బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల.. 5 వేల కోట్లతో మరో కొత్త పథకం
posted on Feb 5, 2019 11:43AM
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,26,177.53 కోట్లతో ఈ బడ్జెట్ను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో వరుసగా మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం గర్వకారణమని అన్నారు. అపార అనుభవం గల నాయకత్వాన్ని ప్రజలు ఆశించారని.. ఆ నమ్మకంతోనే చంద్రబాబుకు అధికారం అప్పగించారన్నారు.
ఈజ్ఆఫ్ డూయింగ్లో ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఇది చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే సాధ్యమైందని యనమల అన్నారు. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని తెలిపారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని, దీంతో రాజధాని నగరాన్ని కోల్పోయామన్నారు. విభజన సమయంలో ఆదాయ-వ్యయాలు, ఆస్తులు-అప్పులు సరిగా పంపిణీ చేయలేదని.. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరాశా నిస్పృహలు నెలకొన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అరకొర సాయం వల్ల సమస్యలు మరింత జఠిలమయ్యాయని యనమల పేర్కొన్నారు.
మహిళా సాధికారత సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని.. 20 ఏళ్ల క్రితమే మహిళా పొదుపు సంఘాలను ఆయన ఏర్పాటు చేశారని యనమల గుర్తు చేశారు. వెలుగు పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమమని, ఆ పథకంలో ప్రస్తుతం 94 లక్షల మంది మహిళలు ఉన్నారని చెప్పారు. ఈ బడ్జెట్ లో పలు కొత్త పథకాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఇందులో రైతుల పెట్టుబడి సాయం కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు.
బడ్జెట్ ముఖ్యాంశాలు:
- వ్యవసాయానికి రూ. 12, 732 కోట్లు
- బీసీ వెల్ఫేర్ రూ.8,242
- అటవీపర్యావరణానికి రూ. 491 కోట్లు
- ఉన్నత విద్య- 3,171 కోట్లు
- ఇంధన మరియు ఇన్ఫ్రాస్ట్రక్షర్ రూ.5,473
- సెకండరీ ఎడ్యుకేషన్ రూ. 22,783
- పౌరసరఫరాలు- రూ. 3,763 కోట్లు
- ఆర్థికశాఖకు రూ. 51, 841 కోట్లు
- సాధారణపరిపాలన శాఖకు- రూ.1,117
- వైద్యారోగ్యశాఖకు రూ. 10,032
- హోంశాఖకు రూ.6,397 కోట్లు
- గృహనిర్మాణశాఖకు రూ.4079
- జలవనరులశాఖకు- రూ. 16,852 కోట్లు
- పరిశ్రమలశాఖకు 4,114 కోట్లు
- ఐటీకి 1006 కోట్లు
- కార్మిక ఉపాధి కల్పనకు 1225 కోట్లు
- న్యాయశాఖకు 918 కోట్లు
- అసెంబ్లీకి 149 కోట్లు
- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 7979 కోట్లు
- మైనార్టీ వెల్ఫేర్కు రూ. 1308 కోట్లు
- ప్లానింగ్కు 1403 కోట్లు
- పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ రూ. 35,182 కోట్లు
- రెవెన్యూశాఖకు రూ. 5546 కోట్లు
- రియల్ టైమ్ గవర్నెన్స్ 172 కోట్లు
- స్కిల్ డెవలప్మెంట్ 458 కోట్లు
- సోషల్ వెల్ఫేర్కు రూ. 6861 కోట్లు
- రోడ్లు భవనాలశాఖకు రూ. 5382 కోట్లు
- మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు
- యువజన క్రీడలు రూ. 1982 కోట్లు
- చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ. 400 కోట్లు
- డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు
- క్షత్రియ కార్పొరేషన్కు రూ. 50 కోట్లు
- ధరల స్థిరీకరణ నిధికి రూ. 1000 కోట్లు
- యాంత్రీకరణకు రూ. 300 కోట్లు
- మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు
- ఎస్సీ సబ్ప్లాన్ కింద రూ. 14,367 కోట్లు
- ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ. 5,385 కోట్లు
- బీసీ సబ్ప్లాన్ కింద రూ. 16,226 కోట్లు
- మైనార్టీ సబ్ప్లాన్ కింద రూ. 1,304 కోట్లు
- పసుపు- కుంకుమ కింద రూ. 4 వేల కోట్లు
- బీసీల కార్పొరేషన్కు రూ. 3 వేల కోట్లు
- ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ. 1200 కోట్లు
- డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ. 1100 కోట్లు
- చంద్రన్న బీమాకు రూ. 354 కోట్లు
- అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు
- చేనేతలకు రూ. 225 కోట్లు
- 9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ. 156 కోట్లు
- చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ. 175 కోట్లు
- చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ. 128 కోట్లు
- మైనార్టీలకు దుల్హన్ పథకం కింద రూ.100 కోట్లు
- ఎన్టీఆర్ విదేశీ విద్యకు రూ. 100 కోట్లు
- పెన్షన్ కింద వృద్ధాప్య, వింతంతువులకు రూ. 10,401 కోట్లు