వైసీపీకి ఓటేయండి.. లేదా ఇల్లు ఖాళీ చేయండి

 

ఇల్లు అద్దెకిస్తే.. సమయానికి అద్దె కట్టండి, లేదా ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పడం సహజం. కానీ ఓ మహానుభావుడు మాత్రం.. నేను చెప్పిన పార్టీకి ఓటు వేయండి లేదా ఇల్లు ఖాళీ చేయండి అంటూ.. ఇల్లు ఖాళీ చేయించాడు. ఈ ఘటన గుంటూరుజిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన భీమినేని అంకమరావు(70), మహాలక్ష్మమ్మ (65) దంపతులు చెరుకుమల్లి బుజ్జి అనే స్థానిక వైసీపీ నేత ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ‘మా పార్టీకే ఓటు వేయండి’ అని ఆ దంపతులను బుజ్జి పలుమార్లు అడిగారు. అయితే వాళ్ళు.. తమకి నచ్చిన వ్యక్తికి, నచ్చిన పార్టీకి ఓటు వేస్తామని చెబుతూ వచ్చారు. ఇదే విషయమై సోమవారం రాత్రి బుజ్జి వారితో వాదనకు దిగారు. ‘వైసీపీకి ఓటు వేస్తామని మాట ఇవ్వండి’ అని పట్టుబట్టారు. వృద్ధ దంపతులు అంగీకరించలేదు. ‘ఐతే బయటికి నడవండి’ అంటూ వారిచేత బుజ్జి ఇంటిని ఖాళీ చేయించారు. ఇక చేసేదేమీలేక అంకమరావు దంపతులు అర్ధరాత్రి చిన్న బడ్డీ కొట్టులోకి సామాన్లు మార్చుకున్నారు. రాత్రికి అక్కడే తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు.. వారికి చిన్న గదిలో ఆవాసం ఏర్పాటు చేశారు.