RELATED EVENTS
EVENTS
నాట్స్ సంబరాలకు తెలుగువారంతా విచ్చేయండి : నాట్స్ బోర్డ్ పిలుపు

 

 

నాట్స్ సంబరాలకు తెలుగువారంతా విచ్చేయండి : నాట్స్ బోర్డ్ పిలుపు

 

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారంతా విచ్చేయాలని  ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ పిలుపునిచ్చారు. చికాగో వేదికగా జరిగే ఈ సంబరాలను  అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చికాగో నాట్స్ చాప్టర్.. సంబరాల కమిటీ చేస్తున్న ఏర్పాట్లను ఆయన ప్రశంసించారు. చికాగోలో సమావేశమైన నాట్స్ బోర్డ్ డైరక్టర్స్ సమావేశంలో పాల్గొన్న ఆయన సంబరాలకు ఇప్పటిదాకా చేసిన ఏర్పాట్లు.. నాట్స్ జాతీయ కార్యవర్గం దానికి ఇస్తున్న మద్దతును వివరించారు.

 

 

ఇక నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నాట్స్ బీమా పథకాన్ని ఆయన వివరించారు. విద్యార్థుల కోసం నాట్స్ ఒక గొప్ప ప్రయోగమే చేసిందన్నారు.. నాట్స్ మెంబర్‌షిప్ తీసుకున్న విద్యార్థులందరికీ నాట్స్ ఉచితంగా బీమా సదుపాయం కల్పించిందన్నారు.. ఇప్పటి వరకు విద్యార్థులకే పరిమితమైన బీమా పథకాన్ని H1 మరియు విజిటింగ్ వీసా పై వచ్చే వారికి కూడా వర్తింపజేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. బీమా కేవలం పరిహారం వరకే కాదు.. చివరి చూపు కోసం మృతదేహాన్ని తమ వారి దగ్గరకు చేర్చేందుకు కూడా పథకం ఉపయోగపడుతుందని తెలిపారు.. దీనంతటికీ కారణమైన సాయి యర్రాప్రగడ, గంగాధర్ దేసు, బాపు నూతి, రమేష్ నూతలపాటి లకు మన:స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

 

 

ప్రభుత్వ బడులలో ఉన్నత మౌలిక సదుపాయాలు కల్పించడానికి నాట్స్ స్కూళ్ల దత్తత తీసుకునే కార్యక్రమం ప్రారంభించిందని మెహన కృష్ణ మన్నవ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్లను నాట్స్ దత్తత తీసుకుంటోందన్నారు.. వీటిల్లో మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు నిర్మించి, బల్లలు, మధ్యాహ్న భోజన తయారీకి కావాల్సిన పాత్రలు అందిస్తోందన్నారు.. స్కూల్ బ్యాగులు, యూనిఫార్మ్స్, క్రీడా సామాగ్రి, స్టేషనరీ, పుస్తకాలు వంటి కనీస అవసరాలను తీరుస్తోందని చెప్పుకొచ్చారు.

 

 

ప్రభుత్వ  బడుల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు నాట్స్ చేస్తున్న ప్రయత్నాలను మోహన్ వివరించారు. నాట్స్ చేపట్టిన వన్ మిలియన్ ఫుడ్ క్యాన్ డ్రైవ్  వివిధ నగరాల్లో సాగిన తీరును చెప్పుకొచ్చారు.  నాట్స్ సేవా పథంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోందనేది నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్యాం మద్దాళి వివరించారు. ఇంకా ఈ సమావేశంలో నాట్స్ నాయకులు బోర్డు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, గంగాధర్ దేసు, డా. శ్రీనివా కోనేరు, రాజేంద్ర అప్పలనేని, శ్రీథర్ అప్పసాని తో పాటు ఈసీ మెంబర్లు పాల్గొన్నారు. సంబరాల కమిటీ కన్వీనర్ రవి అచంట తో పాటు సంబరాల  కమిటీ సభ్యులంతా ఈ బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యారు.

 


చికాగోలో సీటీఏ, నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

 

అమెరికాలో  తెలుగుజాతిని ఒక్కటి చేస్తున్న నాట్స్.. చికాగోలో ఉగాది ఉత్సవాలను ఇదే రోజు సాయంత్రం ఘనంగా నిర్వహించింది. చికాగోలోని స్థానిక తెలుగు సంఘం సీటీఏతో కలిసి ఈ వేడుకలు జరిపింది. హేమళంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తెలుగువారంతా ఇక్కడ చేరి సంబరాలు జరుపుకున్నారు.. తెలుగు కళా సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఇక్కడ స్థానిక అరోరా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వేడుకలు జరిగాయి..స్థానికంగా తెలుగు కళకారులు  ఈ ఉగాది ఉత్సవాల కోసం ఎంతో సన్నద్దమై ప్రదర్శనలు ఇచ్చారు. 

 

 

తెలుగు ఆట, తెలుగు పాట.. ఉగాది సంబరాల్లో ప్రతిబింబించాయి.. సీటీఏ, నాట్స్ ప్రతనిధులు ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు.. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ప్రదర్శనలు ఇచ్చిన  కళకారులను... ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వాలంటీర్లను నాట్స్, సీటీఏ ప్రత్యేకంగా అభినందించాయి. విజేతలకు బహుమతులను అందచేశారు.

TeluguOne For Your Business
About TeluguOne
;