తండ్రి బీజేపీలోకి.. తనయుడు మాత్రం టీడీపీలోనే!!

 

టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తన తండ్రి బీజేపీలో చేరినా తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని ఆయన తనయుడు టీజీ భరత్ స్పష్టం చేశారు. 

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూల్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన భరత్.. తండ్రి వెంటే బీజేపీలో చేరుతారని అందరూ భావించారు. అయితే, తాను టీడీపీలోనే ఉంటానని, ఈ విషయాన్ని లోకేష్ కు కూడా ఫోన్ చేసి చెప్పానని భరత్ తెలిపారు.

తన తండ్రి బీజేపీలో చేరడానికి ముందు తనతో ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు. ఆయన బీజేపీలో చేరుతున్నా తానెక్కడ ఉండాలన్నది తన ఇష్టమని తండ్రి తనతో చెప్పినట్టు భరత్ పేర్కొన్నారు. ఆయన బీజేపీలో చేరిన వెంటనే తాను లోకేష్ కు ఫోన్ చేసి మాట్లాడానని, తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పానని అన్నారు. ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ తనపై నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చంద్రబాబు, లోకేష్ లను తాను కలుస్తానని భరత్ పేర్కొన్నారు.