పార్టీ ఫిరాయించిన ఎంపీల నుంచి బెదిరింపులు : బుద్ధా వెంకన్న
posted on Jun 21, 2019 6:10PM
టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎంపీలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారు తనను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హిందీ భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ను అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కేసులు పెట్టి బోల్టులు బిగిస్తారు జాగ్రత్త అని బెదిరించారని తెలిపారు. ఎంపీలు పార్టీ మారిన గంటలోపే బెదిరింపులు మొదలయ్యాయని ఆరోపించారు.
తమ అధ్యక్షుడైన చంద్రబాబు కోసం ప్రాణాలు ఇస్తానని, జైలుకు సైతం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. తనపై కేసులు పెట్టడానికి తానేమైనా బ్యాంక్ దోపిడీలు, చీటింగ్లు చేశానా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ప్రజా సేవకే అంకితమయ్యానని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీ మారే ప్రసక్తే లేదని వెంకన్న తేల్చిచెప్పారు. ఈ బెదిరింపులపై శనివారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తాననితెలిపారు.