కరోనా తోనే సతమతమౌతుంటే.. కొత్తగా ప్రమాదకర న్యుమోనియా..!

ప్రపంచం మొత్తం కరోనా వ్యాప్తితో తల్లడిల్లుతోంది. ఈ వ్యాధి వ్యాప్తి మొదలై ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు దీనిని ఎదుర్కొనేందుకు సరైన మందు  రాలేదు. ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ట్రయల్స్ లో ఉన్నాయి. ప్రస్తుతం మానవాళి కరోనా తో సతమతమవుతుంటే మరో పక్క కొత్త కొత్త వైరస్‌లు దాడులు చేస్తున్నాయి. ఇంకా కరోనా కథ కంచికి చేరక ముందే చైనాలో జీ-4 వైరస్, బ్యూబానిక్ ప్లేగ్ వ్యాధులు ప్రబలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు తాజాగా మరో కొత్త వ్యాధి కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కజఖ్‌స్థాన్ దేశం ‌లో గుర్తు తెలియని కొత్త న్యుమోనియా ఒకటి అలజడి సృష్టిస్తున్నట్లు ఆ దేశంలోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. అంతే కాకుండా కజఖ్‌స్థాన్‌లో ఉన్న చైనా దేశస్తులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసినట్లు చైనా లోని ప్రముఖ పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.

గ్లోబల్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం కజఖ్‌స్థాన్‌లో గుర్తుతెలియని న్యుమోనియాతో ఈ సంవత్సరం లో ఇప్పటివరకు 1,772 మంది మరణించారు. గడచిన జూన్‌ నెలలోనే 628 మంది చనిపోయారు. ఈ చనిపోయిన వారిలో చైనా వారు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఈ వివరాలను కజఖ్‌స్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం వీచాట్‌ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కజఖ్‌స్థాన్‌లోని షిమ్కెంట్, అతిరో, అక్టోబ్ నగరాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని ఆ పత్రిక తెలిపింది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇది కరోనావైరస్ కంటే ప్రమాదకరమని, దీనిలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని తెలిపింది. ఐతే చైనా మీడియాలో వచ్చిన ఈ వార్తలను కజఖ్‌స్థాన్ వైద్యఆరోగ్యశాఖ తీవ్రంగా ఖండించింది. మా దేశంలో కొత్త న్యూమోనియా వచ్చిందన్న వార్తలు నిరాధారమైనవని అవి కేవలం తప్పుడు కథనాలు అని కొట్టిపారేసింది. ఇది కేవలం సాధారణ న్యుమోనియాగా మాత్రమేనని ఐతే గత ఏడాది జూన్‌తో పోల్చితే ఈ సంవత్సరం న్యూమోనియా కేసులు ఎక్కువగా నమోదయ్యాయని అక్కడి ప్రముఖ న్యూస్ ఏజన్సీ కజిన్‌ఫామ్ తెలిపింది.