రిజర్వేషన్లపై కేంద్రం తీరుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా

రిజర్వేషన్లపై కేంద్రం తీరుకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టే ధర్నాకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈరోజు మధ్యాహ్నం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. అధిష్ఠానం ఇచ్చిన కార్యాచరణ కావడంతో పార్టీ అగ్రనేతలంతా సీరియస్గా తీసుకున్నారు. రిజర్వేషన్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ తప్పుబడుతోంది. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణా కాంగ్రెస్ ఇందిరాపార్కులో ధర్నా చేపట్టింది. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ధర్నాకు పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో ఉదయం పది గంటల కల్లా పార్టీ నాయకులంతా ఇందిరా పార్కుకు చేరుకోవాలని పిసిసి ఆదేశించింది. పన్నెండు గంటల నుంచి ధర్నా ప్రారంభం కానుంది, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ కుంతియా పార్టీ ముఖ్య నాయకులు ఈ ధర్నాలో పాల్గొంటారు. రిజర్వేషన్ లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు ఇటీవల చేసిన కామెంట్లపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ వాదన మేరకే సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలకనుగుణంగానే కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్ లు కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఉద్యోగాలు కల్పించడంలోనే కాదు ప్రమోషన్ లలో కూడా రిజర్వేషన్ లు అమలు చేయాలన్నదే కాంగ్రెస్ విధానమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు. ఏఐసీసీ ఇచ్చిన కార్యాచరణ కావడంతో ఈ ధర్నాను విజయవంతం చేయాలని టీ ఆర్ ఎస్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి శ్రేణులు ఈ కార్యక్రమానికి తరలి రానున్నాయి. సుప్రీంకోర్టులో కేంద్రం తిరిగి అప్పీల్ చేయడానికంటే ముందే రిజర్వేషన్ ల వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ భావిస్తోంది.