వలస కార్మికుల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

వలస కార్మికుల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బస్సు, రైలు ప్రయాణాల్లో వలస కార్మికుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు వసూలు చేయరాదని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. అంతేకాదు వలస కార్మికులకు బస్సులు, రైళ్లలో ఆహారం అందించాలని ఆదేశించింది. వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు బయలు దేరే ముందే ఆయా రాష్ట్రాలు మంచినీళ్లు, ఆహారం అందించాలని తెలిపింది. రైళ్లలో ఆహారం, నీరు ఇతర ఏర్పాట్లను ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. రైల్వే కూడా వారికి ఆహారం, నీరు ఇతర ఏర్పాట్లు చేయాలి. బస్సుల్లో కూడా ఇదే విధానం అమలు కావాలని ఆదేశించింది. 

వలస కూలీలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా వారు తమ గమ్యస్థానాలకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ముఖ్యంగా కాలి నడకన వెళ్తున్న వలస కార్మికులకు తక్షణమే సాయం అందించాలని సూచించింది. వలస కార్మికులు పడుతున్న కష్టం చూసి గుండె తరుక్కుపోతోందని తెలిపింది. వలస కార్మికుల విషయంలో అనేక లోటుపాట్లను తాము గుర్తించామని.. రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు ఆహారం మంచినీళ్లు అందించే ఏర్పాట్లలో లోపాలు గుర్తించామని తెలిపింది. వారిని వారి స్వస్థలాలకు తరలించే విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వయం ఉండాలని, ప్రతి కార్మికుడూ క్షేమంగా తన ఇల్లు చేరేలా చూడాలని సుప్రీంకోర్టు కోరింది.