రేపే టీజేఎస్ అభ్యర్థుల ప్రకటన

 

మహాకూటమిలోని పార్టీలు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారా? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రతిరోజూ రేపే అభ్యర్థుల ప్రకటన అని ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి. ఎట్టకేలకు ఇప్పటికి సీట్ల సర్దుబాటు చర్చలు క్లైమాక్స్ కి వచ్చినట్టు తెలుస్తోంది. రేపు కూటమిలోని పార్టీలు అభ్యర్థులను ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు.  తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు టీజేఎస్ అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. ఎనిమిది లేదా అంతకన్నా ఎక్కువ స్థానాల్లో తాము పోటీ చేసే అవకాశముందని స్పష్టం చేశారు. తమ పార్టీ గుర్తు అయిన అగ్గిపెట్టె గుర్తుపైనే తాము పోటీ చేస్తామని అన్నారు. అయితే తాను పోటీచేసే విషయంపై ఇంకా స్పష్టత లేదని కోదండరాం అన్నారు.