బాబాయ్-అబ్బాయ్ ల మధ్య మళ్ళీ మొదలైన మ‌న‌స్ప‌ర్థ‌లు!!

 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి వైఎస్ జగన్ టికెట్ ఇవ్వని విషయం తెలిసిందే. దీంతో మొదట అలకబూనిన వైవీ.. తరువాత జగన్ బుజ్జగింపుతో కాస్త మెత్తబడి ఎన్నికల్లో పార్టీ గెలుపుకు తనవంతు కృషి చేశారు. అయితే తాజాగా మరోసారి బాబాయ్-అబ్బాయ్ ల మ‌ధ్య తేడాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.

లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం త‌న బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు సమాచారం. అయితే అది వైవీ సుబ్బారెడ్డికి ఏమాత్రం ఇష్టం లేద‌ని, ఆయ‌న టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విపై సుముఖంగా లేర‌ని తెలుస్తోంది.

వైవీ సుబ్బారెడ్డి రాజ్య‌స‌భ సీటునే ఆశిస్తున్నారట. అయితే ప్ర‌స్తుతానికి టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వితో స‌ర్దుకోవాల‌ని, అవ‌కాశాన్ని బ‌ట్టి రాజ్య‌స‌భ‌కు పంపిస్తాన‌ని జ‌గ‌న్ ఆయ‌న‌ను బుజ్జిగిస్తున్నార‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అప్పుడు లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో అల‌క బూనిన వైవీ సుబ్బారెడ్డి.. జ‌గ‌న్ బుజ్జ‌గించ‌డంతో మ‌ళ్లీ పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. అలాగే రాజ్యసభ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా జ‌గ‌న్ రాజ్యసభ తర్వాత చూద్దామంటూ, టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేయ‌డంతో మ‌ళ్లీ ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు పెరిగే అవ‌కాశం వుంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతోంది.