చంద్రబాబుతో చీవాట్లు తిన్న వైసీపీ ఎమ్మెల్యే

కర్నూలు జిల్లాలోని తంగడంచలో ఇవాళ జరిగిన ముఖ్యమంత్రి బహిరంగసభ రసాభాసగా సాగింది. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. ప్రొటోకాల్ ప్రకారం సభలో స్థానిక ఎమ్మెల్యే ఐజయ్యకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అయితే మైకు అందుకున్న వెంటనే ఐజయ్య ఊగిపోయారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపైనా, పాలనపైనా విమర్శలు చేశారు. దీంతో ఆయన మైక్ కట్ చేశారు. ఎమ్మెల్యే చర్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఈ నియోజకవర్గం ఎప్పటికీ బాగుపడదని అన్నారు. ఎక్కడ..ఎలా మాట్లాడాలో కూడా తెలియదా అని వ్యాఖ్యానించారు. ఇది అసెంబ్లీ కాదని, ప్రజలు పాల్గొనే ఇటువంటి సభల్లో ఇలా మాట్లాడటం ఏంటని చంద్రబాబు మండిపడ్డారు.