ఇంటర్ ఫలితాల తప్పిదాల పై మేము జోక్యం చేసుకోము: హైకోర్టు
posted on Jun 19, 2019 7:31PM
తెలంగాణ లో మొన్న మేలో విడుదలైన ఇంటర్ ఫలితాల లో ఫెయిల్ అయిన విద్యార్ధుల లో కొంత మంది ఆత్మహత్యలు చేసుకోవడం తొ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలలో కొన్ని తప్పులు దొర్లాయని దాని వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దీని పై కొందరు హైకోర్టుకు వెళ్ళడమూ జరిగింది. దీని పై విచారించిన హైకోర్టు ఇంటర్ ఫలితాల్లో తప్పులు జరగడం వాస్తవమేనని.. ఐతే ఈ విషయంలో తామెలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. ఇంటర్ ఫలితాల రీ-వెరిఫికేషన్లో 0.16% మాత్రమే ఉత్తీర్ణులయ్యారని ఈ రోజు తన తీర్పులో హైకోర్టు తెలిపింది. విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరమన్న ధర్మాసనం.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందిగా తాము ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలిపింది. బాధ్యులపై చర్యల విషయంలోనూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు వెల్లడించింది. ప్రభుత్వమే శాఖాపరమైన విచారణచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించింది.