టీడీపీలో చేరిన టీఆర్ఎస్ కీలక నేత!!

అధికార పార్టీలోకి వలసలు సహజం. అయితే, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కొందరు టీడీపీలోకి జంప్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తెలంగాణ టీడీపీలో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పసుపు కండువాలు కప్పుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేత సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి కారు దిగి సైకిలెక్కారు. శనివారం నాడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సమక్షంలో మురళీధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈయన ఎల్బీనగర్‌కు చెందిన నేత. ఈ నియోజకవర్గంపై మురళీకి మంచి పట్టు ఉందని తెలుస్తోంది. కాగా, మురళీతో పాటు టీఆర్ఎస్‌కు చెందిన సుమారు రెండు వందల మంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

 

తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్న వేళ.. టీడీపీలో వలసలు ఊపందుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. అదీగాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎల్బీనగర్‌ కు చెందిన నేత పెద్దఎత్తున కార్యకర్తలతో కలిసి టీడీపీలో చేరడం.. అధికార పార్టీ టీఆర్ఎస్ కు గట్టిదెబ్బ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.