వెంకయ్య నాయుడుకి వినతి పత్రం సమర్పించిన టీడీపీ ఎంపీలు!!


 

టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి , గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడును కలిసారు. పార్టీమారిన నలుగురు రాజ్యసభ సభ్యులపై ఫిర్యాదు చేశారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు.

ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ నిన్న టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేష్ బీజేపీలో చేరారని చెప్పారు. రాజ్యసభలో బీజేపీలో టీడీపీపీ విలీనం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. అందుచేత వారిని అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడును కోరినట్లు చెప్పారు. రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా కనకమేడల రవీంద్ర కుమార్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా తోట సీతారామలక్ష్మిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ విషయం వెంకయ్యనాయుడికి చెప్పామని అన్నారు. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెంకయ్యనాయుడు చెప్పారని ఆయన అన్నారు.