కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హరీష్ రావు దూరం అందుకేనా!!

 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో తెలంగాణ సీఎం కెసిఆర్ తో పాటు గవర్నర్ నరసింహన్‌, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లు పాల్గొన్నారు. కానీ ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడంలో కీలకంగా వ్యవహరించిన మాజీ తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కృష్ణా నదిలో ప్రవాహం తక్కువగా ఉంటున్న నేపథ్యంలో గోదావరి నదీ జలాలను తెలంగాణ రాష్ట్రానికి వాడుకోవాలని ఆనాడు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ప్రాజెక్టుల రీడిజైన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకోవడంతో పాటు ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్స్‌ను తీసుకురావడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు.

గతంలో గవర్నర్ నర్సింహన్ కాలేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సమయంలో ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరగడాన్ని చూసి హరీష్ రావును అభినందించారు. హరీష్ రావును కాళేశ్వరరావు అంటూ గవర్నర్ సంబోధించారు. ప్రాజెక్టు పనులను హరీష్ రావు రాత్రి పూట ఆకస్మికంగా తనిఖీలు చేసేవారు. ప్రాజెక్టు వద్దే హరీష్ రావు పడుకొన్న ఘటనలు కూడా ఉన్నాయి.

2018 డిసెంబర్ మాసంలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చింది. సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావుకు కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కలేదు.

కానీ శుక్రవారం నాడు జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాత్రం హరీష్ రావు దూరంగా ఉన్నారు. ఆయన సిద్దిపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేటలో జరిగిన యోగ దినోత్సవం పాటు ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేనందున హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మంత్రి పదవి లేనందునే హరీష్ రావు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ హరీష్ రావును దూరం పెట్టారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని హరీష్ రావు తోసిపుచ్చారు. కేసీఆర్ అప్పగించిన ఏ పనైనా తాను పార్టీ కార్యకర్తగా భాద్యతతో పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు రోజున హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడానికి కేసీఆర్ చేసిన కృషి ఉందని ఆయన ప్రశంసలు కురిపించారు.