వనజీవి రామయ్య ఇక లేరు

ట్రీ మేన్ ఆఫ్ ఇండియా వనజీవి రామయ్య ఇక లేరు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య..  పచ్చదనమే ప్రాణంగా… మొక్కలు పెంచడమే జీవితంగా బతికి వనజీవి రామయ్యగా గుర్తింపు పొందారు. ఆయన జీవితంలో కోటి మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అటువంటి వనజీవి రామయ్య శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వనజీవి   ఈ తెల్లవారు జామున కన్నుమూశారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం లో వనజీవి రామయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.  అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రామయ్య పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసిన సమయంలో పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమంలో రామయ్య విస్తృతంగా పాల్గొన్నారు..వృక్షో రక్షితో రక్షిత: అనే నినాదంతో ఉన్న ఫలకాన్ని ఆయన మెడలో ధరించి కార్యక్ర మాలకు హాజరయ్యేవారు.  కోటికి పైగా మొక్కలు నాటిన పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య మరణం సమాజానికి తీరని లోటని రేవంత్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.   
వనజీవి రామయ్య ఇక లేరు Publish Date: Apr 12, 2025 9:46AM

రేవంత్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టు చురకలు!

బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరణపై తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తీరు రాష్ట్రంలో బీఆర్ఎస్ సభలు, సమావేశాలూ నిర్వహించకూడదన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. విషయమేంటంటే..  బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి పాతికేళ్లు అయిన సందర్భంగా ఆ పార్టీ  వ‌రంగ‌ల్ జిల్లా, ఎల్క‌తుర్తిలో పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్స‌వం, వజ్రోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఇందు కోసం సభ ఏర్పాట్లు, ర్యాలీలు తదితర అంశాలకు సంబంధించి అనుమతి కోసం పోలీసులను కోరింది. అయితే సెక్షన్ 30 అమల్లో ఉందంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్ తెలంగాణ కోర్టు శుక్రవారం (ఏప్రిల్ 11) విచారించింది. ఆ సందర్భంగా పోలీసుల తీరును తప్పుపట్టింది. ప్రజాస్వామ్యంలో పార్టీలకు సభలూ, సమావేశాలూ నిర్వహించుకునే హక్కు, స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. రాజ్యాంగ బద్ధంగా అభించిన హక్కును అడ్డుకోవడం తగదని పేర్కొంది. కాగా సభకు అనుమతించే విషయంలో తమకు ఈ నెల 21 వరకూ గడువు ఇస్తే వాదనలు వినిపిస్తామంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై తెలంగాణ కోర్టు తీవ్రంగా స్పందించింది. బీఆర్ఎస్ 27న సభ నిర్వహించుకోవాలని కోరితే..  మీరేమో 21వ తేదీ వ‌ర‌కు గ‌డువు కోరడం చేస్తుంటే.. వారికి స‌భ నిర్విహించుకునే అవకాశం లేకుండా చేయాన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.  
రేవంత్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టు చురకలు! Publish Date: Apr 12, 2025 6:29AM

గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్.. నెల్లూరు జైలుకు తరలింపు

వైసీపీ సీనియర్ నాయకుడు,   హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి ప్రయత్నించిన గోరంట్లతో పాటు ఆయన అనుచరులు ఐదుగురికి  గుంటూరు కోర్టు  రిమాండ్ విధించింది. దీంతో మరో వైసీపీ నేత కటకటాల పాలైనట్లైంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్ అనే తెలుగుదేశం కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరు తరలిస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని నిలువరించి, వారి సమక్షంలోనే చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులు గోరంట్ల మాధవ్ ను అదుపులోనికి తీసుకుని శుక్రవారం సాయంత్రం గుంటూరు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.  దీంతో ఆయనను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. నెల్లూరు జైలుకే ఎందుకంటే.. గోరంట్ల మాధవ్ దాడి చేయడానికి ప్రయత్నించిన చేబ్రోలు కిరణ్ ఇప్పటికే గుంటూరు జైలులో ఉండటంతో.. గోరంట్ల మాధవ్ ను నెల్లూరు జైలుకు తరలించారు.   
గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్.. నెల్లూరు జైలుకు తరలింపు Publish Date: Apr 12, 2025 5:45AM

వైసీపీ దుష్ప్రచారంపై టీటీడీ ఆగ్రహం

గోవుల మ‌ృతి ప్రచారంపై భూమనకు భానుప్రకాష్ సవాల్ తిరుమల తిరుపతి దేవస్థానంలో తీవ్ర అవకతవకలు పాల్పడి విచారణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు మరో దుష్ప్రచారానికి తెర లేపారు. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. గత మూడు నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. చనిపోయిన ఆవులకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసింది. టీటీడీ, ప్రభుత్వం ఈ విషయాన్ని బయటకు రాకుండా రహస్యంగా ఉంచినట్లు ఆరోపించారు. టీడడీ గోశాలలో ఆవుల మరణంపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ ప్రచారం అంతా అవాస్తమని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మృతి చెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని, కొంతమంది దురుద్దేశంతో ఆ ఫొటోల్లో ఉన్నవి  టీడీపీ గోవులుగా చూపిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని టీటీడీ యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నామని టీటీడీ తెలిపింది.  ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు ఆరోపణలు చేయడం కాదని.. గోశాల పరిశీలనకు రావాలని కరుణాకర్ రెడ్డికి భానుప్రకాష్ సవాల్ విసిరారు. శ్రీవారిని కించపరిచే విధంగా వ్యవహారాలు నడిపిన చరిత్ర కరణాకర్ రెడ్డిది అంటూ మండిపడ్డారు. ఆయన వస్తే అన్ని రికార్డులను చూపిస్తామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం కరుణాకర్ రెడ్డికి తగదని,  లీగల్‌గా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. శ్రీవారి ప్రసాదాలకు వాడిన పదార్థాలు కూడా నాణ్యమైనవి కాదని ఇప్పటికే నివేదికలు ఉన్నాయన్నారు. టీటీడీ గోశాల  కరుణాకర్ రెడ్డి పరిశీలన చేయవచ్చని సవాల్ చేశారు. అనారోగ్యంతో చనిపోయిన గోవుల వివరాలను టీటీడీ రికార్డులను నిర్వహిస్తోందన్నారు. కరుణాకర్ రెడ్డి హయాంలో టీటీడీలో పెద్దఎత్తున నిధులను దారి మళ్లించిన ఘనత ఆయనదే అంటూ భాను ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయడానికి నిదర్శనం వైసీపీ అని, ధార్మిక క్షేత్రంలో దారుణం జరిగిపోతోందని అసత్య ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. మరి భానుప్రకాష్ సవాల్‌ను భూమన  ఏ మాత్రం స్వీకరిస్తారో? తమ అరోపణల్లో నిజముంటే వాటిని ఏ మాత్రం నిరూపిస్తారో చూడాలి?
వైసీపీ దుష్ప్రచారంపై టీటీడీ ఆగ్రహం Publish Date: Apr 12, 2025 5:37AM

బొత్స మెడపై విశాఖ మేయర్ పీఠం కత్తి

విశాఖ మేయర్ పదవి విషయంలో వైసిపి తప్పటడుగు? ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందంటారు. ఇప్పుడు విశాఖ మేయర్ విషయంలో వైసీపీ నిర్ణయాలు బొత్స సత్యనారాయణ కు సవాలుగా మారాయి. ఏడాది కాలం కూడా లేని పదవి కోసం పెట్టిన శిబిరాలు ఫలిస్తాయా? ఫలితం రాకపోతే తనకు నష్టం కలుగుతుందా అన్న ఆలోచనలో ఇప్పుడు బొత్స ఉన్నట్టు కనిపిస్తోంది.  వైసీపీ   అధికారంలో ఉన్నప్పుడు విశాఖ మేయర్ పీఠం ఆ పార్టీ దక్కించుకుంది. మేయర్ గా బీసీ మహిళ గొలగాని హరి వెంకట కుమారిని పార్టీ నియమించింది. వాస్తవానికి మేయర్ హరి వెంకట కుమారి అయినప్పటికీ పెద్దరికమంతా వైసీపీ పెద్దలదే. కొంతకాలం విజయసాయిరెడ్డి ఆ తర్వాత వై వి సుబ్బారెడ్డి కనుసనల్లోనే విశాఖ కార్పొరేషన్ పాలన జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తమకు ఆ పదవి దక్కడమే చాలు అంటూ మేయర్ హరి వెంకట కుమారి, ఆమె భర్త శ్రీనివాస్ వ్యవహరించారు. కార్పొరేషన్ లో కూడా వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ ల హవాయే కొనసాగింది. దీనిపై సొంత పార్టీలో కూడా చాలా వరకు అసంతృప్తి ఉండేది. అధికారంలో ఉన్నప్పుడు నిధులు కేటాయింపు విషయంలో కూడా తమకు నిర్లక్ష్యంగా చూశారని కొందరు కార్పొరేటర్లలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దశలో నాలుగేళ్ల పాలన ముగిసింది. కూటమి నాయకులు అవిశ్వాస తీర్మానం నోటీసు జిల్లా కలెక్టర్ కు ఇచ్చారు. దీంతో వైసీపీలో గుబులు మొదలైంది. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచిన కార్పొరేటర్లతో పాటు ఇండిపెండెంట్, తెలుగుదేశం కార్పొరేటర్ లను కూడా తమ వైపు లాక్కున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి తమకు వస్తుందని వైసీపీలో భయం మొదలైంది. అందుకు తగ్గట్టే కొందరు వైసీపీ  కార్పొరేటర్లు తెలుగుదేశంలోకి మరికొందరు జనసేన  వైపు వెళ్లారు. మరి కొందరు అదే బాటలో అడుగులు వేస్తున్న దశలో పార్టీ పెద్దగా బొత్స సత్యనారాయణ కార్పొరేటర్ల వలసలు అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ క్రమంలో కార్పొరేటర్ లను గోవాకు తరలించారు. అక్కడి నుంచి శ్రీలంక కు కూడా శిబిరాన్ని మార్చేస్తున్నారు. నిజానికి 98 వార్డులు ఉన్న విశాఖ కార్పొరేషన్ లో ఎక్స్ ఎఫిషియో సభ్యులతో కలిసి 111 మంది సభ్యులు ఉంటారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మ్యాజిక్ ఫిగరు చేరాలి. ఇప్పటికకే కూటమికి 70 మంది కార్పొరేటర్ల బలం ఉంది.  వైసీపీకి ఎక్స్ అఫీషియో సభ్యులు ముగ్గురు, మరో 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు ఈ దశలో కూటమికి నలుగురు సభ్యుల బలం అవసరం. సిపిఐ పార్టీ కార్పొరేటర్ స్టాలిన్, గతంలో వైసీపీలో  ఉండి పార్టీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాసరావు కుమార్తె ముత్తంశెట్టి ప్రియాంక లు కూటమికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది. అయితే వారిద్దరూ ఓటు వేసినా మరో ఇద్దరి ఓట్లు అవిశ్వాసానికి అనుకూలంగా పడటం అవసరం. అయితే కూటమి నాయకులు మాత్రం వైసీపీ శిబిరంలో ఉన్న ఐదుగురు కార్పొరేటర్లు తమకు అనుకూలంగా ఉన్నారని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ వ్యవహారాన్ని అంతా తన భుజాన వేసుకొని మేయర్ పీఠాన్ని వైసీపీకి ఉండేలా చేస్తానంటూ బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 రోజులుగా శిబిరం కొనసాగుతోంది. ఈనెల 19వ తేదీన ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.  ఆ రోజు జరిగే కౌన్సిల్లో కచ్చితంగా కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసంపై చర్చ చేసే అవకాశం ఉంది. టిడిపికి పూర్తిగా మద్దతు ఇవ్వాలని జనసేనకు చెందిన 11 మంది కార్పొరేటర్లు గురువారం తీర్మానం చేశారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సమావేశమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అందరూ కట్టుబడి ఉంటారని ప్రకటన కూడా చేశారు. నిజానికి వైసీపీలో అంతర్గత  విభేదాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ వ్యవహారాలు కొందరిచుట్టూ తిరిగాయని బహిరంగ విమర్శలు ఉన్నాయి. చివరికి కౌన్సిల్లో మాట్లాడడానికి తమకు అవకాశం కూడా ఇవ్వడం లేదని వైసీపీకి చెందిన కార్పొరేటర్   తిప్పల వంశీ లాంటి నాయకులు ఎన్నో సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. అలాగే వార్డులకు నిధులు కేటాయించే సమయంలో కూడా తమను పట్టించుకోలేదన్న అసంతృప్తి కార్పొరేటర్లలో ఉంది.  దీన్ని ఆసరాగా తీసుకొని కూటమి నాయకులు పూర్తి స్థాయిలో వార్డు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని కార్పొరేటర్లకు హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. మరో ఏడాది కాలంలో పదవులు ముగియనున్న దశలో ప్రజలకు అభివృద్ధి పనులు చేస్తే మేలు జరుగుతుందన్న భావనలో కార్పొరేటర్లు ఉన్నారు. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కేకే రాజు పై కొందరు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. వారు కచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉంటారన్న సమాచారం వైసీపీ పెద్దలకు చేరింది. దీంతో అప్పటికప్పుడు ఈ అనుమానిత కార్పొరేటర్లకు పార్టీ పదవులను ఆఫర్ చేశారని విశాఖలో చర్చ జరుగుతోంది. పదవులు ఇచ్చినంత మాత్రాన గతంలో జరిగిన అన్యాయాన్ని ఈ కార్పొరేటర్లు మర్చిపోతారా అన్నది అనుమానంగా ఉంది. ఇప్పటికే శిబిరం నిర్వహణ ఖర్చులు భారంగా మారడమే కాక , సమయం దగ్గర పడుతున్న కొలది తమ కార్పొరేటర్లు ఎటువైపు వెళ్తారో అని బొత్స వర్గంలో కలవరం కనిపిస్తోంది. చేతులెత్తి ఓటు వేసే పరిస్థితి వస్తే కొందరు కార్పొరేటర్లు గైర్హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయన్న భయం కూడా వైసిపి పెద్దల్లో  కనిపిస్తున్నది. కూటమి మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి నలుగురు సభ్యుల సహకారం అవసరం. సిపిఎం కార్పొరేటర్ స్టాలిన్, వైసీపీకి రాజీనామా చేసిన ముత్తంశెట్టి ప్రియాంక లు కూటమికి అనుకూలంగా ఓటు వేసినా లేక గైర్హాజరైనా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు పడినట్టే. ఇక వైసీపీఅసంతృప్తి కార్పొరేటర్ల కుటుంబ పెద్దలతో కూటమి నాయకులు టచ్ లో ఉన్నారు. పార్టీ అధికారంలో అన్యాయం జరిగినట్టు భావిస్తున్న ఆ కార్పొరేటర్లు దాదాపు ఐదుగురు కూటమికి అనుకూలంగా ఉన్నారని వినికిడి. ఇదే జరిగితే మేయర్ పదవి కోల్పోవడమే కాక.. ఈ తతంగం నిర్వహణలో వైఫల్యం చెందినట్లు బొత్స సత్యనారాయణకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వైసీపీలో మరో వర్గం సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 19 డెడ్ లైన్ గా వైసీపీ కార్పొరేటర్ల శిబిరం కొనసాగనుంది. అయితే తాజాగా కూటమి కూడా తమ పార్టీ కార్పొరేటర్ లను ఓ శిబిరంలోకి తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కూటమి తరపున మేయర్ పీఠం ఆశిస్తున్న పీలా శ్రీనివాసరావు ఆర్థికంగా పూర్తి సహాయాన్ని అందిస్తున్నారు. ఎన్నికల ముందే వైసీపీ మేయర్ పీఠాన్ని కోల్పోయినట్లయితే పెద్దగా లాభం లేకపోయినప్పటికీ  అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు చేసిన వ్యవహారానికి ప్రతీకారం  తీర్చుకున్నట్లౌతుందని కూటమి నాయకులు చెప్పుకుం టున్నారు. ఇటు అధిష్టానం గానీ అటు మేయర్  హరి వెంకట కుమారి గాని ఈ విషయంలో పెద్దగా సీరియస్ గా వ్యవహరించక పోవడం తో మొత్తం వ్యవహారం బొత్స మెడ కు చుట్టుకున్నట్టు అయింది.
బొత్స మెడపై విశాఖ మేయర్ పీఠం కత్తి Publish Date: Apr 11, 2025 4:58PM

వాయిస్ మార్చిన జోగు రమేశ్.. ఎవరికీ భయపడరంట

నిక్కర్లు  వేసుకున్నప్పటి నుంచి వైఎస్ శిష్యుడిగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నానంటున్న మాజీ మంత్రి జోగు రమేశ్,  సీఐడీ నోటీసులతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ సీఐడీ విచారణకు శుక్రవారం (ఏప్రిల్ 11) హాజరయ్యారు. విజయవాడ రీజనల్ సీఐడీ కార్యాలయంలో విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి జోగు రమేష్ మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు సీఐడీ అధికారుల ఇచ్చిన నోటీసుపై విచారణకు వచ్చానని తెలిపారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పానని వెల్లడించారు. నాడు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలపై చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలపడానికే వెళ్లానని, దాడి చేయలేదని పేర్కొన్నారు.  10 నెలల పాలనలో టీడీపీ అట్టడుగు స్థానానికి వెళ్ళిందని జోగు రమేష్ మర్శించారు. అధికారం ఉందని విర్రవీగి కేసులు పెట్టాలని చూస్తున్నారనీ,  ఇదంతా తాత్కాలిమని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పరిపాలన చేయమని ఓట్లు వేస్తే రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, మానభంగాలు జరుగు తున్నా యన్నారు. అధికారం కోసం కొట్లాటకు దిగుతున్నారని, దోచుకోవడం కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. పీఠంపై కొడుకు ఎక్కాలా దత్త పుత్రుడు ఎక్కాలా అన్న చర్చ రాష్ట్రంలో నడుస్తోం దంటూ జోగురమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.   నోటీసులతో  తమను ఏమి చేయలేరని మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ రెడ్ బుక్ ఎంత కాలం పట్టుకొని తిరుగుతావ్ ఏదో ఒకరోజు దానిని మడత పెట్టుకోవాల్సిందే అని మండిపడ్డారు. భూమి గుండ్రంగా తిరుగుతుంది ఎల్లకాలం ఒకేలా ఉండదని ఒకటి లేదా రెండేళ్లు రెడ్ బుక్ పట్టుకుంటారని.. 5 ఏళ్లు పట్టుకొని తిరుగుతారా అని నిలదీశారు. ఉవ్వెత్తున ఎగిసిన పతాకంలా వైసీపీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. జోగి రమేష్ భారీ కాన్వయ్‌తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి తెగబడ్డారు. ఈ కేసును ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని,   సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు ఈరోజు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా జోగి రమేష్ సుప్రీం కోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తరువాతే సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఏపిలో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రదర్శిం చిన దూకుడుకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జోగి కుటుంబంపై ఆరోపణలు రావడం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ని అరెస్టు చేయడం జోగి రాజకీయ భవిష్యత్తును ఒక్క కుదుపు కుదిపింది. ఒక వైపు కుమారుడి అరెస్టు,  మరో వైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్‌ను విచారణ పేరుతో స్టేషన్ల  చుట్టూ తిప్పడం లాంటి పరిమాణాలు ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి ఆ క్రమంలో జోగి రమేష్ తన కష్టాలు అన్నీ ఇన్నీ కావని .. తనకు శనిపట్టిందని అంతా కష్టకాలమే నడుస్తోందని కనిపించిన అందరి దగ్గరా మొత్తుకుంటున్నారట . వాస్తవానికి నారా లోకేశ్ రెడ్ బుక్‌లో టాప్ ఫైవ్ లో తన పేరు ఉందని, తనని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారనే భయంతో టీడీపీలో చేరడానికి ఆయన సిద్ధమయ్యారని కూడా వార్తలు వినవచ్చాయి.  చంద్రబాబు, లోకేశ్‌లను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా అడిగారట. గతంలో వైసీపీలో పని చేసి తర్వాత టీడీపీ మంత్రిగా ఉన్న కృష్ణాజిల్లాకే చెందిన బీసీ నేత పార్థసారథితో కలిసి టీడీపీలో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారంట. అయితే టీడీపీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జోగి రమేష్ ను పార్టీలో చేర్చుకునేది లేదని తెగేసి చెప్పేశారంట. ఇటీవల నూజివీడులో పార్థసారథి, తదితర తెలుగుదేశం నేతలతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నది కూడా అందుకేనంట. ఏది ఏమైనా ఇప్పుడు  తెలుగుదేశం పార్టీలో ఎంట్రీకి డోర్లు అన్నీ మూసుకుపోవడం, కేసుల తాకిడి పెరుగుతూ విచారణలు ఎదుర్కోవాల్సి రావడంతో గత్యంతరం లేని స్థితిలో జోగి రమేశ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతా ఆయన అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి పసుపు చొక్కా వేసుకుని తిరిగేవారనీ, ఇప్పుడా చాన్స్ లేకపోవడంతో జైలు జీవితానికి మానసికంగా సిద్దమవుతూ,  ఆ ఫ్రస్ట్రేషన్‌లో మళ్లీ నోటికి పనిచెప్తున్నారంటున్నారు.
వాయిస్ మార్చిన జోగు రమేశ్.. ఎవరికీ భయపడరంట Publish Date: Apr 11, 2025 3:54PM

లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించిన కవిత.. విషయమేంటి?

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలలో ఒక పార్టీ నేతలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ, మరో పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించారు. మామూలుగా అయితే రాష్ట్ర విభజన తరువాత నుంచీ బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలూ, చర్యలూ పెద్దగా ఏమీ లేకపోయినా.. బీఆర్ఎస్ అధినేత నుంచి ఆ పార్టీ నేతలంతా తెలుగుదేశం అంటే ఉలిక్కి పడుతుంటారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే.. చంద్రబాబుకు 2019 ఎన్నికలలో బిగ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని చెప్పుకున్నారు కూడా. అలాగే ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జగన్ హయాంలో చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసినప్పుడు చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అసలు కేసీఆర్ అయితే తెలంగాణలో తన రాజకీయప్రయాణం సాఫీగా జరగాలంటే చంద్రబాబును టార్గెట్ చేసి రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ను సజీవంగా ఉంచడం ఒక్కటే మార్గమని భావిస్తుంటారని పరిశీలకులు చెబుతారు. అటువంటిది బీఆర్ఎస్ అధినేత కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా చంద్రబాబు, లోకేష్ లపై ప్రశంసల వర్షం కురిపించి, అదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించడం రెండు రాష్ట్రాలలోనూ చర్చనీయాంశంగా మారింది.   అదే విధంగా కవిత చంద్రబాబు, లోకేష్ లను పొగడడం బీఆర్ఎస్ లో కూడా ఆసక్తికర చర్చకు దారి తీసింది.  ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కవిత తన తండ్రి కేసీఆర్ తన ఫేవరెట్ లీడరని చెబుతూనే.. చంద్రబాబు మనోధైర్యం, లోకేష్ మేకోవర్ అద్భుతమని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు చాలా సిన్సియర్ లీడర్, ఏ సమస్యనైనా, సవాల్ నైనా ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పిన కవిత, ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ మేకోవర్ అద్బుతమన్నారు. ప్రజలతో ఆయన మమే కమయ్యే విధానాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అదే సమయంలో  బీఆర్ఎస్ తో, కేసీఆర్ తో సత్సం బంధాలు కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకోవలసిన నాయకుడు కాదంటూ చులకన చేశారు. పవన్ పై తనకు ఏ మా త్రం గౌరవం లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఉభయ రాష్ట్రాలలోనూ ఇప్పుడు కవిత వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. కూటమి పార్టీలలో ఒక పార్టీ నేతలపై పొగడ్తలు, మరో పార్టీ అధినేతపై విరమ్శల వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  
లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించిన కవిత.. విషయమేంటి? Publish Date: Apr 11, 2025 3:24PM

మావోయిస్టుల మకాంతో కర్రె గుట్టలపై టెన్షన్ వాతావరణం

మావోయిస్టులు  శాంతి చర్చలు జరపడానికి సిద్దమై రెండు వారాలు గడుస్తున్నప్పటి కేంద్రం   ఇంత వరకు స్పందించక పోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో ఎన్ కౌంటర్లకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.  వచ్చే మార్చికల్లా నక్సల్ రహిత దేశం తయారు చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.  కర్రెగుట్టలపై మావోయిస్టు లు షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకోవడంతో  తెలంగాణ ప్రభుత్వం భధ్రతా  బలగాలను రంగంలో దించినట్లు తెలుస్తోంది. కర్రెగుట్టలు దాదాపు 150 కిలో మీటర్ల దూరం వరకు వ్యాపించి ఉన్నాయి. ఎత్తయిన ఈ గుట్టలపై పోలీసులు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఒకవేళ కర్రెగుట్టలపై వెళితే భారీ ప్రాణ నష్ట సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికే మావోయిస్టులు వివిధ  కమిటిల పేరిట లేఖలు విడుదల చేస్తున్నారు.  కర్రెగుట్టలపై రావొద్దనేది  ఆ లేఖల సారాంశం.  అమాయక గిరిజనులు కర్రెగుట్టలపై రావొద్దని  ఓ వైపు మావోయిస్టులు చెబుతుంటే పోలీసులు మాత్రం కర్రెగుట్టలపై వెళ్లి అడవి సంపదను వినియోగించుకోవాలని చెబుతున్నారు. తాజాగా శుక్రవారం  మలుగు ఎస్పీమీడియా సమావేశం ఏర్పాటు  చేసి గిరిజనులు కర్రెగుట్టల వైపు వెళ్లాలని కోరుతున్నారు. గిరిజనులు కర్రెగుట్టలపై ఉన్న ఇప్పపువ్వు వంటి అడవి సంపదపై ఆధారపడ్డ గిరిజనులు కర్రెగుట్టల వైపు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. కర్రెల గుట్టల్లో మావోయిస్టులు ఎక్కువకాలం ఉండలేరు. తినే పదార్థాలు, వైద్య సదుపాయాల కోం మావోయిస్టులు గుట్టలు దిగే పరిస్థితి ఉంది.  మావోయిస్టులు కర్రెగుట్టల క్రిందకు దిగే సమయంలో అరెస్ట్ లు జరుగుతున్నాయి. అనారోగ్యంతో ఉన్న మావోయిస్టులు కర్రెగుట్టలు దిగే సమయంలో లొంగిపోతున్నారని మావోయిస్టులు విడుదల చేసిన లేఖల్లో పేర్కొన్నారు. కేంద్ర కమిటీ నాయకత్వంతో బాటు వివిధ రాష్ట్రాల నాయకత్వం కర్రెగుట్టలపై మకాం వేసినట్టు తెలుస్తోంది. కర్రెగుట్టలు ఎక్కువ భాగం చత్తీస్ గడ్ లో ఉన్నాయి. తెలంగాణలోని ములుగు జిల్లాలో కొంత భాగం ఉంది.  చత్తీస్ గడ్ లో వరుస ఎన్ కౌంటర్లు  జరుగుతున్నాయి. వందలాది మంది మావోయిస్టులు చనిపోయారు. ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం నగదు పారితోషికం ఇచ్చి పునరావాసం కల్పించడంతో మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. 
మావోయిస్టుల మకాంతో కర్రె గుట్టలపై టెన్షన్ వాతావరణం Publish Date: Apr 11, 2025 3:18PM

మళ్లీ రాజ్యసభకు విజయసాయిరెడ్డి.. ఏ పార్టీ నుంచంటే?

రాజకీయాలకు అలవాటు పడిన నేతలు వాటి నుంచి అంత సులభంగా బయటకు రాలేదు. విజయసాయి రెడ్డి అందుకు మినహాయింపేమీ కాదు. ఇటీవల వైసీపీ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. ఇక తాను రాజకీయాలకు పూర్తిగా దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అయితే ఆయన రాజకీయ సన్యాస ప్రకటనను అప్పట్లోనే ఎవరూ నమ్మ లేదు. రాజకీయ సన్యాసం కాదు, విరామం మాత్రమేనని అప్పట్లోనే రాజకీయవర్గాలలో పెద్ద చర్చ జరిగింది. వాస్తవానికి జగన్ నేతృత్వంలోని వైసీపీలో ఒకప్పుడు నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి.. పార్టీ ఆవిర్భావం నుంచీ జగన్ తో కలిసి నడిచారు. అంతకు ముందు కూడా జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ కు సహ నిందితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అటువంటి విజయసాయి రెడ్డికి వైసీపీ వినా మరో ఆప్షన్ ఉండదనే అంతా భావించారు. అయితే అనూహ్యంగా విజయసాయి వైసీపీని వీడటమే కాకుండా.. ఆ తరువాతి పరిణామాలలో జగన్ కు షాక్ ఇచ్చేలా కొన్ని అంశాలను రివీల్ చేశారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో కర్త, కర్మ, క్రియా అంతా జగన్ సమీప బంధువు సుబ్బారెడ్డి కుమారుడేనని చెప్పడం, అలాగే ఏపీ మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియా అంతా కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని రివీల్ చేయడం జగన్ కు మింగుడుపడని అంశాలే. విజయసాయి రెడ్డి నేరుగా జగన్ పేరు చెప్పకపోయినా ఆయన మాటల వెనుక అర్ధం ఆ రెండు వ్యవహారాలలోనూ తెరవెనుక ఉన్నది జగనేనని చెప్పకనే చెప్పారని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అంతే కాకుండా ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ స్థానాన్ని ఉప ఎన్నికలో మళ్లీ ఆయనే బీజేపీ అభ్య ర్థిగా పోటీ చేస్తారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన తీరు కూడా ఉంది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ హైదరాబాద్ వచ్చిన వేళ విజయసాయి రెక్కలు కట్టుకుని వాలిపోయి ఆయనకు స్వాగతం పలికారు.   ఇప్పుడు తాజాగా స్వల్ప విరామం తరువాత విజయసాయి మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతారనీ, ఈ సారి ఆయన తన సేవలూ, విధేయతా బీజేపీ వైపు ఉంటాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.  ఆ కథనాల ప్రకారం ఆయన రాజ్యసభకు వెడతారు. అయితే ఈ సారి బీజేపీ తరఫున ఆయన రాజ్యసభలో అడుపెడతారు. ఆ కథనాలకు బలం చేకూర్చే విధంగా విజయసాయి రెడ్డి మోడీని ప్రశంసలతో ముంచెత్తతూ శుక్రవారం ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ఉంది. ఆ పోస్టులో విజయ సాయి ముంబైపేలుళ్ల సూత్రధారి తహవ్వుర్‌ రాణా ను భారత్ కు రప్పించడం మోడీ దౌత్య విజయంగా అభివర్ణించారు.  మోడీ నేతృత్వంలో   దేశ భద్రతకు ముప్పు తలపెట్టిన ఏ ఉగ్రవాదినీ భారత్ వదిలిపెట్టబోదన్న సందేశాన్ని ప్రధాని మోడీ ప్రపంచానికి చాటారని విజయసాయి ఆ పోస్టులో పేర్కొన్నారు.  దీంతో విజయసాయి బీజేపీ గూటికి చేరి, రాజ్యసభలో అడుగుపెట్టడానికి ఇంకెంతో సమయం పట్టదని పరిశీలకులు భావిస్తున్నారు. 
మళ్లీ రాజ్యసభకు విజయసాయిరెడ్డి.. ఏ పార్టీ నుంచంటే? Publish Date: Apr 11, 2025 2:30PM

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో    సిఐడి విచారణకు హాజరైన జోగి రమేష్ 

వైకాపా హాయంలో అప్పటి ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో  మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సిఐడి అధికారులు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారి చేశారు. ఈ  నోటీసులు అందుకున్న జోగి రమేష్ శుక్రవారం సిఐడి  విచారణకు హజరయ్యారు. విజయవాడ తాడి గడపలోని సిఐడి కార్యాలయానికి ఆయన వచ్చారు.  2021లో చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ తన అనుచరగణంతో దాడి చేశారు. తాడేపల్లి పిఎస్ లో కేసు నమోదు అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక  సిఐడికి బదిలీ అయ్యింది. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన జోగి రమేష్ మూడోసారి అంటే శుక్రవారం  సిఐడి విచారణకు హాజరయ్యారు. కేసు నమోదైన తర్వాత జోగి రమేష్ రాజకీయాలకు కూడా దూరమయ్యారు. ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నారు. 
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో    సిఐడి విచారణకు హాజరైన జోగి రమేష్  Publish Date: Apr 11, 2025 2:07PM

 ఎన్ ఐ ఎన్ కస్టడీలో ముంబై పేలుళ్ల సూత్రధారి హుస్సేన్ రాణా 

  2008 ముంబై పేలుళ్లకు సూత్రధారి అయిన హుస్సేన్  రాణా ను ప్రస్తుతం  ఎన్ఐఎన్ అధికారులు విచారణ చేస్తున్నారు.   అమెరికా నుండి భారత్ వచ్చిన రాణాను  ఎన్ ఐ ఎన్  అధికారులు  నిన్న అర్దరాత్రి కోర్టులో ప్రవేశ పెట్టారు. 20 రోజుల కస్టడీ కోరుతూ ఎన్ ఐఎన్ కోర్టును  కోరినప్పటికీ    18 రోజుల కస్టడీకి అనుమతించింది.  మొదటి రోజు శుక్రవారం విచారణ ప్రారంభమైంది.  ఈ విచారణ పది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. హుస్సేన్ రాణా కోసం   ప్రత్యేక ఇంటరాగేషన్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ సెల్ లో నే రాణాను విచారణ చేస్తున్నారు.   ఇప్పటికే 400 పేజీల చార్జ్ షీట్ ను అధికారులు సిద్దం చేశారు. హుస్సేన్ రాణాతో కలిసి ముంబై లో సీన్ రీ కన్ స్ట్ర  క్షన్  చేసే అవకాశం ఉంది.  పాకిస్తాన్ కు చెందిన హుస్సేన్ రాణా  2008  ముంబై మారణ హోమం   తర్వాత అమెరికా పారి పోయాడు. అమెరికా ఉగ్రవాది డేవిడ్ తో చేతులు కలిపి  ముంబై పేలుళ్లకు పాల్పడ్డారని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు.  వీరిరువురు ముంబైలో రెక్కీ నిర్వహించారని నాటి దర్యాప్తులో తేలింది. ముంబై పేలుళ్లలో 24 మంది విదేశీయులు చనిపోయారు. వీరంతా తాజ్ హోటల్ లో బస చేసినప్పుడు ఈ పేలుళ్లు , దాడులు జరిగాయి
 ఎన్ ఐ ఎన్ కస్టడీలో ముంబై పేలుళ్ల సూత్రధారి హుస్సేన్ రాణా  Publish Date: Apr 11, 2025 1:08PM

బీహార్ బాబు నితీష్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఈ సంవత్సరం  అక్టోబర్-నవంబర్‌ నెలల్లో ఎన్నికలు జరిగవలసి వుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. మరోవంక రాజకీయ పార్టీలూ ఎన్నికల పోరుకు సిద్దమవుతున్నాయి.  ఇటు అధికార ఎన్డీఎ కూటమి, అటు విపక్ష ఇండియా కూటమి ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. ప్రధానంగా పొత్తులు, ఎత్తుల  గురించిన చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి పొత్తుల పరంగా చూస్తే, అటు ఎన్డీఏలో ఇటు ఇండియా కూటమిలోనూ ఇప్పటివరకు అయితే 2020 పొత్తులలో మార్పు లేదు.    అలాగే, ఇరు కూటముల నాయకులు, ముఖ్యంగా, మధ్యలో ఇటు నుంచి అటు నుంచి ఇటు దూకిన, జేడీయు అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ఆ ‘తప్పు’ చేయనని స్పష్టం చేశారు. గత నెల (మార్చి) చివర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన సమయంలో నితీష్ కుమార్  షా సమక్షంలో  గతంలో రెండు సార్లు చేసిన తప్పు మరో సారి చేయనని, ఎన్డీఏను  వీడనని, స్పష్టం చేశారు.  అలాగే  ఎన్డీఎ కూటమిమలోని ఇతర పార్టీల నేతలు  ఎల్జీపీ ( పాశ్వాన్) అధ్యక్షుడు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ అవామ్ మోర్చా (లౌకిక) అధ్యక్షడు జితన్ రామ్ మాంఝీ కూడా ఎన్డీఎతో కొనసాగుతామని ప్రకటించారు. అంతే కాకుండా ఇటీవల బీజీపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్  ఎన్డీఏ నేతలతో ఢిల్లీలో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్  మీడియాతో మాట్లాడుతూ బీహార్ అసెంబ్లీ  ఎన్నికల్లో ఎన్డీఏ విజయం  పట్ల  విశ్వాసం ప్రకటించారు. అంతకుముందు పశ్చిమ చంపారన్ జిల్లాలో జరిగిన ఎన్డీఏ కార్యకర్తల సంయుక్త సమావేశంలో మొత్తం 243 సీట్లలో 225 ఎన్డీఏ గెలుచుకుంటుందని నాయకులు ప్రకటించారు.ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల  రాష్ట్ర అధ్యక్షులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.  మరో వంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఈ నెల 24 న  మూడు నెలల్లో రెండవ సారి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు, మధుబనిలో జరిగే పంచాయతీ రాజ్ కార్యక్రమంలో పాల్గొని దేశంలోని పంచాయతీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే  పాట్నా విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన టెర్మినల్‌ను ప్రారంభిస్తారు. అంతకు ముందు  ఫిబ్రవరి 24న, ప్రధాని మోదీ భాగల్పూర్‌ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం  19వ విడత నిధులను విడుదల చేశారు. ఆ సందర్భంగా రైతులతో సంభాషించడంతో పాటు విమానాశ్రయ మైదానంలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. మరో వంక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఒంటరిగా పోటీ చేసే ఆలోచన లేదని  ఇండియా కూటమి  భాగస్వామ్య పార్టీలన్నీ ఒకటిగానే పోటీ చేస్తాయని కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన నేపధ్యంలో  బీహార్ లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రచారం జరుగతున్న నేపధ్యంలో కాంగ్రెస్  నేతలు అలాంటి ఆలోచన లేదని స్పష్టత ఇచ్చారు. అయితే  ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సమిష్టి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. కానీ  ఆర్జేడీ మాత్రం  మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్  కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది.  మరో వంక  రాజకీయ నాయకుని అవతారం ఎత్తిన ఎన్నికల వ్యూహ కర్త  ప్రశాంత్ కిశోర్ ఇండియా కూటమితో జట్టు కట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోది. ఆయన స్థాపించిన  జన సూరజ్ పార్టీ ఇండియా కూటమిలో చేరుతుందని ఎఐసీసీ కార్యదర్శి, బీహార్ రాష్ట్ర ఇంచార్జ్  దేవేంద్ర యాదవ్  అంటున్నారు.  ఈ పరిణామాలను గమనిస్తే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్దానికి రంగం సిద్ధమైంది చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ- జేడీయు సారధ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్-ఆర్జేడీ సారధ్యంలోని ఇండియా కూటమి సేనలు అస్త్ర శస్త్రాలతో యుద్ధానికి సిద్దమవుతున్నారు. అయితే  ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న కంటే.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయ భవితవ్యం ఏమిటి? అనే ప్రశ్నేకీలకంగా మారింది.  ఓ వంక ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం గురించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.  మరో వంక నితీష్ కుమార్ మరో మారు ముఖ్యమంత్రి అవుతారా? అనే ప్రశ్న  రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అవును  అయారామ్, గయారామ్ రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచిన బీహార్ రాజకీయాల్లోనూ నితీష కుమార్  తన  విలక్షణత నిలబెట్టుకున్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన ముఖ్యమంత్రి గానే, కాదు, ఎక్కువ సార్లు  (9సార్లు)  ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగానూ చరిత్ర సృష్టించారు. నితీష్ కుమార్ 2005 నుంచి 2014 వరకు, తిరిగి   కొద్ది కాలం, ఆ తర్వాత  2015 నుంచి నేటి వరకు, మొత్తం మీద రెండు దశాబ్దాలకు కొంచెం అటూఇటుగా ముఖ్యమంత్రి కుర్చీకి అతుక్కు పోయారు. ‘ఫెవికాల్’ సిఎం’ అనిపించుకున్నారు.  అయితే  ఈ ఫెవికాల్ బంధం కొనసాగుతుందా? బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్  పదవ సారి  ప్రమాణ స్వీకారం చేస్తారా?  అనేది  ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.  నిజానికి  2020 ఎన్నికల్లో ఎన్డీఎ 37.23 శాతం ఓట్లతో 125 స్థానాలు గెలుచుకుంది. అందులో నితీష్ కుమార్ పార్టీ జేడీయుకు వచ్చింది కేవలం 43 సీట్లు మాత్రమే.  బీజేపీ 74 స్థానాలు గెలుచుకుంది. అయితే ఎన్డీఎ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందుగానే నితీష్ కుమార్ పేరును ప్రకటించినందున  నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎక్కువ సీట్లు వచ్చినా బీజేపీ  ఇచ్చిన  మాటకు  కట్టుబడి ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంది.  అయితే ఈసారి ముందుగానే ఎన్డీఎ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించేందుకు బీజేపీ అంత సుముఖంగా ఉన్నట్లు లేదు. అంటే ఎన్డీఎకి  మెజారిటీ వస్తే మహారాష్ట్ర తరహాలో  ఎక్కువ సీట్లు ఎవరికీ వస్తే వారికే ముఖ్యమంత్రి పదవి అనే ఫార్ములాను  బీహార్ లోనూ  అమలుచేసే ఆలోచనలో బీజేపీ ఉందని అనుకోవచ్చని అంటున్నారు. అయితే  ఇందుకు సంబంధించి బీజేపీ నాయకులను ప్రశ్నిస్తే.. కర్ర విరగదు, పాము చావదు, అన్నట్లు  "మేము ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తాము" అని సమాధానం ఇస్తున్నారు. మరో వంక ఇదే ప్రశ్నను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అడిగినప్పుడు, ‘ఇక్కడ’ చెప్పే విషయం కాదు అంటూ మీడియా ప్రశ్నను దాటవేశారు. సో.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి గత ఎన్నికల్లోలాగా ఎక్కువ సీట్లు కమల దళానికి దక్కితే.. ముఖ్యమంత్రి కుర్చీని వదులు కునేందుకు బీజేపీ సుముఖంగా లేదనేది స్పష్టంగానేతెలుస్తోందని అంటున్నారు.  మరోవంక గతంలోనే  బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ, ముఖ్యమంత్రి  నితీష్ కుమార్ ఉప రాష్ట్రపతి కావాలనేది తన కోరిక అంటే, తాజాగా  నిన్న మొన్న మరో బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే.  నితీష్ కుమార్ ను  ఉప ప్రధానిగా చూడాలనేది తన కోరిక అని పార్టీ మనసులో మాటను బయట పెట్టారు. అంటే  నితీష్ కుమార్’కు, బీజేపీ ఢిల్లీ ఫ్లైట్  టికెట్ బుక్  చేసినట్లే అనుకోవచ్చని అంటున్నారు.   అంటే  ఎన్డీఎ గెలిచినా, ఓడినా  నితీష్ కుమార్  కు మరో మారు  బీహార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇంచు మించుగా లేనట్లే అంటున్నారు. అలాగే, నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పీఠంతో ఉన్న ఫెవికాల్ బంధం...ఉంటుందా, ఊడుతుందా ? అంటే, అనుమానమే అన్న సమాధానమే వస్తోంది. అయితే.. హంగ్ వస్తే? మళ్ళీ నితీష్ కుమారే సిఎం అయినా కావచ్చు. ప్రస్తుతం అదే ఆసక్తికర ముక్తాయింపుగా పరిశీలకులు పేర్కొంటున్నారు.
బీహార్ బాబు నితీష్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా? Publish Date: Apr 11, 2025 12:38PM

హోం వర్క్ చేయలేదని విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్ 

మాతృదేవో భవ , పితృదేవో భవ తర్వాతి స్థానం ఆచార్య దేవో భవ అని అంటాం. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ఉపాధ్యాయురాలు విచక్షణ కోల్పోయింది.    సభ్య సమాజం  తలదించుకునేలా వ్యవహరించింది. హోం వర్క్ చేయలేదని ముగ్గురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయురాలు   గురువారం(ఏప్రిల్ 10) చెప్పుతో కొట్టింది. స్థానిక జీనియస్ పాఠశాలలో జరిగిందీ ఘటన. ప్రాథమిక పాఠశాలలో  రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హోం వర్క్ చేయకపోవడంతో  ఉపాధ్యాయురాలు ఆగ్రహంతో ఊగిపోయింది ఉపాధ్యాయురాలు అనిత వారిని చెప్పుతో కొట్టి వార్తల్లోకి ఎక్కింది. విషయం తెలిసిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేశారు.   ఉపాధ్యాయురాలు అనితను నిలదీస్తూ  దాడి చేశారు. పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీంతో పాఠశాల వద్ద టెన్షన్  నెలకొంది.
హోం వర్క్ చేయలేదని విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్  Publish Date: Apr 11, 2025 12:19PM

రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి.  మూల్యాంకనం, రీ వెరిఫికేషన్‌, కంప్యూటరీకరణ   ప్రక్రియలు పూర్తి కావడంతో ఫలితాలను శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.   ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ పరీక్షా ఫలితాలను ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌  https://bie.ap.gov.in/ లో  చూసుకోవచ్చు. అలాగే  గతంలో హాల్ టికెట్లను ఎలా అయితే మొబైల్ నంబర్లకు పంపించారో అలాగే ఈ సారి ఇంటర్ విద్యార్థులకు  పరీక్షా ఫలితాలను కూడా పంపిస్తారు. ఇందు కోసం ఏపీ విద్యార్థులు 9552300009 నంబర్ కు వాట్సాప్ మెసేజ్ పంపితే చాలు. వారి పరీక్షా ఫలితాలు వారి మొబైల్ కు వచ్చేస్తాయి.   
 రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు Publish Date: Apr 11, 2025 12:01PM

గోరంట్ల మాధవ్ పై మరో కేసు

హిందూపురం మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ పై మరో కేసు నమోదైంది.  మంత్రి నారా లోకేష్ పై గురువారం (ఏప్రిల్ 10) గోరంట్ల మాధవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేశారు. జగన్ రాప్తాడు పర్యటనలో పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారంటూ విమర్శలు చేసిన గోరంట్ల మాధవ్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందే తెలుగుదేశం కార్యకర్త చేబ్రోలు కిరణ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ ను గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో అడ్డుకుని కిరణ్ పై దాడికి ప్రయత్నించిన గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో మరో కేసు నమోదైంది.
గోరంట్ల మాధవ్ పై మరో కేసు Publish Date: Apr 11, 2025 11:53AM

బోరు వేసినా  నీళ్లు రాకపోవడంతో తెలంగాణలో రైతు ఆత్మహత్య

ఆరుగాలం కష్ట పడిన రైతు గిట్టుబాటు లేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో  మరో  రైతు  గురువారం(10 ఏప్రిల్) పొద్దుపోయాక ఆత్మహత్య  చేసుకున్నాడు.  తన వ్యవసాయ భూమిలో నీళ్లు పడకపోతే మరో చోట బోర్ వేసినప్పటికీ నీళ్లు పడటం లేదు.   గత దశాబ్ద కాలం నుంచి  లక్షలాది రూపాయలు ఖర్చు చేసి 30 బోర్లు వేయించినా  ఎలాంటి ప్రయోజనం  లేకుండా పోయింది. దీంతో అప్పుల ఊబిలో చిక్కుక్కున్న 56 ఏళ్ల మల్నన్న సుసైడ్ చేసుకున్నాడు.  ఈ విషాద ఘటన  జిల్లాలోని లోకేశ్వరం మండలం, రాజురా గ్రామంలో జరిగింది. చనిపోయిన  మల్లన్నకు  తనకు వారసత్వంగా వచ్చిన ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన తన పొలంలో వరి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసేవాడు. పంటలు తరచూ ఎండిపోవడంతో  నీటి కోసం పలుమార్లు బోర్లు వేయిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చుచేశాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆత్మ హత్య చేసుకున్నాడు. 
బోరు వేసినా  నీళ్లు రాకపోవడంతో తెలంగాణలో రైతు ఆత్మహత్య Publish Date: Apr 11, 2025 11:45AM

అత్యుత్సాహంతో అడ్డంగా బుక్కైన తోపుదుర్తి!

రామగిరిలో వైసీపీ రచ్చ వెనుక కుట్ర కోణం?! మాజీ సీఎం జగన్‌ భద్రత కల్పించడంతో కూటమి సర్కారు విఫలమైందని చిత్రీకరించడానికి ఆ పార్టీ నేతలు గీసిన స్కెచ్ విఫలమైంది. ఈ నెల 8న జగన్‌ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్‌ వద్ద ఆ పార్టీ శ్రేణులు చేసిన అరాచకం వెనుక కుట్రకోణం దాగున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే హెలిప్యాడ్‌ వద్ద వేలమందితో వీరంగం సృష్టించి.. దాన్ని మాజీ సీఎం జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు. బారికేడ్లను తోసుకెళ్లడం, పోలీసులపై దాడి చేయడం, హెలికాప్టర్‌ వద్దకు నినాదాలు చేసుకుంటూ వెళ్లడం ముందస్తు ప్రణాళికలో భాగమేనని చెబుతున్నారు. వీటన్నింటినీ నిగ్గు తేల్చే క్రమంలో ఆరోజు హెలిప్యాడ్‌ వద్ద పోలీసుల మీద దాడి ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రకాశ్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టి, పోలీసులపై దాడికి ఉసిగొల్పినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌ రామగిరి రావడం పార్టీ కార్యక్రమం కావడంతో ఏర్పాట్లన్నీ స్థానిక వైసీపీ నాయకులే చూసుకున్నారు. పోలీసులు భద్రత మాత్రమే కల్పించారు. 7న కుంటిమద్ది వద్ద హెలిప్యాడ్‌ను పరిశీలించిన పోలీసులు.. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు అత్యంత బలహీనంగా ఉన్నాయని, వాటిని మార్చి రెండంచెలుగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. వైసీపీ నాయకులు వాటిని  పట్టించుకోలేదు. జగన్‌ హెలికాప్టర్‌ దిగిన వెంటనే వైసీపీ శ్రేణులు దూసుకురావడంతో బారికేడ్లు కిందపడిపోయాయి. దీనికితోడు పాపిరెడ్డిపల్లికి జగన్‌ కాన్వాయ్‌లోని 11 వాహనాలతోపాటు ముఖ్య నాయకుల వాహనాలను మాత్రమే అనుమతిస్తామనీ, ఎలాంటి జనసమీకరణ చేయవద్దని జిల్లా ఎస్పీ రత్న ముందు రోజు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు. వైసీపీ నాయకులు అవేమీ పట్టించుకోలేదు. పైగా అన్ని నియోజకవర్గాల నుంచి డబ్బులిచ్చి మరీ జనాలను తీసుకొచ్చారంట.  రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తమ అధినేత జగన్‌ మెప్పు కోసం పెద్దఎత్తున జనసమీకరణ చేశారు. ఎలాగైనా హెలిప్యాడ్‌ వద్దకు చేరుకోవాలంటూ ఆ రోజు ఉదయం నుంచే వాట్సప్‌ గ్రూపుల్లో సందేశాలు పంపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దానికి తగ్గట్లే జగన్‌ రావడానికి కొద్ది నిమిషాల ముందే వేలమందిని హెలిప్యాడ్‌ వద్దకు తీసుకొచ్చారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైకి పార్టీ శ్రేణులను ఉసిగొల్పారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు పోలీసులపై దాడి చేశారు. దీంతో తీవ్ర అస్వస్థత పాలై చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు. మొత్తానికి జగన్‌ దృష్టిలో పడాలన్న తోపుదుర్తి అత్యుత్సాహం ఆయన్ని అలా బుక్ చేసిందిప్పుడు.  
అత్యుత్సాహంతో  అడ్డంగా బుక్కైన తోపుదుర్తి! Publish Date: Apr 11, 2025 11:24AM

పేరుకే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం.. కొత్త విమాన సర్వీసులు లేవు.. ఉన్న వాటికి మంగళం!?

ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నంలో విమానయానానికి పూర్వ వైభవం వస్తుందని అనుకుంటున్న తరుణంలో విశాఖ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సింది పోయి.. ఉన్న సర్వీసులే రద్దౌతున్నాయి. పేరుగొప్ప ఊరు దిబ్బ లా విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం పరిస్థితి మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు రెండు సర్వీసులు ఇప్పటికే నిలిచిపోగా.. వచ్చే నెల నుంచి అంటే మే నుంచి  బ్యాంకాక్‌ , కౌలాలంపూర్‌ సర్వీసులూ రద్దు కానున్నాయి. ఇప్పటికే వాటి బుక్కింగులను నిలిచిపోయాయి. గతంలో అంటే  కొవిడ్‌ సమయంలో నిలిచిపోయిన దుబాయి విమాన సర్వీసు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఉన్నవి కూడా రద్దు అవ్వడంపై   పారిశ్రామికవేత్తలు, నాయకులు, వి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా ఉత్తరప్రదేశ్ కు చెందిన రామ్మోహన్‌నాయుడు దీనిపై దృష్టి పెట్టి రద్దైన సర్వీసులను పునరుద్ధరించడం, కొత్త సర్వీసుల ప్రారంభంపై దృష్టి సారించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. విశాఖ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌లకు నేరుగా విమాన సర్వీసులు గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి. వారంలో మూడేసి రోజులు ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కంబోడియా, చైనా, హాంకాంగ్, ఇండోనేసియా, జపాన్, లావోస్, మకావ్, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లేవారికి వీటి వల్ల ప్రయోజనం  కలుగుతుంది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న కారణంగా జనవరిలో కౌలాలంపూర్‌ సర్వీసును నిలిపివేయాలని ఆ సంస్థ భావించగా..  కేంద్ర మంత్రి చొరవతో సేవలు కొనసాగించారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 74.4 శాతం పెరిగింది. 8,415 మంది మలేసియా, కౌలాలంపూర్, సింగపూర్‌కు రాకపోకలు సాగించారు. తాజాగా మే మొదటి వారం నుంచి ఈ సర్వీసులకు టికెట్ల బుకింగ్‌ నిలిపివేశారు. ఇక్కడి నుంచి ఉమ్మడి విశాఖతోపాటు తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోతే వారంతా హైదరాబాద్, చెన్నై వెళ్లి.. అక్కడి నుంచి బ్యాంకాక్, మలేసియాలకు ప్రయాణించాలి. విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు పెరిగిన నేపథ్యంలో గతేడాది అక్టోబరులో రెండు కొత్త సర్వీసులు ప్రారంభించారు. దీంతో ప్రతిరోజు నేరుగా విజయవాడ వెళ్లేందుకు ఉదయం రెండు, సాయంత్రం ఒక సర్వీసు అందుబాటులో ఉండేవి. తాజాగా ఉదయం సర్వీసులు రద్దయ్యాయి. మిగిలిన రోజుల్లో విజయవాడకు రాకపోకలు సాగించేందుకు వందే భారత్‌ రైలు అందుబాటులో ఉంది. మంగళవారాల్లో వందేభారత్‌ కూడా లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణీకులు గగ్గోలు పెడుతున్నారు. 
పేరుకే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం.. కొత్త విమాన సర్వీసులు లేవు.. ఉన్న వాటికి మంగళం!?  Publish Date: Apr 11, 2025 11:14AM

రోగనిరోధక శక్తిని పెంచే టాప్ 7 టిప్స్ ఇవే..!

బలమైన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధులు,  దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి రక్షిస్తుంది.  రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది. కానీ నేటి కాలంలో జీవనశైలి, అంటువ్యాధుల ప్రమాదం పెరగడం,  తీసుకునే ఆహారంలో నాణ్యత లోపించడం వంటి కారణాల వల్ల చాలామందికి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా కోవిడ్-19 తరువాత చాలా మంది రోగనిరోధక శక్తి బలహీనంగా మారింది. అయితే ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని,  ఆరోగ్యం దృఢం చేసుకోవాలని ట్రై చేసేవారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికోసం ఇమ్యూనిటీని పెంచే టాప్ 7   టిప్స్ ఇక్కడ ఉన్నాయి. తెలుసుకోండి మరి.. పోషకాలు అధికంగా ఉండే ఆహారం.. సమతుల్య ఆహారం రోగనిరోధక ఆరోగ్యానికి తోడ్పడే అవసరమైన విటమిన్లు,  ఖనిజాలను అందిస్తుంది. విటమిన్ సి: సిట్రస్ పండ్లు, బెల్ పెప్పర్స్,  స్ట్రాబెర్రీలలో లభిస్తుంది, ఇది రోగనిరోధక కణాల పనితీరును పెంచుతుంది మరియు వాపును తగ్గిస్తుంది. విటమిన్ డి: విటమిన్ డి లోపం వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం పెరుగుతుంది . సూర్యరశ్మికి గురికావడం మరియు కొవ్వు చేపలు మరియు బలవర్థకమైన పాల ఉత్పత్తులు వంటి ఆహారాలు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. జింక్: గింజలు, చిక్కుళ్ళలో లభించే ఈ ఖనిజం రోగనిరోధక కణాల కార్యకలాపాలకు మరియు గాయం నయం కావడానికి మద్దతు ఇస్తుంది. ప్రోబయోటిక్స్: పెరుగు,  కిమ్చి, ఇడ్లీ,  దోస  వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి, ఇది రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యమైనది.  నాణ్యమైన నిద్ర.. రోగనిరోధక నియంత్రణకు నిద్ర చాలా కీలకం. దీర్ఘకాలిక నిద్ర లేమి వాపును పెంచుతుంది,  రక్షిత సైటోకిన్‌ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. రోగనిరోధక ప్రతిస్పందన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రాత్రికి 7–9 గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.  శారీరక శ్రమ.. మితమైన వ్యాయామం రోగనిరోధక కణాల ప్రసరణను పెంచుతుంది. శరీరం వ్యాధికారకాలను మరింత సమర్థవంతంగా గుర్తించి పోరాడటానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు,  దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అధిక వ్యాయామం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. వారానికి 150 నిమిషాల వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి.. దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. రోగనిరోధక పనితీరును అణిచివేస్తుంది,  వాపుకు దారితీస్తుంది. ఒత్తిడిని నిర్వహించడానికి మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు, ప్రకృతిలో సమయం గడపడం,  అభిరుచులు,  సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ఉత్తమమైనవి. ఒత్తిడిని తగ్గించడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది,  రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. హైడ్రేటెడ్.. శరీరం నుండి పోషకాలను రవాణా చేయడానికి,  విషాన్ని తొలగించడానికి నీరు చాలా అవసరం.  శరీరం అంతటా రోగనిరోధక కణాలను తీసుకువెళ్ళే శోషరస ఉత్పత్తిని ప్రభావితం చేయడం ద్వారా డీహేడ్రేషన్ రోగనిరోధక పనితీరును దెబ్బతీస్తుంది .  వాతావరణాన్ని బట్టి ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. హెర్బల్ టీలు,  పుచ్చకాయ వంటి నీటితో కూడిన పండ్లు కూడా హైడ్రేషన్‌ను నిర్వహించడానికి సహాయపడతాయి.  పరిశుభ్రత,  టీకాలు వేయడం.. ఇన్ఫెక్షన్లను నివారించడానికి సరైన పరిశుభ్రత పాటించడం,  టీకాలు వేయించుకోవడం ముఖ్యం. చేతులు కడుక్కోవడం: సబ్బుతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వల్ల వైరస్‌లు,  బ్యాక్టీరియా వ్యాప్తి తగ్గుతుంది. టీకాలు: టీకాలు శరీరానికి నిర్దిష్ట వ్యాధికారకాలను గుర్తించి పోరాడటానికి శిక్షణ ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, వ్యాధి తీవ్రతను గణనీయంగా తగ్గిస్తాయి. ధూమపానం,  మద్యం .. ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీసి రోగనిరోధక కణాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర  సామర్థ్యం తగ్గుతుంది.   ధూమపానం,  మద్యం సేవించడం మానేయడం వల్ల రోగనిరోధక పనితీరు మొత్తం ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
రోగనిరోధక శక్తిని పెంచే టాప్ 7 టిప్స్ ఇవే..! Publish Date: Apr 11, 2025 10:58AM

భారతదేశంలో వ్యర్థాలు లేని గ్రామాల గురించి తెలిస్తే శభాష్ అంటారు..!

వ్యర్థాలు అంటే నిరుపయోగకరమైన వస్తువులు లేదా పదార్థాలు.  ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి ఇలాంటి వ్యర్థాలు ఎన్నెన్నో బయటకు వెళుతూ ఉంటాయి. ఇది చాలా సహజ విషయం అని అందరూ అంటారు. కానీ ఈ వ్యర్థాలే పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 62మిలియన్ టన్నులకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయట. దేశం అంతా ఇంత వ్యర్థాల మధ్య కుళ్లిపోతున్నా కొన్ని ప్రాంతాలలో మాత్రం నిశ్శబ్ద యుద్దం జరుగుతోంది. ఇవి కూడా ఏ పట్టణ ప్రాంతాలలోనో ఏ పర్యావరణ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నవో అనుకుంటే పొరపాటు పడినట్టే..  భారతదేశంలో ఆరు గ్రామాలు వ్యర్థాలు లేని గ్రామాలుగా మారి దేశం దృష్టిని తమ వైపు ఆకర్షిస్తున్నాయి. అసలు ఈ గ్రామాలు అలా ఎలా మారాయి అనే విషయం తెలుసుకుంటే.. భారతదేశంలో మారుమూల ప్రాంతాలలో ఉండే కొన్ని గ్రామాలు వ్యర్థాలే లేని  గ్రామాలుగా రూపుదిద్దుకున్నాయి.  భారతదేశం మొత్తం మీద ఎంతో గర్వంగా గుర్తింపు పొందాయి. ఈ గ్రామాలలో పిల్లలు శుభ్రపరిచే కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారు. పెద్దలు సరళంగా జీవించడం గురించి జ్ఞానాన్ని పంచుకుంటారు. ఇక్కడ  "వ్యర్థం" అనే ఆలోచన నెమ్మదిగా కనుమరుగవుతోంది.  ఎందుకంటే ఇక్కడ ఏదీ వృధా కాదు. ఇవి కేవలం విధానాలే కాదు, ప్రజల కథలు కూడా. ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించే అట్టడుగు స్థాయి చర్య. ఇది శుభ్రమైన వీధుల గురించి మాత్రమే కాదు - ఇది పరిశుభ్రమైన భవిష్యత్తు గురించి కూడా చెప్తుంది. ఈ గ్రామాల గురించి తెలుసుకుంటే.. ఆంధి, జైపూర్, రాజస్థాన్.. జైపూర్ నుండి కొద్ది దూరంలో ఉన్న ప్రశాంతమైన ఆంధి గ్రామం అసాధారణమైన పని చేస్తోంది. ఈ గ్రామంలో వ్యర్థాలను స్వచ్ఛమైన అవకాశంగా మారుస్తోంది. వినూత్నమైన గ్రీన్ టెక్నాలజీల సహాయంతో ఇప్పుడు ఆహార వ్యర్థాలు,  వ్యవసాయ వ్యర్థాల నుండి ఆసుపత్రి వ్యర్థ జలాలను కూడా శక్తి, స్వచ్ఛమైన నీరు,  కంపోస్ట్‌గా మారుస్తోంది. బయోగ్యాస్ ప్లాంట్లు, సౌరశక్తితో నడిచే వ్యవస్థలు,  సహజంగా నీటిని శుద్ధి చేసే తడి భూములను ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. సైన్స్ నేతృత్వంలో,  ప్రజలచే శక్తిని పొందుతూ, గ్రామీణ భారతదేశం వ్యర్థాలు లేని  దిశగా మారడానికి చైతన్యం ఇస్తుంది. నయా బస్తీ, డార్జిలింగ్.. ఇదివరకు డార్జిలింగ్ కొండలలోని ఒక చిన్న గ్రామం నయా బస్తీ చెత్త కుప్పల కింద ఇబ్బంది పడుతుండేది. నేడు ఈ గ్రామం రూపు రేఖలు మారిపోయాయి.  దీనిని దాదాపుగా గుర్తించలేనంత అద్బుతంగా మారిపోయింది.  ఈ మార్పుకు  ఉట్సోవ్ ప్రధాన్,  అతని బృందం కీలకంగా ఉన్నారు. వారు తమ చేతులను చుట్టి సమాజంతో కలిసి పనిచేశారు. కంపోస్టింగ్ వంటి పురాతన పద్ధతులను తీసుకువచ్చారు. వాటిని పెర్మాకల్చర్ వంటి ఆధునిక ఆలోచనలతో కలిపారు.  వ్యర్థాలను జీవితంగా మార్చారు. ఇది ఇప్పుడు శుభ్రంగా ఉండటమే కాదు..  పచ్చగా, బలంగా ఉంది.  చోటా నరేనా, రాజస్థాన్.. ఒకప్పుడు ప్లాస్టిక్ కుప్పలు, కాలిపోతున్న వ్యర్థాల మధ్య పాతుకుపోయిన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని చోటా నరేనా గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కేవలం ఎనిమిది నెలల్లోనే. ఒకప్పుడు కలుషితమైన ఈ గ్రామం రాష్ట్రంలో మొట్టమొదటి వ్యర్థ రహిత గ్రామంగా  మారింది - ఇదంతా అక్కడ నివసించే ప్రజల వల్లే సాధ్యమైంది. పటోడా, మహారాష్ట్ర.. మహారాష్ట్ర నడిబొడ్డున ఉన్న పటోడా గ్రామం సుస్థిర జీవనం అంటే ఏమిటో చూపిస్తుంది. ఇక్కడ,వ్యర్థాలను బయట పడేయడం కాదు - వాటిని పనిలో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఇల్లు తన వ్యర్థాలను క్రమబద్ధీకరిస్తుంది. వంటగది వ్యర్థాలను పొలాలకు ఎరువుగా మారుస్తుంది.  ప్లాస్టిక్,  పొడి వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ కోసం విక్రయిస్తుంది, ఇది గ్రామ ఆదాయాన్ని పెంచుతుంది. మేలతిరుప్పంతురుతి, తమిళనాడు.. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన పట్టణ పంచాయతీగా మేలతిరుప్పంతురుతి పేరు సంపాదించింది. ఈ పట్టణం వ్యర్థాలను మూలంలోనే క్రమబద్ధీకరిస్తుంది. సేకరణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తుంది. నివాసితులకు ఉచితంగా మొక్కలను అందజేస్తారు.  బయోడిగ్రేడబుల్ బ్యాగుల కోసం ప్లాస్టిక్‌ను తొలగించమని ప్రోత్సహిస్తారు. ఇది పనిచేసే సరళమైన, సమాజ-ఆధారిత వ్యవస్థ. ఇంట్లోనే పెద్ద మార్పు ఎలా ప్రారంభమవుతుందో చూపించే చిన్న పట్టణం.  అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్.. ఒకప్పుడు 15 ఎకరాల విస్తీర్ణంలో భారీ చెత్తకుప్పగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ కథను పూర్తిగా మార్చేసింది. నేడు ఇది భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటి.  ఇక్కడ ప్రతి ఇల్లు చెత్తను వేరు చేస్తుంది.  ఒక్క చెత్త కూడా చెత్తకుప్పలో పడదు.   *రూపశ్రీ  
భారతదేశంలో వ్యర్థాలు లేని గ్రామాల గురించి తెలిస్తే శభాష్ అంటారు..! Publish Date: Apr 11, 2025 10:56AM

హెలికాప్టర్ నదిలో కూలి ఆరుగురు దుర్మరణం.. మృతుల్లో ఐటీ కంపెనీ సీఈవో కుటుంబం

అమెరికాలో  హెలికాప్టర్ నదిలో కూలిన సంఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో జర్మనీకి చెందిన ఐటీ కంపెనీ హెడ్ కుటుంబం మొత్తం మరణించింది.  జర్మనీకి చెందిన టక్నాలజీసంస్థ స్పెయిన్ విభాగం హెడ్, సీఈవో అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నదిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ లో ఉన్న ఆరుగురూ అంటే.. ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురుపిల్లలు, పైలట్ మరణించారు.  ఈ ప్రమాద ఘటనపై  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
హెలికాప్టర్ నదిలో కూలి ఆరుగురు దుర్మరణం.. మృతుల్లో ఐటీ కంపెనీ సీఈవో కుటుంబం Publish Date: Apr 11, 2025 10:38AM

అలవి కాని అమ్మ సామెతలా జగన్ తీరు

అనగనగా ఒక ఊళ్లో ఒకామె ఉంది. మహా రచ్చలమారి మనిషి. ఆమెతో ఎంత మర్యాదగా ప్రవర్తించినా కూడా ఏదో ఒక రకంగా దాన్ని గొడవగా మార్చేస్తుంది. ఎలాగంటే.. ఆమెను ఎవరైనా ‘అమ్మా’ అని పిలిస్తే.. ‘ఠాట్.. నన్ను అమ్మా అంటావా.. అంత ముసలిదానిలా కనిపిస్తున్నానా.. నేనేమైనా నీ అయ్యకు పెళ్లాన్నా..’ అంటూ గొడవకు దిగుతుంది. అలాకాకుండా, ‘ఏమండోయ్..’ అని పిలిస్తే.. ‘నేనేమైనా నీకు పెళ్లాన్నా.. అంత చనువుగా పిలుస్తున్నావ్’ అంటూ దానికి కూడా గొడవకు దిగుతుంది. అలాంటి వారి గురించి ‘అలవిగాని ఆడదాన్ని అమ్మా అన్నా తప్పే.. ఏమేవ్ అన్నా తప్పే..’ అంటూ పల్లెపట్టుల్లో ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరు గమనిస్తే అంతకంటె భిన్నంగా ఏమీ లేదు. పాపిరెడ్డి పల్లె పర్యటనకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి పోలీసుల భద్రత, రక్షణ అడిగారు.. పోలీసులు ఏకంగా ఇద్దరు ఎస్పీల ఆధ్వర్యంలో 1100 మంది పోలీసులో ఆ ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఈ సామెత కథ మాదిరిగా ఆయన అనుసరించిన ధోరణిని ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి.  జగన్  భద్రతను దృష్టిలో పెట్టుకోవడం వల్లనే పోలీసులు ఆయన అడిగిన చోట కాకుండా.. పాపిరె డ్డిపల్లెకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ కుఅనుమతి ఇచ్చారు. పైగా హెలిప్యాడ్ వద్దకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ రావొద్దని నెత్తీ నోరూ బాదుకుని చెప్పారు. కానీ.. జగన్ రాకకు జనాన్ని తరలించిన స్థానిక నాయకులు మాత్రం.. పోలీసుల మాట వింటే తాము వైసీపీ నాయకులు ఎందుకవుతాం అన్నట్టుగా వ్యవహరించారు. తరలించి తీసుకువచ్చిన జనాలనందరినీ హెలిప్యాడ్ వద్దకు కూడా తోలారు. తీరా అక్కడి పరిస్థితి ఏమిటి? జనం మిక్కిలిగా వచ్చేశారు.. వారిని అదుపు చేయడానికి పోలీసులు ఏ కొంచెం కఠినంగా వ్యవహరించినా సరే.. ‘మా కార్యకర్తల్ని కొట్టేస్తున్నారు.. మా మీద పోలీసులు దాడిచేస్తున్నారు..’ అంటూ గోల చేయాలన్నది వారి కోరిక. అప్పటికీ పోలీసులు జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తే.. పోలీసులమీదనే రాళ్లురువ్వి దాడికి దిగారు. అప్పటికీ.. పోలీసులు సంయమనం కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.  తీరా జనం తాకిడి వల్ల హెలికాప్టర్ కాస్త దెబ్బతింది. తీరా ఇప్పుడు ‘పోలీసులు సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదు. జనం వస్తోంటే చూస్తూ కూర్చున్నారు..’ అని మళ్లీ పోలీసుల మీదనే నిందలేస్తున్నారు.  జగన్ వ్యవహార సరళిని గమనిస్తే.. పాపిరెడ్డి పల్లిలో పోలీసులు ఎంత పటిష్ఠ ఏర్పాట్లు చేసినా సరే.. ఏదో ఒక రకంగా వారి మీద నిందలు వేయాలని, శాంతిభద్రతలు విఫలమవుతున్నాయని ప్రభుత్వం మీద బురద చల్లాలని ముందే ఫిక్సయిపోయి అక్కడకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. బట్టలూడదీసి కొడతానని జగన్ కారుకూతలు కూసినా సరే.. పోలీసులు సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. జగన్ మాత్రం.. ముందే రెండు స్క్రిప్టులు తయారుచేసుకుని ఉన్నట్టుగా.. అంతా ప్రశాంతంగా జరిగినా సరే.. హెలిపాడ్ వద్ద జనం తాకిడి గురించి తమ పార్టీ నాయకులు చేసిన తప్పిదానికి పోలీసులను నిందిస్తున్నారు. హెలిపాడ్ వద్ద గుమికూడిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరి మీద పోలీసులు కేసు పెట్టి, అందరికీ నోటీసులు ఇస్తేగానీ ఆపార్టీ కుట్రలు బయటకురావని, వారి లేకిబుద్ధులు బయటపడవని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
అలవి కాని అమ్మ సామెతలా జగన్ తీరు Publish Date: Apr 11, 2025 10:16AM

కమలాన్ని ఖతం చేస్తా.. రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ!

కాంగ్రెస్ అధిష్ఠానం మనసు గెలిచేశారా? కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి సిద్దమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత గడ్డ గుజరాత్ నుంచి శంఖారావం పూరించింది. అహ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రెండు రోజుల విస్తృత స్థాయి సమావేశంలో న్యాయ్ ఫథ్ పేరిట ఆమోదించిన తీర్మానం  పై జరిగిన చర్చలో  మోదీని ఓడించడమే లక్ష్యం అన్నట్లుగా నేతల ప్రసంగాలు సాగాయి.  ఎఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా దేశం నలుమూలల నుంచి వచ్చిన 1200 మంది  కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు బీజేపీ విధానాలు, మోదీ ప్రభుత్వ  వైఫల్యాలను ఎండగడుతూ ప్రసంగించారు. ప్రధానంగా బీజేపీని ఓడించడం, మోదీని గద్దె దించడం లక్ష్యంగానే చిన్న,పెద్ద నేతలంతా ప్రసంగించారు. ఏఐసీసీ అధ్యక్షుడు, మల్లిఖార్జున ఖర్గే సహా ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ పునర్జీవనం పొందుతుందనే విశ్వాసం వ్యక్త పరిచారు. అలాగే  ఈసారి ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీని ఓడిస్తామని లోక్ సభ సాక్షిగా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రతిజ్ఞను నేతలు పునరుద్ఘాటించారు. ముఖ్య నేతలు, రాహుల్ గొంతుతో గొంతుతో కలిపి  గుజరాత్ నుంచి జైత్ర యాత్ర మొదలవుతుందన్న విశ్వాసం వ్యక్తపరిచారు.  నిజానికి ఖర్గే మొదలు కీలక నేతలు చేసిన ప్రసంగాలలో కొత్తదనం పెద్దగా కనిపించ లేదు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి మాత్రం  కొంత భిన్నంగా, కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగతున్న రాజకీయ పోరాటానికి సైద్ధాంతిక వారసత్వాలను జోడింఛి ఉద్రేక పూర్వక  ప్రసంగం చేశారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగతున్న రాజకీయ పోరాటాన్ని, గాంధీ వారసులకు, గాడ్సే వారసులకు జరుగతున్న పోరాటంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అయితే  రేవంత్ రెడ్డి బీజేపీ సంఘ్ పరివార్  పై చేసిన ఘాటు విమర్శలలో మరో రాజకీయ కోణం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.  బహుశా,పూర్వాశ్రయంలో ఆయనకున్న కాషాయ బంధాలకు సంబంధించి వినవస్తున్న ఆరోప ణలు,అనుమానాల నివృత్తి కోసం  రేవంత్ రెడ్డి  ఎఐసీసీ వేదిక నుంచి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని  పరిశీలకులు పేర్కొంటున్నారు. అందుకే,  బీజేపీ,ఆర్ఎస్ఎస్  ఐడియాలజీని అంతం చేయ డమే తమ లక్ష్యమని, మరో అడుగు ముందుకేసి  దేశాన్ని దుర్మార్గంగా పాలించిన ఆంగ్లేయుల కంటే గాంధీని చంపిన గాడ్సే వారసులైన బీజేపీ నాయకులతోనే ఈ దేశానికి మరింత ప్రమాదం పొంచి ఉందని  ఘాటైన విమర్శలు చేశారని అంటున్నారు. అలాగే   అహ్మదాబాద్ స్పూర్తితో  తెలంగాణలో బీజేపీని  కాలు పెట్టనీయనని, ఖతం చేస్తామని శపధం చేయడం  కూడా శీల పరీక్షలో భాగంగానే పేర్కొంటున్నారు. అలాగే  రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట ప్రకారం  తెలంగాణలో  రైతు రుణ మాఫీ చేశామనీ, రూ.2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీచేసి, లక్షలాది రైతులను రుణ విముక్తులను చేశామని చెప్పారు. అలాగే  కుల గణన ప్రస్తావన చేశారు. ఇందుకు అనుగుణంగా  రిజర్వేషన్ల పెంపును అనుమతించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం, ఢిల్లీ జంతర్ మంతర్  వద్ద ధర్నా చేశామని చెప్పారు.  నిజానికి, ఇతరుల ప్రసంగాలతో పోలిస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగం, కొంత భిన్నంగా ఉండడమే కాకుండా, లక్ష్య నిర్దేశంతో, టార్గెటెడ్ గా సాగిందని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, ఆయన లక్ష్యం కూడా కొంత నెరవేరినట్లేనని అంటున్నారు. గత కాలంగా   రేవంత్ రెడ్డి బీజేపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, మరీ ముఖ్యంగా  కారాణాలు ఏవైనా, కారణం ఎవరైనా, రాహుల్ గాంధీలోనూ అలాంటి అనుమాన బీజాలు నాటుకున్నాయని, అలాంటి అనుమానాలే ఉన్నాయనే సంకేతాలు వస్తున్న నేపధ్యంలో  రేవంత్ రెడ్డి ఏఐసీసీ వేదికను ఉపయోగించుకున్నారని అంటున్నారు. అలాగే  రాహుల్ గాంధీ సమక్షంలో  బీజేపీ, ఆర్ఎస్ఎస్  ఐడియాలజీని వ్యతిరేకించడంలో  తాను ఎవరికీ తీసిపోనని నిరూపించుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తునారు. అంతే కాకుండా ఈ ప్రయత్నంలో ఆయన కొంత వరకు సక్సెస్  అయ్యారని కూడా పరిశీలకు భావిస్తున్నారు. కాగా రాహుల్ గాంధీ తమ ప్రసంగంలో కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవను మెచ్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం  కుల గణన విజయవంతంగా చేయడంతో పాటుగా  కులగణన ఆధారంగా బీసీల  రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరుతూ, అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని రాహుల్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.అంతేకాకుండా, అంతటితో ఆగకుండా  ఢిల్లీలో పోరాటం చేస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రయత్నాలను  ప్రశంసించారు. సో,  ఆమేరకు రేవంత్ రెడ్డి ప్రసంగం ఫలితం ఇచ్చిందనే అనుకోవచ్చును, అంటున్నారు.
కమలాన్ని ఖతం చేస్తా.. రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ! Publish Date: Apr 11, 2025 10:03AM

ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు నాయుడు

ఒంటిమిట్ట  కోదండ రాముడి కల్యాణోత్సవం శుక్రవారం (ఏప్రిల్ 11) సాయంత్రం జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా పుష్పాలంకరణకు 12 టన్నుల పూలను వినియోగిస్తున్నారు. కోదండరాముని కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తుల తరలి వస్తారన్న అంచనాలతో భక్తుల రద్దీ తగ్గట్టుగా ఏర్పాటు పూర్తయ్యాయి. భక్తుల భద్రత, సౌకర్యాలకు ఎక్కడా లోటు రాకుండా అన్ని చర్యలూ తీసుకున్నారు.   సీతారాముల కల్యాణోత్సవాన్ని పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా కల్యాణ వేదిక, గ్యాలరీలను సిద్ధం చేశారు. రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్ తదితర పనులు పూర్తయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. రాములోరి కల్యాణానికి భారీ సంఖ్యలో హాజరవుతున్న భక్తులకు.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు  తిరుమల తిరుపతి దేవస్థానం 70 వేల తిరుమల లడ్డూలను సిద్ధం చేసింది.  
ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు నాయుడు Publish Date: Apr 11, 2025 9:42AM

తెలంగాణకు భూకంప హెచ్చరిక!?

తెలంగాణకు  భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత చాలా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్, అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని.. ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది.  అయితే ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరూ కూడా ధృవీకరించని పరిస్థితి. ప్రభుత్వ వర్గాలు గానీ, శాస్త్రీయ సంస్థలు కానీ ధృవీకరించడం లేదు. భూకంపాలను కచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదనీ, ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్న మాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్ రెండు, మూడులో ఉన్నాయి. ఇవి తక్కువ నుంచి మోస్తరు భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయి. గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న భూకంపాలు సంభవించాయి. అవి ఏమాత్రం నష్టం కలిగించలేదు.
తెలంగాణకు  భూకంప హెచ్చరిక!? Publish Date: Apr 11, 2025 1:33AM

ట్రంప్ వెనక్కి తగ్గింది అందుకేనా?

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గారు. చైనా మినహా అనేక దేశాలపై టారిఫ్‌ల అమలుకు 90 రోజుల విరామం ప్రకటించారు. సుంకాలపై ముందునుంచీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్లిన ట్రంప్‌.. ఇప్పుడు ఉన్నట్టుండి వాటిని ఎందుకు నిలిపివేశారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం బాండ్‌ మార్కెటే అంటున్నారు విశ్లేషకులు.  ఏప్రిల్‌ 2న భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు ట్రంప్‌ . దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీ ఒడుదొడుకులను చవిచూశాయి. అయితే, ఈ టారిఫ్‌ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొనడంతో పాటు అంతర్జాతీయ మాంద్యం రావొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని తోటి రిపబ్లికన్‌ నేతలు, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్ లు పదేపదే హెచ్చరించారు కూడా. అయినా అధ్యక్షుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.ఈ విషయంలో తన నిర్ణయం ఎప్పటికీ మారదు అని గట్టిగా చెప్పారు. ఆయనకు సర్ది చెప్పేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అయితే, చివరి నిమిషంలో అనూహ్యంగా సుంకాలపై విరామం ప్రకటించడం గమనార్హం.  ట్రంప్‌ నిర్ణయం వెనక బాండ్‌ మార్కెట్‌ ఒక్కటే కారణమని తెలుస్తోంది. ఈ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలతో యూఎస్‌ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో మొదలైన ఆందోళనల వల్లే అధ్యక్షుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ ఆందోళనలను అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌.. ట్రంప్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. అటు ట్రెజరీ మార్కెట్‌లో వేగంగా జరుగుతున్న అమ్మకాల గురించి వైట్‌హౌస్‌ ఆర్థిక సలహాదారులు కూడా అధ్యక్షుడికి వివరించారట. ఇదిలాఉండగా టారిఫ్‌లపై విరామం ప్రకటించిన అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ బాండ్‌ మార్కెట్‌ గురించి ప్రస్తావించడం గమనార్హం. బాండ్‌ మార్కెట్‌ చాలా గమ్మత్తైనది. ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉంది. దీని భవిష్యత్తు గురించి ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అర్థమైంది. కొంత మంది కోపంగానూ ఉన్నారని ట్రంప్‌ అన్నారు.  కచ్చితమైన రాబడితో పాటు దీర్ఘకాలంలో నష్ట భయం తక్కువగా ఉండే పెట్టుబడి సాధనం బాండ్లు. వీటిని జారీ చేసే సంస్థలు మదుపర్ల దగ్గరి నుంచి నిధులు సమీకరించి ఒక నిర్దిష్ట కాలంలో ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం తిరిగి పెట్టుబడిని చెల్లిస్తాయి. బాండ్లు, స్టాక్స్‌ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటంటే.. కంపెనీలో స్టాక్‌హోల్డర్లకు ఈక్విటీ వాటా ఉంటుంది. అదే బాండు హోల్డర్లకు కంపెనీలో క్రెడిటార్‌ వాటా దక్కుతుంది. చాలా దేశాల్లో ప్రభుత్వంతో పాటు పలు కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఈ బాండ్లను జారీ చేస్తుంటాయి. ప్రభుత్వం జారీ చేసే బాండ్లకు సార్వభౌమ హామీ ఉంటుంది.
ట్రంప్ వెనక్కి తగ్గింది అందుకేనా? Publish Date: Apr 11, 2025 1:25AM

పోలీసుల అదుపులో గోరంట్ల మాధవ్

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పోలీసులు గోరంట్ల మాధవ్ ను గురువారం (ఏప్రిల్ 10) సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ జరిగిందేమిటంటే.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తుండగా, మార్గ మధ్యంలో గోరంట్ల మాధవ్ పోలీసుల వాహనాన్ని అడ్డుకుని చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కిలిగించిన కారణంగా గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేశారు. 
పోలీసుల అదుపులో గోరంట్ల మాధవ్ Publish Date: Apr 10, 2025 6:16PM

పోయిన చోటే వెతుక్కుంటున్న కాంగ్రెస్

ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు పెద్దలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ పార్టీ సుదీర్గ చరిత్రలో చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి చరిత్రలో ఎరగని ఘోరాతి ఘోరమైన ఓటమి. ఒకప్పుడు, 400 సీట్లకు పైగా గెలిచిన పార్టీ  నాలుగు పదులకు పడిపోయింది. లోక్ సభలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య  44 దగ్గర ఆగిపోయింది. ఓటు షేర్ –నిన్నమొన్నల్లో కుప్పకూలిన  షేర్ మార్కెట్’ కంటే ఘోరంగా కూలిపోయింది. అంతకు ముందు 2004,2009లో వచ్చిన ఓట్ల షేర్  కూడా మిగలలేదు.  అయితే, సీట్ల సంఖ్య తగ్గడం, ఓటు షేర్ పడిపోవడం మాత్రమే కాదు.. అంతకంటే ప్రమాదకరంగా కాంగ్రెస్ నిర్మించుకున్నసామాజిక సౌధం (సోషల్ బేస్) పునాదులు  కదిలి పోయాయి. అంతవరకు కాంగ్రస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సామాజిక వర్గాల్లో ఒక్క ముస్లింలు తప్ప  మిగిలిన సామాజిక వర్గాలు పార్టీ చేయి వదిలేసాయి. అయితే సామాజిక బంధాలు తెగిపోవడం అంతకు ముందు ఎప్పుడోనే మొదలైంది. అందుకే  1998 లో తొలిసారిగా పార్టీ పగ్గాలు చేపట్టిన సమయంలోనే సోనియా గాంధీ తమ తొలి ప్రసంగంలోనే, దళితుల, బహుజనులు, ఇతర వెనక బడిన తరగతుల ప్రజలు కాంగ్రెస్ కు దూరం అవడం వల్లనే  కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాదించలేక పోతోందని విశ్లేషించారు. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు.  అయితే  ఆ తర్వాత ఇచుమించుగా రెండు దశాబ్దాలు ఆమె పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగినా  ఓ పదేళ్ళ పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో యూపీఎ సంకీర్ణ ప్రభుత్వలో ఆమె కీలక భూమిక పోషించినా  సామాజిక న్యాయ సాధనలో ఆశించిన ఫలితాలు రాలేదు. సామాజిక  వర్గాలు ఏవీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరలేదు. ఇప్పటికీ  పరిస్థితిలో మార్పు లేదు. అందుకే, ఓటమి వెంట ఓటమి కాంగ్రెస్ పార్టీని వెంటాడు తున్నాయి.ఇండియా కూటమి పుణ్యాన 2024 లోక్ సభ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు వచ్చినా.. ఆ తర్వాత జరిగిన ఐదారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఇందుకు ప్రధాన  కారణం  కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మలా, పెట్టని కోటలా నిలిచిన దళిత, బహుజన, బీసీ, ఓబీసీ, మైనారిటీలు,  కాంగ్రెస్ పార్టీకి దూరం కావడమే  కారణమని కాంగ్రెస్  పార్టీ మరో మారు గుర్తించింది.  ఈ నేపద్యంలో  అహ్మదాబాద్ (గుజరాత్) లో ఏప్రిల్ 8 - 9 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన అఖిల బారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశం మరోమారు దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు  కాంగ్రెస్ నాయకులు మరో ప్రయత్నం చేశారు, ముఖ్యంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చాలా కాలంగా చెపుతున్న కుల గణన, రిజర్వేషన్ల పెంపు అంశాలను మరింత వేగంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు  ఏఐసీసీ మరో మారు సంకల్పం చెప్పుకుంది. ముఖ్యంగా  రాహుల్ గాందీ దేశం ఎదుర్కుంటున్న సమస్యలు అన్నిటికీ బీసీ కుల గణన ఒక్కటే పరిష్కార మార్గమని చెప్పుకొచ్చారు. అలాగే  దళితులూ,ఆదివాసీల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. అంతే కాకుండా  ప్రైవేటు రంగంలోనూ బీసీ,ఎస్టీ,ఎస్సీ, మైనారిటీలకు రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేశారు. అలాగే  ఏఐసీసీ సమావేశంలో ఆమోదించిన ‘న్యాయపథ్: సంకల్పం, సమర్పణ, సంఘర్షణ’  తీర్మానంలోనూ నిజమైన జాతీయ వాదం అనేది సామాజిక న్యాయం  లోనే ఉందని, స్పష్టంగా పేర్కొన్నారు.   ఇదొకటి అయితే.. ఏఐసీసీ సమావేశంలో ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో బీజేపీని ఓడించడం పార్టీ ముందున్నప్రధాన లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. అందుకే 64 ఏళ్ల తర్వాత  తొలిసారిగా ఏఐసీసీ సమావేశం అహ్మదాబాద్ నిర్వహించారు. అంతే  కాదు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా,  గుజరాత్ కు కాంగ్రెస్ ఎందుకు అవసరం అనే మకుటంతో ప్రత్యేక తీర్మానం చేశారు. ఏఐసీసీ సమావేశాల్లో ఇలా ఒక రాష్ట్రం కోసం ప్రత్యేకించి తీర్మానం చేయడం ఇదే తొలిసారి. దీన్ని బట్టిచుస్తే గుజరాత్ లో బీజేపీని ఓడించి అధికాంలోకి వచ్చేందుకు  కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రధాన్యత ఇస్తోందో స్పష్ట మవుతోంది. గుజరాత్ లో గత 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్  వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా గెలిచితీరాలని, కాంగ్రెస్ పునర్జీవనానికి అదే తొలి మెట్టు కావాలని ఆశిస్తోందని అంటున్నారు. అందుకే  ఇప్పటికే, గుజరాత్ లో బీజేపీని ఓడిస్తున్నాం అని లోక్ సభలో ప్రకటించిన రాహుల్ గాంధీ, ఏఐసీసీ వేదిక నుంచి  ‘నూతన్ గుజరాత్ – నూతన కాంగ్రెస్’ నినాదాన్ని ఇచ్చారు. అయితే అది సాధ్యమా అంటే, కావచ్చును, కాక పోవచ్చును.కానీ,సంకల్పం మాత్రం అదే. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం...  గుజరాత్  ను గెలవాలి!
పోయిన చోటే వెతుక్కుంటున్న కాంగ్రెస్ Publish Date: Apr 10, 2025 5:21PM

రేణూదేశాయ్ పొలిటికల్ ఎంట్రీ.. కమలం పార్టీలోకేనా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రాజకీయాలలోకి ప్రవేశించనున్నారా?  ఆమె చూపు కమలం పార్టీవైపు ఉందా అంటే ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. తనకు రాజకీయాలంటే ఇష్టమన్న ఆమె, ప్రజాసేవ తన లక్ష్యమని చెప్పారు.  అంతే కాకుండా తానను తాను మోడీ భక్తురాలిగా చెప్పుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన విషయమేమిటంటే.. ఆమె మాజీ భర్త పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేలో భాగస్వామి. అలాగే పవన్ కూడా తరచూ మోడీని ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. దీంతో రేణూ దేశాయ్ బీజేపీ గూటికి చేరనున్నట్లు సంకేతాలివ్వడం రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది.  పిల్లల కోసమే తాను ఇంత కాలం  రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన రేణూదేశాయ్.. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాననీ, అందుకే తాను రాజకీయాలకు పనికిరానని అంతా అంటుంటారనీ, కానీ తాను పొలిటీషియన్ ని అవతానన్నది తన జాతకంలోనే ఉందని చెప్పడం ద్వారా పరోక్షంగా తన పొలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేసేశారు రేణూ దేశాయి
రేణూదేశాయ్ పొలిటికల్ ఎంట్రీ.. కమలం పార్టీలోకేనా? Publish Date: Apr 10, 2025 4:01PM