జనసేనలో అసలేం జరుగుతోంది? రాపాక, రాజు ఆరోపణలు నిజమేనా?
posted on Dec 16, 2019 12:54PM
జనసేనలో కొన్నిరోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, జన సైనికులను గందరగోళం చేస్తున్నాయి. పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ లైన్కు విరుద్దంగా మాట్లాడటం క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తుంటే, పార్టీ సిద్దాంతకర్తలు, కీలక నాయకులు, వరుసగా రాజీనామాలు సమర్పిస్తూ బయటకు వెళ్లిపోతుండటం మరింత కలకలం రేపుతోంది. ఇప్పటికే, రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, అద్దేపల్లి శ్రీధర్, పార్టీ కోశాధికారి, మెగా ఫ్యామిలీకి బంధువు రాఘవయ్య, శివశంకర్లు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. తాజాగా పార్టీ సిద్దాంతకర్త, వ్యూహకర్త, పవన్ కల్యాణ్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన రాజు రవితేజ, తాజాగా జనసేనకు రాజీనామా సమర్పించి, పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు చేయడం మాత్రం సంచలనంగా మారింది.
అయితే, జనసేన వ్యవస్థాపనలో రాజు రవితేజ కీలకంగా వ్యవహరించారు. జనసేన మొదటి జనరల్ సెక్రటరీ కూడా ఈయనే. పార్టీ రాజ్యాంగం రచన చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడు. పవన్ సిద్దాంతాల సమాహారం ఇజం పుస్తకం రచయిత. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ అంతరంగాన్ని ఎరిగిన వ్యక్తి. అలాంటి రాజు రవితేజ జనసేనకు రాజీనామా చేశారు. జనసేన స్థాపన టైంలో కులాలను ఏకం చేద్దాం, మతాలకు అతీతంగా నడుద్దామంటూ ప్రారంభమైన పార్టీ ప్రస్థానం, ఇప్పుడు దానికి విరుద్దంగా వెళుతోందని, అందుకే తాను పార్టీ నుంచి బయటికి వచ్చానని రవితేజ ప్రకటించారు. అంతేకాదు బీజేపీకి దగ్గరయ్యేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దాడులు, విద్వేష ప్రసంగాలు చేసిన పవన్... ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోయారని, పార్టీ మూల సిద్దాంతాలకు విరుద్దంగా, కులమతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని రాజు రవితేజ చెబుతున్నారు.
రాజు రవితేజ రాజీనామా వ్యవహారం అటుంచితే, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం, పార్టీ లైన్కు విరుద్దంగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దని పవన్ కల్యాణ్ అంటే, కావాలని ఏకంగా అసెంబ్లీలోనే అన్నారు రాపాక. అనవసరమైన కారణాలతో పవన్ దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని అన్నారు. పవన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకినాడ రైతు సౌభాగ్య దీక్షకు సైతం వెళ్లలేదు రాపాక. అంతేకాదు, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాపాక. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలంతా తాము పార్టీని వీడటానికి మనోహరే కారణమని చెబుతున్నారని అన్నారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపై తమ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే సంప్రదించుకుంటారని, మరెవరితోనూ మాట్లాడరని రాపాక తీవ్ర ఆరోపణలు చేశారు.
రాజీనామాల నుంచి రాపాక వరప్రసాద్ వ్యాఖ్యల దాకా, జనసేనలో జరుగుతున్న పరిణామాలు, జనసైనికులను గందరగోళం చేస్తున్నాయి. పార్టీలో ఏం జరుగుతుందో ఏమో, ఎవరెప్పుడు పార్టీ మారతారోనన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. పవన్ కల్యాణ్ కుల, మతాల గురించి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాజు రవితేజ ఆరోపిస్తే, ఇటు పవన్పై పెద్దగా విమర్శలు చేయకపోయినా, పార్టీలో నాదెండ్ల పెత్తనం పెరగడమే అశాంతికి దారి తీస్తోందని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించడం, రెండు అంశాలను స్పష్టం చేస్తోంది. అది పవన్ కల్యాణ్లో మార్పు, పార్టీలో నాదెండ్ల మనోహర్ వ్యవహారం. మరి, నిజంగానే, నాదెండ్ల మనోహర్ పెత్తనంపైనా నేతలు గుర్రుగా ఉన్నారా?. అలాగే, పవన్లో మార్పొచ్చిందా...వస్తే మార్పు మంచికేనని పవన్ చెబుతారా....లేదంటే ఈ కన్ఫ్యూజ్నే కంటిన్యూ చేస్తారో చూడాలి.