బాబుకు ఓటమి భయం..వైసీపీ పథకాలు కాపీ
posted on Jan 22, 2019 11:55AM
ఏపీ సీఎం చంద్రబాబుపై సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఓట్ల కోసం చంద్రబాబు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను హడావిడిగా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాజాగా ఆయన నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే వైఎస్సార్ సీపీ పథకాలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు. అప్పట్లో ఇవి సాధ్యం కాదని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను మరోసారి మోసం చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పెన్షన్ మొత్తాన్ని పెంచుతానని చెప్పారు.. కానీ ఇది ఎన్నికల వరకూ మాత్రమే అమల్లో ఉంటుందని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పే బాబు.. 40 ఏళ్ల వయసున్న జగన్ ని కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్తో పొత్తుకోసం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్, జగన్ ని కలిస్తే.. టీడీపీ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.