రాష్ట్రం దివాలా
హైదరాబాద్: రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేక పింఛన్లతో సహా ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోతున్నాయని, సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని, చివరికి ప్రభుత్వ అతిథిగృహాల కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందని ఆయన అన్నారు. ఆదివారం ఆయన మఖ్దూం భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఓవైపు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుంటే.. లేనిది ఉన్నట్లుగా చూపుతూ ‘సత్యం’ రామలింగరాజులా వ్యవహరించొద్దని ముఖ్యమంత్రికి సూచించారు. అలాచేస్తే చివరికి సీఎం ప్రజల ముందు ముద్దాయిగా నిలబడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంక్షోభం భయంకరంగా ఉంటే… కేంద్రప్రభుత్వం ఎంగిలిచేయి కూడా విదల్చడం లేదంటూ ఆయన మండిపడ్డారు. గత ఏడాది సంభవించిన వరదలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోతే ప్రధాని మన్మోహన్ సింగ్ రూ.వెయ్యికోట్లు సాయం చేస్తామని చెప్పి, కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో విఫలమౌతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రోశయ్య గట్టివారే కానీ.. ఢిల్లీకి వెళ్లి మెత్తబడిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగటానికి ముఖ్యమంత్రికి మొహమాటం అడ్డొస్తే.. రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు.

