బీజేపీ నేతలు చిల్లర ప్రచారాన్ని మానుకోవాలి: కేటీఆర్

 

కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా రాజకీయాలు మారిపోవచ్చు, ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అన్నట్టుగా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం.. కర్ణాటకలో చేసినట్టుగా డ్రామాలు చేయడం తెలంగాణలో సాధ్యం కాదని బీజేపీ నేతలను హెచ్చరించారు.

సోమవారం నాడు కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో చేసినట్టుగా డ్రామాలు చేయడం తెలంగాణలో సాధ్యం కాదన్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైద్రాబాద్ వేదికగా అన్ని అబద్దాలు మాట్లాడినట్టుగా ఆయన విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని  ఆరోపణలు చేస్తున్నారు. అవినీతిపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

బీజేపీ నేతలు చిల్లర ప్రచారాన్ని మానుకోవాలని మండిపడ్డారు. గత ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలనే కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టి అమలు చేస్తోందని ఎద్దేవాచేశారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు వంటి పథకాలను కేంద్రం ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. జేపీ నడ్డా తప్పుడు ప్రచారాన్ని  తెలంగాణ బిడ్డలు నమ్మరని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 119  స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో గెలుపొందిందని కేటీఆర్ ప్రశ్నించారు. మెజార్టీ స్థానాల్లో బీజేపీ డిపాజిట్లను కోల్పోయిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసినా కూడా ప్రజలు బీజేపీని ఓడించారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.