అన్న క్యాంటీన్ ను ఓపెన్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే!!

 

ఏపీలో టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లను.. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూసివేసిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్‌లను తిరిగి ప్రారంభించాలని టీడీపీ నేతలు గత కొద్దిరోజులుగా ఆందోళన కూడా చేస్తున్నారు. అయితే టీడీపీ నేత, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రం అన్న క్యాంటీన్లను ప్రభుత్వం నడపకపోయినా తాను నడుపుతానంటూ రంగంలోకి దిగారు.

విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) దగ్గరున్న అన్న క్యాంటీన్‌ను ఆయన తిరిగి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్న క్యాంటీన్‌లను తెరిచే వరకు కేజీహెచ్ వద్ద వున్న అన్న క్యాంటీన్‌ను తన సొంత నిధులతో నిర్వహిస్తాన్నారు. రోజుకు 300-350 మంది భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని గణేష్ తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 12.30కి భోజనం పెడతామని గణేష్ తెలిపారు. 

కేజీహెచ్‌కు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రతిరోజు వందల సంఖ్యలో చికిత్స కోసం వస్తుంటారని.. వీరిలో 500 నుంచి 600 మంది అన్న క్యాంటీన్‌లో భోజన వసతి పొందేవారని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వీటిని మూసివేయడం వల్ల నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికెక్కడి నుంచో వచ్చే వారికి విశాఖలో భోజనం చేయ్యాలంటే సుమారు రూ.150 రూపాయలు పెడితే గానీ దొరకడం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పేదల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. అందుకే ప్రభుత్వం అన్న క్యాంటీన్‌లను తెరిచే వరకు కేజీహెచ్ వద్ద వున్న అన్న క్యాంటీన్‌ను తన సొంత నిధులతో నిర్వహిస్తానని గణేష్ తెలిపారు.