ఢిల్లీకి చేరిన తెలుగు 'బిగ్ బాస్' వివాదం!

 

తెలుగు బుల్లితెరపై గత రెండు సీజన్లుగా విజయవంతం అయిన 'బిగ్ బాస్' షో తాజాగా మూడో సీజన్ లోకి అడుగుపెడుతోంది. అయితే మూడో సీజన్ ప్రారంభానికి ముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు షో పేరుతో లైంగిక వేధింపులకు పాలపడుతున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై బిగ్ బాస్ నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా రాయదుర్గం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ హైకోర్టులో వాదోపవాదాలు కూడా జరిగాయి. బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ వివాదం ఢిల్లీకి చేరింది. శ్వేతారెడ్డి, గాయత్రీగుప్తా తమకు ఎదురైన అనుభవాలను ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కమిషన్ సభ్యులను కోరారు. ఈ సందర్భంగా తమ ఫిర్యాదుకు ఎఫ్ఐఆర్ కాపీలను కూడా జత చేశారు. మొత్తానికి తెలుగు బిగ్ బాస్ వివాదం దేశ రాజధానికి చేరింది.