నింగీ, నేల, నీరు మనదే.. సునీతా విలియమ్స్ (19సెప్టెంబర్ 1965)

సునీతా విలియమ్స్ పేరు వినగానే.. అంతరిక్ష యానంలో ఆమె చేసిన సాహసాలు గుర్తుకు వచ్చి ప్రతి మహిళ గర్వంగా ఫీల్ అవుతారు. యునైటెడ్ స్టేట్స్ నావికా దళ అధికారిగా పనిచేసిన ఆమె నాసా వ్యోమగామి. రెండుసార్లు అంతరిక్ష యానం చేయడంతో పాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసి రికార్డు
సృష్టించారు.  ఎక్కువ రోజులు (322రోజులు) అంతరిక్షంలో ఉన్న మహిళా వ్యోమగామిగా  ప్రపంచ చరిత్రలో తన పేరు నమోదు చేసుకున్నారు. అంతేకాదు నీటి అడుగుభాగంలో తొమ్మిదిరోజులు ఉండి మరొ కొత్త రికార్డును ఆమె తన ఖాతాలో జమచేసుకున్నారు. ప్రస్తుతం నాసాలో వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నారు.

సునీతా విలియమ్స్ యూక్లిడ్, ఒహియోలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ దీపక్ పాండ్య, బొన్నీ పాండ్య. దీపక్ పాండ్య తండ్రి, తాత భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు.

సునీత మసచుసేట్స్ లోని నీధం హై స్కూల్ లో చదివారు. 1987లో యు.ఎస్. నావల్ అకాడమీ నుండి భౌతికశాస్త్రంలో బి.ఎ. పట్టా అందుకున్నారు. యుద్ధ విమానాల పైలట్‌గా నియమించబడిన  ఆమె నావల్ టెస్ట్ పైలట్ స్కూలు నుంచి 1993లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1995లో ఎం.ఎస్సీ, పట్టా అందుకున్నారు. ఆ తర్వాత  1998లో నాసాకు ఎన్నికయ్యారు. పైలట్ శిక్షణ పొందిన  సునీత  వ్యోమనౌకలో పయనించడంతో పాటు నాసా అంతరిక్షంలో ఏర్పాటుచేసిన స్పేష్ స్టేషన్ లోనూ పనిచేశారు. విలియమ్స్ ఎఎస్-116 అంతర్జాతీయ అంతరిక్ష స్టేషనుకు డిస్కవరీ వ్యోమనౌకలో మొదటిసారి డిసెంబర్ 9, 2006లో పయనమయ్యారు. ఏప్రిల్ 2007లో తిరిగి భూమి మీదకు వచ్చారు.
 
రికార్డు స్థాయిలో విలియమ్స్ 195రోజులు అంతరిక్షంలో ఉన్నారు. నింగిలోనే కాదు నీటిలోనూ ఆమె సాహసాలు చేశారు. నీమో2 సంస్థలో సభ్యత్వం పొందిన ఆమె నీటి అడుగు భాగంలో ఉండే ఆక్వాటిక్ లో తొమ్మిది రోజులు ఉన్నారు.
 
సునీతా పూర్వీకులు భారతీయులు కావడంతో ఆమె 2007లో ఇండియాకు వచ్చారు.
 
రన్నింగ్, స్విమ్మింగ్, బైకింగ్, ట్రయాథాన్, స్నోబోర్డింగ్, హంటింగ్ ఆమె అభిరుచులు. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సునీతా అందుకున్నారు.