కృష్ణా- గోదావరి బేసిన్ గ్యాస్ నిధులు దోపిడీ: అంబానీల కుట్రపై 2009లోనే హెచ్చరికలు !
కృష్ణా- గోదావరి బేసిన్ గ్యాస్ నిధులు దోపిడీ:
అంబానీల కుట్రపై 2009లోనే హెచ్చరికలు !
డా.ఎ.బి.కె. ప్రసాద్ (సుప్రసిద్ధ పాత్రికేయులు)
కృష్ణా - గోదావరి బేసిన్ లో లభ్యం కాగల పెట్రోలియం, సహజవాయువు (గ్యాస్) నిక్షేపాలను తవ్వితీసి, సరసమైన ధరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల, పరిశ్రమల అవసరాలు తీర్చే షరతుపైన కేంద్రప్రభుత్వంతో బడా గుత్తవ్యాపారి, షేర్ల వ్యాపారంలో అపారంగా ధనరాశులు గడించిన అంబానీల కుటుంబం కుదుర్చుకున్న "ఉత్పత్తి భాగస్వామ్యపు ఒప్పందం'' చివరికి జాతి సంపదను ఒకే ఒక్క కుటుంబం కొల్లగొట్టే పరిస్థితికి దారితీసింది.
ఈ కుట్రలో భాగంగానే అంబానీలు "ఉత్పత్తి భాగాస్వామ్యపు ఒప్పందం'' చాటున కృష్ణ-గోదావరి బేసిన్ లో తవ్వకాలకోసం తమకు కేటాయించిన క్షేత్రాలకు (కె.జి-డి 6 వగైరా బ్లాకులు) మాత్రమే పరిమితం కాకుండా కేటాయించని ఇతర క్షేత్రాలకు కూడా పాకడంతో పాటు, గ్యాస్ నిధులు పడని క్షేత్రాలను తిరిగి కేంద్రప్రభుత్వానికి (25 శాతం) అప్పగించాలన్న షరతును కూడా ఉల్లంఘించారు. తద్వారా కేంద్రప్రభుత్వానికి దక్కవలసిన అపారమైన రాయల్టీలు అంబానీలు హక్కు భుక్తం చేసుకోడానికి సాహసించారు. ఇందుకు గాను వారు పన్నిన పన్నాగం - తొలుత ఒప్పందం సందర్భంగా చూపించిన ఉత్పత్తి ఖర్చులను నాల్గురెట్లు పెంచేసి, కేంద్రంలోని పెట్రోలియం-గ్యాస్ మంత్రిత్వశాఖకు చెందిన కొందరు మంత్రులు, లంచాలు మరిగిన శాఖాధిపతులలో కొందరి సహకారంతో "చిత్రగుప్తుడి లెక్క''లతో ప్రభుత్వాన్ని మోసగించారు.

ఈ విషయాల్ని జాతీయస్థాయి సాధికార "కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్'' (కాగ్) 2010-11 సంవత్సరానికి చమురు, గ్యాస్ కంపెనీల పనితీరుతెన్నుల్ని తనిఖీ చేసి కేంద్రానికి సమర్పించిన ముసాయిదా నివేదికలో బహిర్గతం చేసింది. దేశంలో పనిచేస్తున్న ఆయిల్-గ్యాస్ కంపెనీల వ్యవహారాలను మొదటిసారిగా "కాగ్'' తనిఖీ చేసిన దరిమిలా సమర్పించిన నివేదిక యిది. ఖనిజ సంపదను భూమి తవ్వకాల వరకే పరిమితమై వెలికితీస్తాం. కాని పెట్రోలియం-గ్యాస్ నిధులు సముద్రతీరంలో, సముద్రాంతర క్షేత్రాలలో నిక్షిప్తమై ఉంటాయి. అందువల్ల ఆమేరకు తవ్వకాలు చేపట్టి కంపెనీలు ఎంత చమురును, ఎంత సహజవాయువును తోడుకుని ప్రయోజనం పొందుతాయో లెక్కకు అందని వ్యవహారం. కనుకనే అంబానీలు కృష్ణా-గోదావరి బేసిన్ (కె.జి-డి 6) క్షేత్రాలలో లభించగల గ్యాస్ సంపదను గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా అంచనాలు యిస్తూ రావడం జరిగింది.

వాస్తవానికి లభించే గ్యాస్ పరిమాణం వేరు, పైకి వూహించి చెప్పే అంచనా వేరు. ఇలాంటి తప్పిదానికి పాల్పడబట్టే చంద్రబాబునాయుడి పాలనలో "దేశం'' తాలూకూ పార్లమెంటు సభ్యుల సంఖ్యాబలం మీద ఆధారపడవలసి వచ్చిన గత బిజెపి-ఎన్.డి.ఎ. సంకీర్ణ ప్రభుత్వం కృష్ణా-గోదావరి బేసిన్ లో లభించే ఆయిల్-గ్యాస్ నిధుల గురించి అంచనాలకు మించిన లెక్కలు చూపినప్పుడు "దేశం'' ప్రభుత్వం ప్రయివేట్ విద్యుత్ సంస్థలతో "విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు'' (పి.పి.పి) యథేచ్చగా కుదుర్చుకుంది. ఇది ప్రభుత్వానికే గాక, ప్రయివేట్ రంగంలో నెలకొల్పదలచిన విద్యుత్ పరిశ్రమ అధిపతులకు కూడా సమస్య అయి కూర్చుంది. అంటే, ఒక వైపున సకాలంలో కె.జి.బేసిన్ గ్యాస్ అందగల పరిస్థితి కూడా లేదు, అసలు ఎంత గ్యాస్ ను అంబానీలు ఆంధ్రప్రదేశ్ అవసరాలకు కేటాయించగలరో కూడా స్పష్టత లేదు; కేటాయిస్తే ఏ ధరకు అందజేస్తారో తెలియదు. లోపుగా అంబానీలు కేంద్రంలోని అవినీతిపరులయిన కొందరి సహకారంతో అంబానీలు శాసించిన గ్యాస్ రేటును (ఉత్పత్తి ఖర్చులను అమితంగా పెంచి చూపినందున, ఆ దామాషాలోనే గ్యాస్ అందించే రేటును కూడా నాల్గురెట్లు పెంచారు ) రాష్ట్ర ప్రజల పైన రుద్దడానికి సిద్ధమయ్యారు.
సరిగా ఈ సమయంలోనే - ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, అంబానీల తంతును 2005లోనే కనిపెట్టిన మొదటి వ్యక్తి. కృష్ణా-గోదావరి బేసిన్ నుంచి ఆయిల్-గ్యాస్ నిధులను, ఏ రాష్ట్రంలో తవ్వుతారో ఆ రాష్ట్రప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి పంపిణీ చేయాలి. కాని అంబానీలు ఈ నిధుల్ని గుజరాత్ కు హెచ్చుగా (అంబానీలు అక్కడివారే కాబట్టి) తరలించబోతున్నప్పుడు ఆ కుట్రను కూడా పసిగట్టి రాష్ట్ర ప్రజలకు వెల్లడించడమేగాక, కేంద్రంలోని కాంగ్రెస్-యు.పి.ఎ. సంకీర్ణ ప్రభుత్వానికి కూడా తెలిపి హెచ్చరించారు. ఇక అక్కడినుంచి వరుసగా తాను హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యేవరకూ (2009 సెప్టెంబర్ దాకా) అనేకసార్లు ప్రధాని మన్మోహన్ సింగ్ కు, పెట్రోలియం-గ్యాస్ మంత్రిత్వశాఖకు ఉత్తరాలద్వారా అంబానీల ఆగడాలను గురించి తెలిపి, రాష్ట్రానికి జరుతుగున్న అన్యాయం గురించి హెచ్చరిస్తూనే వచ్చారు. అంటే, వై.ఎస్. హెచ్చరికలు చేసిన అయిదేళ్ళ తరువాత (2005-2009) “కాగ్'' రంగంలోకి దిగి, చిఠా అవర్జాలు పరిశీలించి, “గ్యాస్'' దొంగలైన అంబానీల కుట్రను 2010-11 నివేదికలో బయటపెట్టి, వై.ఎస్. ముందస్తు హెచ్చరికలలోని వాస్తవాన్ని ఆలస్యంగానైనా ధృవీకరించవలసివచ్చింది!

అంతేగాదు, వై.ఎస్.తో పాటు, 2009లోనే ఆదాయపుపన్ను శాఖ అధికారులు కూడా కేంద్ర గూఢచారి శాఖ సి.బి.ఐ. కి, ఒక నివేదికలో అంబానీల రిలయన్స్ ఇండాస్త్రీల్ లిమిటెడ్ (రిల్) కంపెనీకి, కేంద్ర మంత్రిత్వశాఖలో పనిచేసే ఉన్నతాధికారులకు మధ్య సాగుతున్న గూడుపుఠాణీ గురించి హెచ్చరించింది. పెట్రోలియం-గ్యాస్ నిధుల సాంకేతిక నియంత్రణశాఖ (హైడ్రోకార్బన్స్ డైరెక్టరేట్) డైరెక్టర్ జనరల్ వినోద్ కుమార్ సిబాల్ కు అంబానీల "రిల్'' సంస్థకు మధ్య నెలకొన్న "పీటముడి'' ఫలితంగా ప్రయివేట్ ఆపరేటర్లయిన అంబానీలు ఎలా ఒక భవంతిని కొనియిచ్చారో ఆదాయపు పన్నుశాఖ నివేదికలో సి.బి.ఐ.కి సమాచారం అందించింది, అప్రమత్తం చేసింది!
ఈ విషయం టాక్స్ అధికారులకు ఎలా తెలిసింది? వ్యాపార ప్రయోజనాలకు ఎలా తెలిసింది? వ్యాపార ప్రయోజనాల రక్షణలో భాగంగా బడా గుత్త కంపెనీలకు, కొందరు పాత్రికేయులకు మధ్య సంబంధాలు నెలకొల్పడంలో తైనాతీగా వ్యవహరించి అభాసుపాలైన "నీరా రాడియా టేపు సంభాషణల" ద్వారా సిబాల్ భవంతి భాగోతం బయటపడింది! అయితే గమ్మత్తేమంటే దేశప్రధానమంత్రి కనుసన్నలకు లోబడి పనిచేయాల్సి వస్తున సి.బి.ఐ. (ఈ ఏర్పాటును పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జైన్-హవాలా కేసులో బిజెపి నాయకుడు అద్వానీ ఇరుక్కున్న సందర్భంగా సుప్రీంకోర్టు సి.బి.ఐ.ను మందలించింది) మాత్రం ఇన్ కంటాక్స్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్న అభియోగాల్లో ఏ ఒక్కదాని విషయంలోనూ శ్రద్ధతీసుకొనకపోవడం గమనార్హం! అయితే రిలయన్స్ సంస్థకు తగని రాయితీలను సిబాల్ కల్పించాడని, దీనికి కారణం ముంబైలోని దలాల్ హౌస్ అతిథిగృహంలో నాలుగు మాసాలకు పైగా సిబాల్ కుమారైలకు అంబానీలు బస ఏర్పాటు చేయడమేనని సి.బి.ఐ. ప్రాథమిక నివేదికలో ఆరోపించింది.

2009 ఆగస్టులో ముఖేష్ అంబానీతో ఘర్షణలో ఉన్న అతని సోదరుడు అనిల్ అంబానీ సొంత సంస్థ అయిన ఆర్.ఎన్.ఆర్.ఎల్. (రిలయెన్స్ న్యాచురల్ రిసోర్సెస్ లిమిటెడ్) పత్రికల్లో ఒక వ్యాపార ప్రకటన రూపంలో ప్రచారం లేపింది. ఆ ప్రకటనలో, ఆ సంస్థ వ్యాపారంలో తన ప్రత్యర్థి అయిన అన్న ముఖేష్ అంబానీ నిర్వహిస్తున్న "రిల్" సంస్థ ఆసాధారణ రీతిలో లాభాలు తోడుకునేందుకు పెట్రోలియం మంత్రిత్వశాఖ సాయపడుతోందని బాహాటంగానే ఆరోపించింది! అంతేకాదు, "సుందోపసుందుల"యిన ఈ అంబానీ సోదరుల మధ్య లాభాల వేటకోసం ప్రారంభమైన ఇంటి సమస్యను వారు "దేశ" సమస్యగా మార్చి కూర్చున్నారు! 2009 అక్టోబర్ 6న అనిల్ అంబానీ కోర్టులో ఒక రిట్ దాఖలు చేస్తూ గ్యాస్ ఉత్పత్తికి అయ్యేపెట్టుబడి ఖర్చుల్ని విపరీతంగా పెంచేయడంలో "రిల్" తో డైరెక్టర్ జనరల్ సిబాల్ చేతులు కలిపాడని ఆరోపించింది!
ఆ మరుసటి రోజునే (అక్టోబర్ 7న) ఆ రిట్ కు డైరెక్టర్ జనరల్ సమాధానమిస్తూ "రిల్" సంస్థకు కేటాయించిన (కె.జి-డి 6) బ్లాకు క్షేత్రంలో గ్యాస్ తవ్వకాలకయ్యే పెట్టుబడి వ్యయం, ఉత్పత్తిని రెట్టింపు పెంచడానికి సంస్థ ఉత్పాదక శక్తిని మూడు రెట్లు పెంచాల్సి రావడం వల్ల ఖర్చు 2.47 బిలియన్ల నుంచి 8.8 బిలియన్ డాలర్లకు (సుమారు రు: 4 లక్షల కోట్లు) పెరగవలసివచ్చిందని పెద్దస్థాయిలో అడ్వర్టైజ్ మెంట్లు విడుదల చేశాడు! పైగా డైరెక్టర్ జనరల్ సిబాల్ కేంద్ర మానవవికాస శాఖ మంత్రి కపిల్ సిబాల్ కు బంధువు కావడం ఇక్కడ మరో విశేషం! అంతేకాదు, గ్యాస్ సంపద ఉన్న (కె.జి-డి 6) బ్లాక్ లో తవ్వకాల నిమితం "రిల్" కేంద్రప్రభుత్వంతో కుదుర్చుకున్న "ఉత్పత్తి భాగస్వామ్యపు ఒప్పందం" లాంటి కేంద్రీయ పద్దతి మంచిది కాదని "కాగ్" తరువాత ఉన్నతస్థాయిలో ఏర్పడిన అశోక్ చావ్లా కమిటీ కూడా విమర్శించింది [“ఎకనామిక్ టైమ్స్" 2011 జూన్ 21]!

ఇలాంటి కాంట్రాక్టులు ప్రయివేట్ సంస్థలకు మాత్రమే లాభదాయకమని కూడా ఆ కమిటీ స్పష్టం చేసింది! “రిల్" కోసం మంత్రిత్వశాఖ చట్టబద్ద నిబంధనలను ఉల్లంఘించిందని "కాగ్" స్పష్టం చేసింది! చావ్లా కమిటీలో 14 మంది సీనియర్ ఉన్నతాధికారులు, పరిశ్రమ తాలూకు ప్రతినిధులు ఉన్నారు. కమిటీ నివేదిక 2011 జూన్ మొదటివారంలో చేరింది. ఇక 2011 జూలై 1 న వి.కె.సిబాల్ పైన, హ్యూస్టన్ (అమెరికా) కేంద్రంగా ఉన్న జి.ఎక్స్ టెక్నాలజీ సంస్థ పైన, దాని భారతీయ ప్రతినిధి సుజాతా వెంకట్రామన్ లు వి.కె.సిబాల్ పైన లాంఛనంగా అవినీతి ఆరోపణలతో కేసు రిజిస్టరయింది. ఇది యిలా ఉండగా, గ్యాస్ గజదొంగ కుంభకోణం ఎంత భారీస్థాయిలో ఉందంటే - పార్లమెంటు సీనియర్ సభ్యులు, పెట్రోలియం వనరుల, వినియోగ సమస్యలు పరిశీలించి సిఫారసులు చేసే స్థాయిసంఘ సభ్యుడు అయిన తపన్ సేన్ ఇప్పుడు కాదు 2007 లోనే ప్రధాని మన్మోహన్ సింగ్ ను, పెట్రోలియం శాఖను గ్యాస్ క్షేత్రాల అభివృద్ధికయ్యే ఖర్చులను "రిల్" ఎలా పెంచేస్తున్నదో ముందస్తుగానే హెచ్చరించాడు!
జరుగుతున్న అవకతవకల గురించి తపన్ సేన్ ఒకసారి కాదు, నాలుగు సార్లు హెచ్చరించారు. ఇలా ఆదాయపుపన్ను అధికారుల స్థాయిలో, సి.బి.ఐ. స్థాయిలో, “కాగ్" స్థాయిలో, చావ్లా కమిటీ హోదాలో కనీసం 2009 నుంచి అయినా అందుతున్న హెచ్చరికలను "రిల్" బుట్టలోపడిన కేంద్రమంత్రిత్వశాఖ ఖాతరు చేయనందున పాలనా వ్యవస్థ ఎంతగా కుళ్ళిపోయిందో, పెట్టుబడిదారీ వ్యవస్థ తన స్వార్థ ప్రయోజనాలకోసం పెంచిపోషించే అవినీతి, లంచగొండితనం ఉపరితల సంస్కరణల ద్వారా కాకుండా కేవలం శస్త్ర చికిత్స ద్వారానే వ్యవస్థాగత మౌలికమైన మార్పుల అవసరం ఎంత ఉందో ప్రజలు తెలుసుకుని ఉద్యమించాలి! దేశంపట్ల "లాయల్టీ" పొయింతర్వాత ప్రభుత్వం కోల్పోయిన "రాయల్టీ"కి విలువ ఏమాత్రం ఉంటుంది?!


