కాంగ్రెస్ దారిలోనే బీజేపీ నడుస్తోంది

రాష్ట్రవిభజనతో కాంగ్రెస్ పార్టీయే అన్యాయం చేసిందనుకుంటే ఇప్పుడు బీజేపీ కూడా అదే దారిలో నడుస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రత్యేకహోదా, విభజన సమస్యలు, బీజేపీతో స్నేహం తదితర అంశాలపై ఇవాళ సీఎం నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. విభజన హామీల పట్ల ఆయా పార్టీల అజెండా ఎలా ఉన్నా.. మనం మాత్రం ప్రజల మనోభావాలకు తగ్గట్టుగానే వెళ్దామని ఆయన శ్రేణులకు సూచించారు.

 

ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ ఎక్కడా రాజీ పడలేదన్నారు. ఆనాడు ప్రత్యేకహోదా ద్వారా మన్మోహన్ సింగ్ ఇస్తామన్న ఆ ప్రయోజనాలు మనకు దక్కాల్సిందేనన్నారు. అవి ఇచ్చాం.. ఇవి ఇచ్చాం అంటూ ఏపీ బీజేపీ నేతలు ప్రకటనలు చే్తున్నారు. ఆ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కావాల్సినవి అడగకుండా టీడీపీని ప్రశ్నించడం ఏంటని తప్పుబట్టారు. ప్రత్యేకహోదాను ఓ సెంటిమెంట్‌గా మార్చి ప్రతిపక్షనేత జనాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.