ఆనం సంచలన వ్యాఖ్యలు.. సీఎం ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదు!

వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై అధికారులు నివేదికలు తయారుచేయలేదని తప్పుబట్టారు. ఈ ఏడాది పాలనలో తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారుల తీరు దారుణంగా ఉందని, వెంకటగిరి నియోజకవర్గాన్ని వారు మర్చిపోయినట్టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన నియోజకవర్గ ప్రజలకు నేరుగా అందే సంక్షేమ కార్యక్రమాలు తప్ప, ఇతర ఏ కార్యక్రమాలనూ తాను చేయలేకపోతున్నానని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని, ఎస్‌ఎస్‌ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం జగన్ చెప్పినా అధికారులు వినడంలేదని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం ఇంత దారుణంగా పని చేయడాన్ని తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించానని చెప్పిన ఆయన.. ఎమ్మెల్యే పదవి తనకు అలంకారప్రాయం కాదని అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయడానికి సిద్ధమని ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.