కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్న వైసీపీలోని రెండు గ్రూపులు..
posted on Jan 18, 2021 9:20AM
కర్నూలు జిల్లా డోన్ లోని పాతపేటలో వైసీపీకి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటలో.. కత్తులు, రాడ్లు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతపేటలో వైసీపీలోని రెండు గ్రూపుల మధ్య గత కొంత కాలంగా ఆధిపత్యపోరు నడుస్తోంది. గడచిన రెండు నెలల్లో ఈ రెండు వర్గాల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే రెండు వర్గాల వారు డోన్ పట్టణ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో పాతపేటలోని చౌక్లో నాగరాజు, ఫరీద్ మధ్య ఆదివారం మాటామాటా పెరిగింది. విషయం తెలిసిన నాగరాజు, అతడి అనుచరులు కత్తులు, రాడ్లతో ఫరీద్పై దాడికి పాల్పడ్డారు. అయితే అక్కడే ఉన్న ఫరీద్ వర్గీయులు ఎదురు దాడికి దిగారు. రెండు వర్గాల మధ్య అరగంట పాటు జరిగిన దాడులతో ఆ ప్రాంతం మొత్తం రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన నాగరాజు, కిషోర్, కిరణ్ను కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వైసీపీ పార్టీకి చెందిన నాగరాజు, ఫరీద్లు కొంత కాలం క్రితం రెండు వర్గాలుగా విడిపోయారు. స్థానికంగా నడుస్తున్న మట్కా, మద్యంపై ఆధిపత్యం కోసం వీరిద్దరూ గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలలో పలుమార్లు వీరి మధ్య గొడవలు జరిగాయి. నిన్న సాయంత్రం ఘర్షణ కూడా ఇందులోనే భాగంగానే జరిగినట్టు తెలుస్తోంది.