వైసీపీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల వాయిదా
posted on Mar 13, 2019 1:30PM
వైసీపీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ రోజు ఉదయం 10.20 గంటలకు 75 మంది తో వైసీపీ తొలి జాబితా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ మేరకు సమాచారం అందించారు. అయితే, ఉదయం పలువురు నేతలు వైసీపీలో చేరారు. దీంతో జగన్ చేరికల్లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా వైసీపీ ఎన్నికల కోర్ కమిటీ సమావేశం అయింది. దీంతో ముందుగా నిర్ణయించిన ముహూర్త సమయం దాటి పోయింది.
విశాఖ స్వరూపానంద వైసీపీ తొలి జాబితా విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. అయితే, ముహూర్త సమయం దాటి పోవడంతో మరోసారి స్వరూపానందను వైసీపీ నేతలు సంప్రదించారు. ఆయన మరో ముహూర్తం సూచించారు. ఈ రోజు వాయిదా పడిన అభ్యర్దుల జాబితా విడుదల కార్యక్రమం ఈ నెల 16న ఉదయం 10.26 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజు జగన్ ఇడుపుల పాయలో వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి తొలి జాబితాను విడుదల చేస్తారు. ఆ తరువాత అక్కడి నుండే ఎన్నికల ప్రచారం బస్సు యాత్ర ద్వారా ప్రారంభిస్తారు.