వేర్పాటు ఉద్యమాలు - బహుళ, దళిత వర్గాలు : స్వామిగౌడ్ స్పందనలోని ఆంతర్యం?
వేర్పాటు ఉద్యమాలు - బహుళ, దళిత వర్గాలు :
స్వామిగౌడ్ స్పందనలోని ఆంతర్యం?
-డా.ఎబికె ప్రసాద్
అసత్యాలు సంపాదించుకున్న పలుకుబడి అసలు సత్యాలు బయటపడ నంతవరకే నిలుస్తుందట! 'ఉద్యమాల' తీరు కూడా అంతే! ప్రజాబాహుళ్యం లో అసంఖ్యాక శక్తులుగా ఉన్న బడుగు, బలహీన వర్గాల సమస్యల్ని పక్క దారులు పట్టించేందుకు, తమ వర్గ పీడనా దోపిళ్ళ పైన పీడితులు తిరగబడ కుండా జాగ్రత్తపడేందుకు అల్పసంఖ్యాకులయిన భూస్వామ్య, ధనికవర్గాలు స్వప్రయోజనాల రక్షణ కోసం సమాజంలో సృష్టించే కల్లోలాలలో భాగమే వేర్పాటు ఉద్యమాలు!
ప్రపంచదేశాల అనుభవంగా ఏనాటినుంచో రుజువవుతూ వచ్చిన ఈ నగ్నసత్యాన్ని ఆలస్యంగానైనా ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణాప్రాంత ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సంఘాధ్యక్షుడు స్వామిగౌడ్ స్వీయానుభవం ద్వారా గురించడం ప్రశంసనీయం. వేర్పాటు వాదం పేరిట కొందరు రాజకీయ నిరుద్యోగులు వివిధ పార్టీల రూపంలో వోటుబ్యాంకు రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో, వారిలో భాగమైన విద్యార్థి, ఉద్యోగవర్గాల జీవితాలతో లగాటమాడుతుండడాన్ని స్వామిగౌడ్ సకాలంలోనే పసిగట్టగలిగారు. అందుకే ఆయన 'ఉద్యమం' పేరిట కొందరు రాజకీయపక్షాల నాయకులు పోటాపోటీలమీద ఆడుతున్న నాటకాలపైన తీవ్రస్వరంతో ఆగ్రహించాల్సి వచ్చింది: ప్రత్యేక "తెలంగాణా కోసం పోరాటం చేస్తున్నామంటున్న రాజకీయ నాయకులు కాసేపు ఉద్యమం చేసి మిగతా సమయాల్లో వ్యాపారాలు, సొంతపనులూ చేసుకుంటున్నారు'' అని నాయకులు తలపెట్టిన ఉద్యమంలోని డొల్లతనాన్ని స్వామిగౌడ్ ఎండగట్టారు.

అంతేగాదు, "సకల జనులసమ్మె''ను నాయకులు సకుటుంబ పరివార సమ్మెగా ఎలా మార్చుకున్నదీ కూడా ఆయన పరోక్షంగా ఎత్తి పొడిచారు. "సమ్మె కారణంగా ప్రభుత్వోద్యోగులు రూ.750 కోట్లు నష్టపోయారు. మీరేమి నష్టపోయారో'' లెక్కలు చెప్పమని ఆయన నిలదీయవలసివచ్చింది, అంతేగాదు, ఇది "సకల జనుల సమ్మె'' కాదు, దానిని రాజకీయ నాయకులు "సకల ఉద్యోగుల సమ్మె''గా మార్చేసి వారు మాత్రం "రాస్తారోకోలో లేదా ధర్నాల్లో రెండుమూడు గంటలు పాల్గొన్నట్టు పాల్గొని తర్వాత ఎవరి పనులు, వ్యాపారాలు, కాంట్రాక్టులు వాళ్ళు చూసుకుంటున్నార''ని స్వామిగౌడ్ ఎండగట్టారు; "రాజకేయనేతలపైన మూడు, నాలుగు కేసులు పెట్టినా సరే వారు 'కార్పొరేటర్లు, ఎం.ఎల్.ఏ.లూ కావొచ్చు. కాని ఉద్యోగులపైన ఒక్క కేసున్నా ఉద్యోగాలు వూడిపోతాయ''న్న వాస్తవాన్ని ఆయన ప్రకటించాల్సి వచ్చింది! అంతేగాదు, మరో మాటలో చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణా పేరిట సాగుతున్న నాయక 'ఉద్యమం' ప్రజలపేరుతో వోటు రాజకీయాలు ప్రతిపాదికగా పోటాపోటీలమీద టి.ఆర్.ఎస్., కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీ, న్యూడెమోక్రసీ పార్టీల కార్యకర్తలు సొంత ఎజెండాలతో సాగిస్తున్నదేగాని, ప్రజాబాహుళ్యం పాల్గొంటున్నది కాదని అర్థమవుతుంది.

ఆ విధంగా 2014 నాటి ఎన్నికలకోసం 'బొబ్బిలిదొర' తలపెట్టిన 'వోటు' యజ్ఞంలో మిగతా పార్టీలు సమిధులయ్యాయి! ఇందుకు నిదర్శనం - టి.వీ.చానెళ్ళు, అనుకూల, ప్రతికూల పత్రికలవార్తలే! ఒకరికీ మరోకరికీ పొంతన లేదు. ఉద్యమపక్షాలలో ఒక పక్షం మరొక పక్షాన్ని విమర్శించుకోవటం, పరస్పరం తిట్టుకోవడం, ఓకే ఉద్యమంలో కొనసాగుతున్నట్టు కనిపించే రాజకీయపార్టీ నాయకులనో, కార్యకర్తలనో అదే ఉద్యమలోని మరొక పక్షం వాళ్ళు కొట్టడం లేదా కొట్టించుకోడం, ఒకరినొకరు మింగేయడానికి వేసే ఎత్తులు, తద్వారా ఏకవాక్యతలేని బహుళపక్ష రాజకీయాలూ!
"ఎవరికివారే యమునా తీరే'' పద్ధతిలో కొనసాగుతున్నవి ఈ "గంధోళీ'' నాయకుల రాజకీయాలు!
భింద్రేన్ వాలాను కాంగ్రెస్ లో కొన్నాళ్ళు సాకి నందుకు ఇందిరాగాంధీకే గాక 'ఖలిస్తాన్' ఉద్యమంపేరిట పంజాబ్ తోపాటు మొత్తం దేశానికే తలనొప్పిగా మారాడు భింద్రెన్ వాలా! అలాగే ఒక "బొబ్బిలిదొర''ను ఆంధ్రప్రదేశ్ లో మొదట కాంగ్రెస్ పెంచగా, ఆ తర్వాత పదహారేళ్ళు "తెలుగుదేశం'' సాకగా ఇప్పుడు ఆ రెండు పార్టీలకు ఏకు మేకై తెలుగుజాతి మధ్య ఒక "వినాశకర విత్తనం'' (టెర్మినేటర్ సీడ్)గా అవతరించి ఆ రెండు పార్టీల ఉనికికే సమస్యగా రూపెత్తాడు!

తాను "పులిమీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాన''ని తెలుసుకొన్న ఆ "టెర్మినేటర్'' కిందికి దిగితే తానెక్కిన పులే తనను మింగేస్తుందన్న భయంతో వణికిపోతున్నాడనడానికి నిదర్శనం - యావత్తు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకూ, రాష్ట్ర ఆర్ధికవ్యవస్థకూ అపారమయిన నష్టం కల్గించడానికి చివరియత్నంగా, "దింపుడు కల్లాం ఆశ''తో బూతులబుంగలతో ఉభయప్రాంతాల ప్రజల మధ్య వెంటనే సవరించుకోలేనంతటి విషపూరితమైన విద్వేషాన్ని ఆఖరి తురుపుగా వాడి రెచ్చగొట్టడమే!
ఇందులో భాగంగానే బస్సు ప్రయాణీకులపైన, బస్సులపైన పార్టీ కార్యకర్తలతో జరిపించే దాడులూ, కార్యకర్తల రైల్ రోకోలు, పనులకు హాజరయ్యేవారిపై సాగుతున్న బెదిరింపులూ, దాడులూ, దేశం నుంచే విడి పోతామన్న ప్రకటనలూ ఏదో ఒక మూలనుంచి అడపాదడపా ఎవరో ఒకరితో ఇప్పించడాలూ. పదవీ రాజకీయమూ ధనికవర్గ ప్రయోజనాల రక్షణ తప్ప మరొక లక్ష్యంలేని తమ రాజకీయ స్వార్థం కోసం ఒక వైపున బొగ్గు రవాణాను బలవంతంగా ఆపించి, విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగించి, గ్రామాలకు, ప్రజలకు విద్యుత్ లేకుండా పోతోందోహో అంటూ మళ్ళీ ఎదురు బొంకులతో ఫిర్యాదులు చేయడమూ! ఒక "ప్రొఫెసర్"ని చంకలో పెట్టుకుని ఊరేగుతూ చివరికి తెలంగాణా బిడ్డల చదువుసంధ్యల్ని, వారి విద్యా పురోగతిని, ఉన్నత విద్యావకాశాలను, అమూల్యమైన విద్యార్జన సమయాన్నీ బలవంతంగా నెలలతరబడి వెనక్కి నెట్టేశారు! ఉన్న ఉపాధిని దెబ్బ తీశారు, లేని ఉపాధి గురించి కేవలం ప్రకటనల ద్వారా ఊరించారు!
ఈ "చేతబడి'' రాజకీయం ద్వారా యువతను ఆత్మహత్యల వైపునకు నెట్టారు. అంతేగాదు, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో పనిచేస్తున్న దళితుడైన అధికారిని పాత 'దొర'తనపు అలవాట్లు చావక అహంకారంతో తన కుటుంబ సభ్యుడైన ఒక లెజిస్లేటర్ అతి దారుణంగా హింసించిరాగా, ఎలాంటి సిగ్గూ, శరమూ లేకుండానే "ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడ్ని'' చేస్తానని "బొబ్బిలిదొర'' రెండేళ్ళ తర్వాత మరోసారి (అక్టోబర్ 10న బాన్స్ వాడలో) పొలికేక వేశాడు! అంతమాత్రాన బడుగు, బలహీనవర్గాల మనస్సులు మెత్తబడి, గతంలో కేవలం తెలంగాణా సాయుధపోరాటం ద్వారా మాత్రమే ప్రజాబాహుళ్యం వదిలించుకున్న దొరల, జాగిర్దార్ల, భూస్వామ్య, దేశ్ ముఖ్ ల పెత్తనాన్ని తిరిగి తలకెత్తుకోబోరని "బొబ్బిలిదొర'' కుటుంబం గుర్తించడం మంచిది!

బడుగు, బలహీన వర్గాలు ఈ కుట్రను ఇప్పటికే పసికట్టాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని ధనికవర్గ కుల రాజకీయ ప్రయోజనాల మధ్య పదవీ వెంపరలాటలో పరస్పరం ఆధిక్యత కోసం సాగుతున్న రాజకీయ పెనుగులాట నుంచే ఈ వేర్పాటువాదం పుట్టుకొచ్చింది. అయితే 1969 నాటి స్వార్థపర రాజకీయాల వేర్పాటు 'ఉద్యమా'నికీ, ఇప్పటి ఉద్యమానికీ ఒక తేడా ఉంది - 1969 నాటి 'ఉద్యమం' ద్వారా వేర్పాటువాద నాయకులు రాష్ట్రానికి కొంత నష్టం కల్గించినా, ఈనాటి ఉద్యమనాయకులు మాత్రం ప్రాంతాల ప్రజల మధ్య నేడు పురిగొల్పినంతటి దారుణమైన ద్వేషాన్ని పురిగొల్పలేదు! ఈ పరిణామానికి తమ జెండాల రంగులు మార్చకుండానే దిక్కులు మార్చిన రాజకీయనాయకులను బాధ్యుల్ని చేయక తప్పదు; ఏక భాషా సంస్కృతులు పునాదిగా ఏర్పడిన ఐక్యవిశాలాంధ్ర జాతిని చీలు బాటలు పట్టించడానికి కారకులయిన టి.వీ చానాళ్ళు, ఇతర మాధ్యమాలు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

వామపక్షాలు తిరిగి వర్గ పోరాట స్పృహతో పేదసాదల, దళిత బహుజనుల భూ సమస్యలనూ, ఇళ్ళ కొరతనూ, విద్యా సౌకర్యాల కొరతనూ, ఉపాధి సమస్యలనూ సంతృప్తికరంగా పరిష్కరించే వైపుగా ఉద్యమాలను నిర్మించి నిర్వహించుకోవాలి; వేర్పాటు వాదానికి మూలకారణమైన సమస్యల పరిష్కారానికి గజ్జెకట్టాలి గాని, తమ రాజకీయ ప్రయోజనాలకోసం, పదవీ నిరుద్యోగంలో ఉన్న ధనికరర్గ పక్షాల రాజకీయులు ప్రారంభించే వేర్పాటు ఉద్యమాల వెంట ప్రజాతంత్ర, వామపక్షశక్తులు పడిపోకూడదు! ఇది కృత్రిమ మనోభావాల 'వంట-వార్పుల' సంధియుగం! అబద్ధాలకూ, అసత్యాలకూ, వక్రీకరణలకూ ఆధునికయుగంలో అనేక అవకాశాలు కల్పిస్తున్న సమాచార సాంకేతిక వ్యవస్థ నేడు అనులోమ (పాజిటివ్) పరిణామాలకన్నా విలోమ (నెగెటివ్) పరిణామాలకే ప్రాధాన్యం కల్పించే శక్తుల చేతుల్లో పావులుగా మాధ్యమాలు, ముఖ్యంగా దృశ్యమాధ్యమాలు (టీ.వీ.లు) ఉన్నందున, పార్టీల కార్యకర్తల చిన్నచిన్నగుంపులను సహితం 'త్రీ-డీ' లెవల్ లో సంఖ్యాతీతంగా చూపి ప్రజలలో ఉద్రేకాలకు, ఆవేశకావేశాలకు దారితీసి, తద్వారా అశాంతికి తమకు తెలియకుండానూ, తెలిసి తెలిసి కూడా దోహదపడుతున్నాయి!
ఈ విషయంలో స్వయం నియంత్రణా సూత్రమనేది ప్రయివేటీకరణ ప్రభావంవల్ల ప్రయివేట్ యాజమాన్యాల లాభాలబ్ది ప్రయోజనాలకు మాత్రమే తాకట్టు పడిపోతోంది. నాయకులు మైకు దొరికితే చాలు మైకాసురులవుతున్నారు; ఛానెల్ దొరికితే చాలు వీడియోకోసం వివిధ భంగిమల్లో పూనకం తెచ్చుకుంటున్నారు! ఇంతకూ తొలగని ఒక శేషప్రశ్న: తోటి ఆంధ్రుల్ని, తెలుగువారిని - వలసవాదులని ఏ 'బొబ్బిలిదొర' నిందించి తన పదవీ రాజకీయ జూదం కోసం, జాతి విచ్చిన్నకుడి రూపమెత్తాడో ఆ 'దొర' ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంజిల్లా వాసి అని ఇప్పటికే నా తెలంగాణా ప్రజలు తెలుసుకుని వెలిపెట్ట లేదెందుకని? ఇటీవల విజయనగరంలో జరిగిన ఒక సదస్సులో ఈ 'దొర' బండారాన్ని బయటపెడుతూ పాటలు కట్టిపాడటం మరొక తాజా విశేషం! అందుకే పెట్టుబడి కూటాలు కట్టుకడుతున్నాయి; అటూ యిటూ ఉన్న సంపన్నవర్గాల నిత్యకార్యకలాపాలకూ, ప్రయాణాలకు, తిండీతిప్పలకు, సౌఖ్యాలకూ, సౌకర్యాలకూ ఎలాంటి లోటు ఉండదు. ఎటు తిరిగీ కష్టనష్టాలన్నీ ఇలాంటి వేర్పాటు ఉద్యమాల ద్వారా ముట్టడించేది అసంఖ్యాకంగా ఉన్న సామాన్య ప్రజాబాహుళ్యాన్ని, రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవుల్ని మాత్రమే! కాని వీళ్ళ బతుకుల్ని మినహాయించి ఉద్యోగవర్గాలూ క్షేమంగా ఉండలేరు! సంపన్నవర్గ ప్రయోజనాలకు శాశ్వత రక్షలు గానూ "మధ్యతరగతి మందహాసులు" మనలేరు!
ఇదేనేటి పాఠమూ, గుణపాఠమూ కూడా!


