వైసీపీ లక్ష్యంగా.. ప్రజా చైతన్య యాత్ర ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజా చైతన్య యాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని బొప్పూడిలో 11గంటలకు బస్సు యాత్ర ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని గ్రామాలు, వార్డుల్లో 45 రోజుల పాటు ఈ చైతన్య యాత్రలు నిర్వహించనున్నారు. 

ఈ యాత్రతో నవమాసాలు, నవమోసాలు, నవభారాల పేరుతో వైసీపీని టార్గెట్ చేయనుంది టీడాపీ. అదేవిధంగా మూడు రాజధానుల అంశం అమరావతిపై జగన్ తీరును బలంగా జనంలోకి తీసుకెళ్లనుంది. ఈ యాత్రలో భాగంగా పింఛన్ అందక గుండె ఆగిన కుటుంబాలనూ, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను, భవన నిర్మాణ కార్మికులను చంద్రబాబు పరామర్శించనున్నారు. తొలిరోజు యాత్రలో భాగంగా నాలుగు నియోజక వర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇప్పటికే ఉండవల్లి నుంచి చంద్రబాబు ప్రకాశం జిల్లా బయలుదేరారు. అటు కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతోంది.