చంద్రబాబు చేసిన పని కూడా చేయలేరా కేసీఆర్?

 

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ బోర్డు నిర్వాకంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాదాపు 20 మంది ఇంటర్ విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే ఇంత జరుగుతున్నా దీనిపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుకి బాధ్యులైన వారిని శిక్షించి మీకు అండగా ఉంటామని.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వలేదు. కనీసం ఆత్మహత్యల పట్ల విచారం వ్యక్తం చేసి.. మిగతా విద్యార్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయలేదు. కేసీఆర్ కి ఓ ఐదు నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టడానికో లేక ఒక ట్వీట్ చేయడానికో కూడా టైం లేదా? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నింట్లో తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీతో పోటీ పడే కేసీఆర్.. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించినా.. తన సొంతం రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు. 'పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విద్యార్ధులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవి. పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి, మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండి. మీ ముందెంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే..చదువు అనేది కేవలం విజ్ఞానానికే, అదే జీవితం కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు. మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే, బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి  మీరిచ్చే బహుమతి.' అని ట్వీట్ చేశారు. ఈ మాత్రం స్పందన తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి కరువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.