జూ.ఎన్టీఆర్‌కి, లోకేష్ కి.. నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది: వంశీ

 

సోషల్ మీడియాలో తనను కించపరిచేలా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీకి ఫిర్యాదు చేశారు వల్లభనేని వంశీ. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుని కలిసి పరిస్థితులను వివరించారు. ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసి  తనపై అభ్యంతరకర రీతిలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదంతా టీడీపీ సోషల్ మీడియా వింగ్‌ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. బాధ్యులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు వంశీ. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ.. 'చంద్రబాబు తనను సస్పెండ్ చేసేదేంటి.. నేనే పనిచేయనని చెప్పి బయటకొచ్చేశా' అంటూ కౌంటర్ వేశాడు. చంద్రబాబుకు అంత సీన్ లేదని.. మహా అయితే పళ్లు కొరకడం తప్ప ఆయనేమి చేయలేరని చతుర్లు ఆడారు. చంద్రబాబుకి రోషం ఉంటే పార్టీ మారిన రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయాలన్నారు. జూ.ఎన్టీఆర్‌కి..నారా లోకేష్ కి.. నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని తెలిపారు. లోకేష్ కి పార్టీలో  పనిలేక సోషల్ మీడియా వింగ్స్ నడుపుకుంటూ కూర్చుంటున్నాడని విమర్శించారు. వెబ్‌సైట్స్ ద్వారా నేతల మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని.. తనపై కూడా అలానే చెయ్యడం వల్లే మనస్తాపంతో పార్టీని వీడానని చెప్పుకొచ్చారు. పరువు కాపాడుకునేందుకు తనను సస్పెండ్ చేశారని.. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.