కాంగ్రెస్ కు పట్టిన గతే వైసీపీకీ పడుతుంది... జగన్ కు రాజకీయ సన్యాసమే...

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు పట్టిన గతే.... మూడు రాజధానుల ఏర్పాటు తర్వాత వైసీపీకి పడుతుందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చితే వైసీపీ మునిగిపోవడం ఖాయమన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు తర్వాత వైసీపీ పతనం ప్రారంభమవడం ఖాయమన్నారు. అలాగే, దుర్మార్గపు ఆలోచనలు, నియంతృత్వ పోకడలతో జగన్మోహన్ రెడ్డి కూడా శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతారని నిమ్మల కిష్టప్ప జోస్యం చెప్పారు. ఏవిధంగా చూసినా అన్ని ప్రాంతాలకు విశాఖ అనువైనది కాదని అన్నారు. అందుకే, అమరావతిని మార్చొద్దంటూ మంత్రులైనా జగన్ కు నచ్చజెప్పాలని సూచించారు. విశాఖపట్నం రాజధానిగా అనువైనది కాదని మంత్రివర్గ సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి మంత్రులంతా చెప్పాలన్నారు. లేదంటే, మూడు రాజధానుల రగడ వైసీపీని కచ్చితంగా ముంచేస్తుందని నిమ్మల కిష్టప్ప హెచ్చరించారు.