డెడ్ లైన్ లో నో చేంజ్: కోదండరామ్
హైదరాబాద్: రాజీనామాల విషయంలో జేఏసీ పెట్టిన డెడ్ లైన్ లో మార్పు ఉండదని కన్వీనర్ కోదండరామ్ స్పష్టం చేశారు. డెడ్ లైన్ మరోసారి పొడిగిస్తారని శనివారం వదంతులు వ్యాపించిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ… కేంద్రం గడువులోపు కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన చేయని నేపథ్యంలో ముందు చెప్పిన విధంగా రాజీనామాలు చేసి తీరుతామని తెలిపారు. అనివార్య కారణాల వల్ల శనివారం జరగాల్సిన జేఏసీ భేటీ వాయిదా పడిందని.. ఆదివారం వరంగల్ లో పొలికేక కార్యక్రమం ఉన్నందున సోమవారం జేఏసీ భేటీ జరుగుతుందని తెలిపారు. కమిటీ విధివిధానాలను బట్టి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కమిటీ కాలపరిమితి, ఇతర అంశాలు పరిశీలించిన తర్వాత రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇదిలా వుండగా, ముఖ్యమంత్రి రోశయ్యపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. సీఎం సీటులో ఉన్న ఆయన తటస్థంగా ఉండాల్సింది పోయి.. సీమాంధ్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి రోశయ్య తీరుపై స్పందిస్తూ… ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏమాత్రం దృష్టిసారించడం లేదన్నారు. ఆయన కంటే టీడీపీ నేత చంద్రబాబే బెటరని, తెలంగాణ-సీమాంధ్ర రెండు కళ్లు అని ప్రకటించారని గుర్తు చేశారు. అయితే రోశయ్య మాత్రం తన రెండు కళ్లూ సీమాంధ్రవైపే పెట్టారని విమర్శించారు.

