నీరు ఎక్కువగా తాగితే మరణమే..!

 

అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు మన పెద్దలు..అతిగా ఏం చేసినా అది మంచిది కాదు. ఈ సూత్రం ఆరోగ్యానికి కూడా వర్తిస్తుంది. నీళ్లు తాగడం శరీరానికి మంచిదన్నారని అతిగా నీరు తాగితే అది ఏకంగా ప్రాణాలనే హరిస్తుందని తాజా అధ్యయనంలో బయటపడింది. ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకున్నా శరీరంపై ప్రతికూల ప్రభావమే చూపుతుందని తేలింది.

 

వీరి పరిశోధనలో భాగంగా కొంతమందిని తీసుకుని అందులో సగం మందికి దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాలని సూచించారు. మిగతా సగం మందిని అధికంగా నీళ్లు తాగాలని చెప్పారు. అనంతరం వారి ఎంఆర్ఐ తీసి చూడగా... అందులో నీళ్లు అధికంగా తాగిన వ్యక్తుల మెదడులోని ఫ్రీ ఫ్రంటల్ ప్రాంతాలు ఎంతో చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. అటువంటి వారు ఏదైనా తినాలన్నా..నమలడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని కనుగొన్నారు. అందుకే మనిషి దాహం వేసినప్పుడే నీరు తాగాలని వారు చెబుతున్నారు. అవసరం లేనప్పుడు నీళ్లు అధికంగా తాగకూడదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

ఎక్కువ నీళ్లు తాగితే తొందరగా సన్నబడతామనో, ఆరోగ్యం బాగుపడుతుందనో భావించి నీళ్లు బాగా తాగేస్తుంటారు. నిజానికి ఎంత నీరు కావాలో నిర్ణయించుకునే వ్యవస్థ మానవ శరీరంలో ఉంటుందట..ఆ వ్యవస్థ మనిషిని ఎక్కువ నీళ్లు తాగకుండా ఆపుతుందట. అయినప్పటికి మోతాదుకు మించి నీళ్లు తాగితే హైపోనెట్రేమియా అనే సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఏర్పడితే శరీరంలోని ఫ్లూయిడ్స్ పలచబడతాయి. ఫలితంగా సోడియం ప్రమాణాలు పడిపోతాయి. దీంతో బాడీలోని కణాలు వాస్తాయి. ఫలితంగా కొన్నిసార్లు స్పృహతప్పి పడిపోతారు. పరిస్ధితి విషమిస్తే కోమాలోకి కూడా పోవచ్చు. అందుకే మనిషి దాహం వేసినప్పుడే నీరు తాగాలని వారు చెబుతున్నారు.