కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. అధికార పార్టీ తెరాస, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతలు ఒకరిమీద ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.. ఇరు పార్టీల నేతల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది.. మొన్నటి వరకు కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్ ఈసారి ఓ అడుగు ముందుకేసి లుచ్చాగాళ్లు అంటూ సంబోధించారు.. ఈ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్సోళ్లు లుచ్చాలా?.. లేదా ప్రాజెక్ట్‌లు కట్టినందుకు కాంగ్రెస్సోళ్లు లుచ్చాలా? మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినందుకు లుచ్చాలమా?.. ఇందిరమ్మ ఇళ్లు కట్టించినందుకు లుచ్చాలమా..? ఏ విషయంలో లుచ్చాగాళ్లమో కేటీఆర్ తెలియజేయాలన్నారు.. ఇంగ్లీష్ స్కూల్లో చదివి, అమెరికాలో పనిచేసిన కేటీఆర్‌కు సంస్కారం ఉందనుకున్నాం.. కానీ స్థాయి మర్చిపోయి మాట్లాడిన కేటీఆర్ నాగరికుడో? అనాగరికుడో అర్థం కావడం లేదని భట్టి మండిపడ్డారు.. అలానే కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అమెరికాలో చిప్పలు కడుక్కునే వాళ్లు అధికార మదంతో కాంగ్రెస్ నేతలను లుచ్చాగాళ్లని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.. ‘మీ నాన్న కేసీఆర్ రాజకీయ జన్మ కూడా కాంగ్రెస్‌లోనే’ అన్న విషయం మరిచిపోవద్దని పొన్నం గుర్తు చేశారు.. అదే విధంగా సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ మాటతీరు మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.. సీఎం కేసీఆర్ తన మంత్రులకు ఎలా మాట్లాడాలో నేర్పించాలని సూచించారు.