ఏపీలో రాజకీయ ఉగ్రవాదం! 

వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తును అంధకారం చేసిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా, ఉపాధి కల్పనా కేంద్రంగా అభివృద్ధి చేస్తే .. జగన్ రెడ్డి సర్కార్ మాత్రం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని ఆయన మండిపడ్డారు.  గతంలో తాము తెచ్చిన  పెట్టుబడులు, పరిశ్రమలన్నింటినీ తరిమేసి అభివృద్ధి నిలిపివేశారని ఆయన విమర్శించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు. రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరం తీసుకుని, విధ్వంసాలు, కక్ష సాధింపులు లేని సమాజాన్ని ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేసి జగన్ రెడ్డి సర్కార్.. స్వయం ఉపాధి అవకాశాలకు గండికొట్టిందని  చంద్రబాబు ఆరోపించారు. యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్నారు.  


రాజకీయ ఉగ్రవాదంతో అన్ని వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది యువతపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారని, సామాజిక మాధ్యమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని  మండిపడ్డారు.  ‘‘67 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఇన్ని ఆలయాలపై దాడులు, విధ్వంసాలు లేవు. ఇంతటి కక్షసాధింపు పాలన, హింసాత్మక చర్యలు గతంలో  చూడలేదు. బీసీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై ఇంతటి దమనకాండ ఏ రాష్ట్రంలోనూ లేదు. చట్టసభలు, పాలనాయంత్రాంగం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, మీడియాపై దాడి చేస్తున్నారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా సమాజాన్ని చైతన్య పరిచే బాధ్యత భుజాన వేసుకోవాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి, భావితరాల ప్రగతికి దోహదపడాలని చంద్రబాబు సూచించారు.