతో కలిసి సినిమా వీక్షించడానికి డల్లాస్ విచ్చేసినట్లు , మంచి సినిమాలని ఆదరించాలని విజ్ణప్తి చేశారు. సతీష్ వేమన మాట్లాడుతూ డల్లాస్ ప్రవాస తెలుగు వారికి ప్రధాన కేద్రంగా మారిందని, తాను డల్లాస్ ని తన రెండవ ఇల్లు గా భావిస్తానని తెలియచేశారు.


తనికెళ్ళ భరణి గారిని తానా పూర్వాధ్యక్షులు - డాక్టర్. ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేస్తూ “మిథునం” అనే ఒక ఆదర్శ ప్రాయమైన సినిమాని తీసిన గొప్ప దర్శకుడు, రచయిత, నటులు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ తనికెళ్ళ భరణి అని వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ముందు ముందు అమెరికాలో ప్రదర్సించే విధం గా భరణి గారి నాయకత్వం లో మంచి నాటికలు తీసుకు రావాలని కోరారు. అటు పిమ్మట తనికెళ్ళ భరణి గారు శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిస్తూ  తాను వ్రాసిన “ఆట గదరా శివా”, “శభాష్ రా శంకరా”, “శివ చిలుక కవితలను” ఆలపించారు. మంచి సినిమాని తీయడం కష్టమైన పనని, ఆర్థికంగా ఇబ్బందులతో కూడుకున్నదని, మిథునం లాంటి మంచి సినిమాలని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలని తీసే అవకాశం ఉంటుందని తెలియచేశారు. మన సమాజంలో మానసిక వికాసం కలగటానికి పిల్లలను కేవలం చదువు మీదే కాకుండా సాహిత్యం, సంగీతం మరియు ఇతర లలిత కళల పట్ల అభిరుచి అవగాహన పెంచుకొనేట్లు తీర్చిదిద్దాలన్నారు. నటనలో సూర్యకాంతం లాగ సహజంగా నటిస్తే అది దుర్మార్గమైన విలన్ పాత్రలో నటించినప్పటికి తనలాంటి ఒక నటుడికి మంచి గుర్తింపు లభిస్తుందని తెలియచేశారు. తాను నాటక రంగంనుంచి వచ్చిన వాడినని, “కొక్కొరొకో” లాంటి నాటకాలు వ్రాసి ప్రదర్శించానని, అమెరికాలో ముందు ముందు నాటకాలను తీసుకు రావడానికి ప్రయత్నిస్తానని తెలియచేశారు. అమెరికాలో తెలుగు చక్కగా మాట్లాడుతూ, సంస్కృతీ సంప్రదాయాలని కాపాడుతున్నారని, తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని తెలియచేశారు. ఇప్పటికీ తెలుగులో శ్రీ శ్రీ, గురజాడ, తిలక్, పానుగంటి వారి సాహిత్యానికి మంచి గుర్తింపు లభిస్తున్నది, ఇటీవలి కాలంలో అంత గొప్ప కవిత్వం రాలేదని తెలియచేశారు. కాళిదాసు, పోతన వంటి గొప్ప కవులు జన్మించిన దేశంలో మనం జన్మించినందుకు మనం గర్వపడాలని పేర్కొన్నారు.


విరామ సమయంలో మైమ్ మధు డ్రీం, వెయిట్ లిఫ్టర్, బర్డ్ అండ్ హంటర్ వంటి థీమ్ ను ప్రదర్శించి శ్రోతలను ఆకట్టుకున్నారు. చివరగా తనికెళ్ళ భరణి గారిని తానా కోశాధికారి - మురళి వెన్నం, సంయుక్త కోశాధికారి – డాక్టర్. రాజేష్ అడుసుమిల్లి, డైరెక్టర్ - చలపతి కొండ్రకుంట, ప్రాంతీయ ప్రతినిధి -  శ్రీకాంత్ పోలవరపు, తానా పూర్వాధ్యక్షులు - డాక్టర్. ప్రసాద్ తోటకూర మరియు టాంటెక్స్ కార్యవర్గ బృందం, అధ్యక్షులు - సుబ్బు జొన్నలగడ్డ, కార్యదర్శి - చిన సత్యం ఘనంగా సత్కరించారు. ఆద్యంతం ఈ కార్యక్రమం హాస్యంగా, ఆహ్లాదంగా సాగి శ్రోతలకు మంచి అనుభూతిని మిగిల్చింది

TeluguOne For Your Business
About TeluguOne
;