బీజేపీ నేతతో స్టార్ హోటల్ లో వైసీపీ లీడర్ల మీటింగ్స్.. వైసీపీ లో కలవరం.! 

ఈ నెల 13 న హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిసిన విషయం పై ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఐతే అసలు ఈ సీసీ టీవీ ఫుటేజ్ ఎలా బయటికి వచ్చిందని కూడా చర్చ జరిగింది. ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ స్టార్ హోటల్ నుండి ఏపీ సీఐడీ ఈ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఒక సీఐడీ కేసు నమోదై ఉన్న నేపథ్యంలో ఈ ఫుటేజ్ కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫుటేజ్ ఆధారంగా వైసీపీ ప్రభుత్వం పై కుట్ర జరుగుతోందని ప్రూవ్ చేయడానికి ట్రై చేసింది. ఐతే వైసీపీ ప్రభుత్వం ఈ ఫుటేజ్ తో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డను, చంద్రబాబును టార్గెట్ చేయాలని ప్రయత్నిస్తే అక్కడ దొరికిన ఫుటేజ్ తో వైసీపీ నాయకత్వం షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. 

ఆ స్టార్ హోటల్ ఫుటేజ్ లో తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీ సుజనా ను కలిసిన ఆధారాలు దొరికాయి. ఇప్పటికే నరసాపురం ఎంపీ పార్టీ అధిష్టానం పై తిరుగుబాటు తో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో పాటు కొంత మంది సీనియర్ నాయకులూ కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తమ పార్టీ నేతలు సుజనా తో భేటీ కావడం తో అసలు పార్టీలో ఏం జరుగుతోందని మదనం మొదలైనట్లు సమాచారం. బీజేపీ ఎంపీ సుజనా ను కలిసిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ కారణం తో కలిసారో అరా తీసే పనిని కొంత మంది ప్రభుత్వ సలహాదారులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీ సుజనా చౌదరిని కలిసినట్లుగా అయన సన్నిహిత వర్గాలు కూడా ధ్రువీకరిస్తున్నాయి.