ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వైసీపీ ఎంపీలు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటుకు వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీ కానున్నారు. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వారు స్పీకర్‌కు లేఖ ఇవ్వనున్నారు. ఇప్పటికే ముగ్గురు వైసీపీ ఎంపీలు స్పీకర్ ‌ను కలిసినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై స్పీకర్‌తో వారు సమాలోచనలు చేసినట్లు సమాచారం.

కాగా, కొద్దిరోజులుగా రఘురామకృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలతో వైసీపీ అధినాయకత్వం ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. అయితే దానికి సమాధానం ఇవ్వకపోగా, ఆ షోకాజ్ నోటీసునే ప్రశ్నించడం ద్వారా రఘురామకృష్ణంరాజు మరింత ఆజ్యం పోశారు. పార్టీకి దూరం కావాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణంరాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతల ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన రఘురామకృష్ణంరాజు.. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి స్పీకర్ ను, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తన వాదనలు వినిపించారు. ఇప్పుడు, వైసీపీ ఎంపీలు స్పీకర్ ను కలవనుండడంతో ఈ అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి ఏర్పడింది.