సభలో సమరానికి సిద్ధంకండి
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బడ్జెట్ ఆమోదింపచేసుకోవడం అత్యంతకీలకం కావడంతో ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ విషయమై దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటన నుండి తిరిగివచ్చిన ఆయన సోమవారం ఉదయమే శాసనసభా సమావేశాల నిర్వహణపై కసరత్తు ప్రారంభించారు. కొంత మంది మంత్రులతో సమావేశమైనారు. ఇప్పటిదాకా వివిధ అంశాల్లో తలమునకలుగా ఉన్న మంత్రులు ఇకనుండి శాసనసభా సమావేశాలకు సిద్దం కావాలని కోరారు. వివిధ రకాల ఆందోళనలు, పరిస్థితులు కారణంగా శాఖలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేని మంత్రులూ సీరియస్గా తీసుకోవాలని, అధికారులతో సమావేశాలు జరపాలని ఆదేశించారు. ప్రతిపక్షాలు లేవనెత్తే విషయాల్లో సమాధానమివ్వడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సిద్దంగా ఉండాలని చెప్పారు. సభలో అందరూ ఐక్యంగా ఉండాలి. దాడిని తిప్పికొట్టాలి’ అని అన్నారు. శాసనసభా సమావేశాలకు ఎంఎల్ఏల హాజరు బాధ్యతను మంత్రులే చూసుకోవాలని, సమావేశాలు జరుగుతున్న సమయంలో అందరు తప్పనిసరిగా సభలోనే ఉండాలని సూచించారు. ఈ విషయంలో జిల్లాల మంత్రులే పూర్తిబాధ్యతలు తీసుకోవాలని సూచించారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో నియోజకవర్గానికి కనీసం కోటిరూపాయలు కేటాయించాలని మంత్రులు ఈ సమావేశంలో సిఎంను కోరారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని, బడ్జెట్ ప్రతిపాదనల్లో వివిధ శాఖలు ఆశిస్తున్నంతగా కేటాయింపులు ఉండకపోవచ్చని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం.

