విజయసాయితో సుజనా, సీఎం రమేష్ డిన్నర్ మీట్... ఫోటో వైరల్

 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లిన సమయంలో రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్ లు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరు బీజేపీలోకి వెళ్లడంతో టీడీపీ ఖాళీ అయ్యిందని కొందరు అభిప్రాయపడుతుంటే, చంద్రబాబే పథకం ప్రకారం వారిని బీజేపీలోకి పంపించారనే వాదనలు కూడా వినిపించాయి.

ఇదిలా ఉంటే ఓ వైరల్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ పార్టీ మారిన ఎంపీలతో కలిసి భోజనం చేస్తున్న ఫోటో. ఈ ఫోటోలపై టీడీపీ అభిమానులు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరికల వ్యవహారాన్ని విజయసాయిరెడ్డే పర్యవేక్షిస్తున్నారన్న చర్చ నెటిజన్లలో జరుగుతోంది. ఇదేం రాజకీయమంటూ ప్రశ్నిస్తున్నారు.

లోక్‌సభ ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా విజయసాయిరెడ్డి, సీఎం రమేష్‌లు పక్కపక్కనే కూర్చున్నారు. గతంలో ఉప్పు, నిప్పులా ఉన్న ఇద్దరూ రెండు గంటలకుపైగా లోక్‌సభలోనే చర్చించుకున్నారు. మిత్రపక్షం బీజేపీని బలోపేతం చేయడంతోపాటు విపక్షాన్ని దెబ్బతీసే ఎత్తుగడను విజయసాయిరెడ్డి అమలు చేస్తున్నారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ టీడీపీ ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి విజయసాయి రెడ్డే కారణమని,ఆయన ప్రోద్భలంతోనే బీజేపీలో చేరారంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

అంతకు ముందే పార్టీ మారిన నలుగురు ఎంపీలు, చంద్రబాబు బాబును టార్గెట్ చేస్తూ విజయసాయి ట్వీట్ చేశారు. అందులో "లక్షల కోట్ల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి  వస్తుందన్నఆందోళనతోనే చంద్రబాబు బిజెపితో మళ్ళీ సయోధ్యకు తహతహలాడుతున్నారు. ముందుగా రాజ్యసభ సభ్యలను పంపించి రూట్‌ క్లియర్‌ చేసుకుంటున్నారు. వీళ్ల ద్వారా బిజెపి పెద్దలతో రాజీ కుదుర్చుకుని కేసుల నుంచి బయటపడే ప్లాన్"’అంటూ ఆరోపించారు.

ఇదిలా ఉంటే, పార్లమెంట్ సభ్యులకు ప్రధాని మోదీ ఢిల్లీలో విందు ఇచ్చారట. ఆ విందుకు హాజరైన సమయంలో విజయసాయితో కలిసి నలుగురు ఎంపీలు భోజనం చేశారనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ ఫోటో వ్యవహారంపై అటు విజయసాయిరెడ్డి కాని నలుగురు ఎంపీలు కానీ స్పందించ లేదు. వారు స్పందిస్తే ఈ ఫోటో వ్యవహారంపై ఓ క్లారిటీ వస్తుంది.