తొక్కిసలాటకు చంద్రబాబు కారణం కాదు

 

గోదావరి పుష్కరాల సమయంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం.. పుష్కర ముహూర్తంపై అనవసర ప్రచారం వల్ల జనం రద్దీ పెరగడం, తదితర కారణాలతోనే దుర్ఘటన జరిగిందని కమిటీ తెలిపింది.. తొక్కిసలాట ఘటనపై నియమించిన కమిటీ ఏపీ ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది.. ఆ నివేదికను మంత్రి పితాని సత్యనారాయణ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.. 2015, జులై 14న గోదావరి పుష్కరాల తొలిరోజున తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద తొక్కిసలాట జరిగింది.. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు పుష్కరస్నానం కోసం ఒక్కసారిగా పోటెత్తడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట చోటుచేసుకుంది.. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.. ఈ ఘటనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీవై సోమయాజులు నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేసింది.. ఈ కమిటీ ప్రత్యక్ష సాక్షులు, విధుల్లో ఉన్న అధికారులు, బాధితుల నుంచి వివరాలు సేకరించింది.. పుష్కరాల తొలిరోజు ఉదయం 6.26 గంటలకు స్నానం చేస్తే మంచిదంటూ విస్తృతంగా జరిగిన ప్రచారమే ఈ ఘటనకు కారణమని కమిటీ తేల్చింది.. ఈ ప్రచారంతోనే లక్షలాది మంది భక్తులు తెల్లవారుజామునే పుష్కరఘాట్‌కు చేరుకున్నారని, బారికేడ్లను తోసుకుంటా ఒక్కసారిగా నదిలో దిగేందుకు ప్రయత్నించడంతోనే తొక్కిసలాట జరిగిందని నివేదికలో పేర్కొంది.. ముహూర్త కాలంపై పత్రికలు, వార్తా ఛానెళ్లు, సోషల్‌ మీడియా, ప్రవచన కర్తలు చేసిన దుష్ప్రచారమే ఈ ఘటనకు కారణమని స్పష్టం చేసింది.. అయితే ఈ ఘటనకు సీఎం చంద్రబాబు కారణమంటూ గతంలో విపక్షాలు ఆరోపించాయి.. కమిటీ మాత్రం సీఎం వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగిందని, ప్రమాదం జరిగిన ఘాట్‌ వెడల్పు 300మీ మాత్రమే ఉండటం, పుష్కర ముహూర్తంపై అనవసర ప్రచారం తదితర కారణాలతోనే దుర్ఘటన జరిగిందని స్పష్టం చేసింది.