మొన్న బెదిరింపులు.. ఇప్పుడు క్షమాపణలు

మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు.. గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి కాల్ చేసి బెదిరించిన ఆడియో టేప్ బయటికొచ్చిన విషయం తెలిసిందే.. ఆ ఆడియోలో వసంత నాగేశ్వరరావు 'ప్రభుత్వానికి తొంతుల్లా పనిచేస్తున్నారని.. దేవినేని ఉమని అసెంబ్లీలో చూడటం జగన్ కి కూడా ఇష్టంలేదు.. అవసరమైతే కడప నుంచి మనుషులని దింపుతాడు.. తన కుమారుడికి ఆవేశం ఎక్కువ జాగ్రత్త ఉండు' అని పంచాయతీ కార్యదర్శిని బెదిరించినట్టుగా ఆడియో టేప్ లో ఉంది.. దీంతో తీవ్ర దుమారం రేగింది.. దేవినేనిని చంపుతారా? అంటూ టీడీపీ నేతలు, వైసీపీ నేత తీరుపై మండిపడ్డారు.. చంద్రబాబు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.. అయితే వసంత నాగేశ్వరరావు మాత్రం నేనేం తప్పు చేయలేదు, నాకు ఏ పాపం తెలీదు అంటున్నారు.

 

 

గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శిని బెదిరించానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చారు.. గొడవలెందుకని మందలించానని, అంతేతప్ప బెదిరించానన్న వార్తల్లో నిజం లేదని అన్నారు.. మంత్రి దేవినేని ఉమ అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నట్టు తనవాళ్లు చెప్పారని, దీంతో వైసీపీ జెండాలు ఎందుకు తొలగిస్తున్నారని మాత్రమే అడిగానని స్పష్టం చేశారు.. తన మాటలను కుట్రతో రికార్డు చేయించి, ఎడిట్ చేసి వదిలారని ఆరోపించారు.. తాను తప్పుగా మాట్లాడితే క్షమించాలని ఉద్యోగ సంఘాలను కోరారు.. తనపై కేసు పెట్టే పరిస్థితి రావడం సిగ్గుగా ఉందని, ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ, ఏ అధికారినీ దూషించలేదని పేర్కొన్నారు.. తాను చంద్రబాబు, అయ్యన్నపాత్రుడితో కలిసి ఏడేళ్లు పనిచేశానని, తానెలాంటి వాడినో ఆ మాత్రం తెలియదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.