ఏదో ఒకటి తేల్చండి.. ఆర్టీసీ భవిష్యత్తుపై కేబినెట్ సమావేశం

 

టీఎస్ఆర్టీసీ భవితవ్యం నేడు తేలిపోనుంది.కార్మికుల డిమాండ్లతో పాటు రూట్ల ప్రైవేటీకరణపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నది. నిజాం హయాంలో నిజాం పూచికత్తుతో పురుడు పోసుకొని కాలక్రమంలో తెలంగాణ ఆర్టీసీగా మారిన ఈ సంస్థ మనుగడ పై కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. ఐదువేల ప్రైవేటు బస్సులను ఆర్టీసీ రూట్లలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర రవాణా చట్టం కూడా దీనికి పూర్తి వెలుసుబాటు ఇవ్వడం.. హై కోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ పై అభ్యంతరాలు లేవనెత్తటంతో నేడు జరిగే మంత్రి వర్గ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నెల 25వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోమంటూ సీఎం కార్యాలయం ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రధాన ఎజెండాగా గురువారం నుంచి రెండు రోజుల పాటు మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగుల వయో పరిమితి పెంపుతో పాటు వేతన సవరణపై కూడా చర్చ ఉండే అవకాశాలున్నాయి. 10 నుండి 12 రోజుల్లో పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఈ నెల 10వ తేదీన సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ గడువు ఈ నెల 22వ తేదీన ముగిసింది. వాస్తవానికి అదే రోజు నివేదిక తెప్పించుకొని ఒక కమిటీ వేసి నివేదికపై అధ్యయనం చేస్తారని ప్రచారం జరిగింది. తరువాత వారం రోజుల కు ఉద్యోగ సంఘాల జేఏసీతో సిఎం సమావేశమవుతారని అనుకున్నారు. నివేదిక గడువు ముగిసినా అలజడి లేకపోవటంతో నివేదిక తుదిరూపునకు మరి కొన్ని రోజులు పడుతోందని సంకేతాలు వెలువడ్డాయి.

వచ్చే ఏడాది బడ్జెట్ లోనే ఫిట్ మెంట్ పై కీలక నిర్ణయం తీసుకుంటారని ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాలు ఆదుకుంటారని తెలుస్తుంది. దీని పై ఉద్యోగ సంఘాల కు కీలక సంకేతాలందాయి.వేతన సవరణపై ఆశలు ఏవీ లేవని ఏప్రిల్ దాకా ఆగాల్సి ఉంటుంద ని కీలక నేత ఒకరు తమ సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. దాంతో వేతన సవరణ పై తమకెలాంటి ఆశల్లేవుని ,వచ్చే బడ్జెట్ తర్వాతే జీతాల పెంపు ఉండొచ్చు అని ఉద్యోగ జేఏసీ కీలక ప్రతి నిధి ఒకరు తమ ప్రతినిధులకు స్పష్టం చేశారు.తెలంగాణలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో రద్దయిన పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను మళ్లీ ప్రవేశపెట్టటానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదే పేరుతో కాకుండా కొత్త పేరుతో ఈ నియామకం ఉంటుందని సమాచారం.నేడు,రేపు జరిగే సమావేశాల్లో దీని పై కూడా చర్చించ నున్నట్లు తెలుస్తొంది. పలు రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ పై ప్రజాప్రతినిధులు అధ్యయనం చేశారు. ఆ నివేదిక ఆధారం గానే పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం పై చర్చ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం టిఆర్ ఎస్ బలం కాంగ్రెస్ నుంచి చేరిన వారితో కలిపి 103గా ఉంది. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం 17 మందికి మాత్రమే మంత్రి వర్గంలో చోటు కల్పించేలా పరిమితి ఉంది. దీంతో ఎమ్మెల్యేల్లో చాలా మంది మంత్రులు అవుతారని ప్రచారం జరిగినా, చట్ట పరిమితి వల్ల అవకాశం దొరకలేదు. ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికి ఆ స్థానంలో కొత్త వారికి చాన్స్ ఇస్తారని ప్రచారం జరిగినా అది కుదరలేదు. ఈ పరిస్థితుల్లో మంత్రులను వదులుకోకుండా ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తే బాగుంటుందని చర్చలు జరుగుతున్నాయి.