పార్టీ మారితే చంద్రబాబుకి చెప్తా..

 

గత కొంత కాలంగా కడప జిల్లా రాజాంపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుంది. కాగా ఈ ప్రచారంపై మేడా స్పందించారు. "ప్రతిపక్షం వారితో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, అయితే.. పార్టీలో వారే కొందరు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి వారి వల్ల టీడీపీకి నష్టం జరుగుతోందని అన్నారు. తన ఎదుగుదల చూసి కావాలనే కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఒక వేళ నిజంగా తాను తెలుగుదేశం పార్టీని వీడదలుచుకుంటే స్వయంగా ముఖ్యమంత్రికే చెప్పి.. వెళ్లిపోతానే తప్ప డొంకతిరుగుడుగా ఎవరో చెప్పిన విధంగా వెళ్లబోనని" స్పష్టం చేశారు. కడప జిల్లాలో టీడీపీ గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం రాజాం పేట. మిగతావి వైసీపీ గెలుచుకుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మలమడుగు, బద్వేల్ ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, జయరాములు టీడీపీలో చేరారు.