టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా
posted on Dec 14, 2018 4:47PM
అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శి విజయ్రాజుకు అందజేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈరన్న తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసారంటూ.. వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి హైకోర్టులో పిటీషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఈరన్నను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. ఈరన్నకు అక్కడా ఎదురు దెబ్బ తప్పలేదు. దీంతో ఆయన ఈరోజు తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సమర్పించేందుకు అసెంబ్లీకి వచ్చారు. అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సూచన మేరకు రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.